.
‘‘మా కుటుంబంలో కూడా ఒకరు డిజిటల్ అరెస్టు అనే సైబర్ మోసానికి గురయ్యారు’’… ఇదీ నాగార్జున వ్యాఖ్య… నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఈరోజు పలువురు సినిమా ప్రముఖులతో భేటీ అయినప్పుడు తనే స్వయంగా చెప్పాడు ఇది… పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు గానీ ఎవరు మోసపోయారు, ఎలా, ఎంత మొత్తం కాజేశారనే వివరాలు చెప్పలేదు… చెప్పాడేమో, మీడియాకు తెలియదు…
డిజిటల్ అరెస్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రబలుతున్న సైబర్ కరోనా… ఈ దుండగులు ఎంత పకడ్బందీగా ఆపరేట్ చేస్తారంటే ఓ తాజా వార్త చెబుతాను… ఒక బెంగుళూరు వెరీ సీనియర్ ఐటీ ప్రొఫెషనల్ మహిళ నుంచి ఏకంగా 31.83 కోట్లు కొల్లగొట్టారు… బహుశా దేశంలోకెల్లా అతి పెద్ద డిజిటల్ అరెస్టు మార్క్ క్రైమ్ ఇదేనేమో… ఈ నేరాన్ని కూడా ప్లాన్డ్గా ఆరు నెలలు నడిపించారు…
Ads
వివరాల్లోకి వెళ్తే… సెప్టెంబరు 15, 20214… బెంగుళూరు, ఇందిరానగర్లో ఉండే ఆమెకు ఓ కాల్ వచ్చింది… మేం డీహెచ్ఎల్ (కొరియర్ సర్వీస్) నుంచి కాల్ చేస్తున్నామని చెప్పారు… మీ ఫోన్ నెంబరు, మీ పేరుతో మూడు క్రెడిట్ కార్డులు, నాలుగు పాస్పోర్టులు, నిషేధిత MDMA డ్రగ్స్ ఉన్న ఓ పార్శిల్ ముంబయి, అంధేరీ బ్రాంచుకు వచ్చిందని చెప్పారు…
ఇక్కడ ఆ గ్యాంగ్ ఎంత తెలివిని చూపిందంటే… ఆమె ఈ పార్శిల్ సమాచారం విని, అంతకుముందే ఈ అనుమానిత పార్శిళ్ల పేరిట డిజిటల్ అరెస్టుకు పాల్పడుతున్నారని చదివి ఉండటంతో… నేను బెంగుళూరులో ఉంటాను, నాకెవడు పార్శిల్ ముంబయికి పంపిస్తాడు అని ప్రశ్నించి, నాకు సంబంధం లేదని పెట్టేయబోయింది… ఐతే మీరు సైబర్ క్రైం వాళ్లకు ఫిర్యాదు చేయండి అని ఆ కాలర్ చెబుతూ ఉండగానే…
ఈలోపు ఆ కాల్ను మరొకరికి ట్రాన్స్ఫర్ చేశారు, వెంటనే ఎవరో సీబీఐ ఆఫీసర్ పేరిట ఆమెతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు… మీ నంబర్ను సైబర్ క్రైమ్ నేరగాళ్లు ట్రాక్ చేస్తున్నారనీ, మీరు లోకల్ పోలీస్ హెల్ప్ అడిగితే మీకే నష్టం, పైగా మీ కుటుంబసభ్యులను కూడా ఇరికిస్తారు అని సీబీఐ పేరిట హెచ్చరించారు…
ఒకవైపు తన కొడుకు పెళ్లి దగరపడుతోంది… పైగా సీబీఐ అనేసరికి భయంతో ఆమె వాళ్ల వలలో పడిపోయింది, చెప్పినట్టల్లా ఆడసాగింది… ఆమెను స్కైప్ కాల్లోకి తీసుకుని, తనను తాను ప్రదీప్ సింగ్ అని పరిచయం చేసుకున్న ఒకడు కొన్నాళ్లు ఆమెను అలాగే ‘లైన్’లో ఉంచుకున్నాడు… తరువాత కొన్నాళ్లకు మా కొలీగ్ రాహుల్ యాదవ్ మీ కేసు డీల్ చేస్తున్నాడని మరొకరిని లైన్లోకి తీసుకొచ్చాడు…
దాదాపు 187 ట్రాన్సాక్షన్స్ ద్వారా ఏకంగా 31.83 కోట్లను తాము చెప్పిన ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు… ఆమె ఫిక్స్డ్ డిపాజిట్లు గట్రా అన్నీ ప్రిమెచ్యూర్ విత్ డ్రా చేయించారు… 2025 ఫిబ్రవరిలోపు మొత్తం వెరిఫికేషన్లు పూర్తి చేసి, వాపస్ చేస్తామన్నారు… ఈ మొత్తం పిరియడ్లో ఆమె ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ డ్యూటీ చేస్తూ వాళ్లు చెప్పినట్టల్లా ఆడింది…
బెదిరింపులకు జడిసి ఎవరికీ చెప్పలేదు… ఆ మొత్తం లావాదేవీలు పూర్తి కాగానే ఇక కనెక్షన్లు కట్… కొడుకు పెళ్లి, అటూ ఇటూ విదేశాలకు ప్రయానాలు, నెలరోజులు అనారోగ్యం, షాక్ కారణంగా లేటుగా ఫిర్యాదు చేస్తున్నాను అంటూ… తన బ్యాంకు ఖాతాల నుంచి ఎవరెవరికి డబ్బు పంపించిందో వివరాలు, ఆధారాలు ఇచ్చింది…
అప్పటివరకూ ఆ ఖాతాలు ఉంటేగా… అందరూ ఎక్కడికక్కడ గప్చుప్… చదువుకున్నవాళ్లు, ఈ నేరాల గురించి తెలిసినవాళ్లయినా సరే, వాళ్లను ఎలా తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారో, బాధితులు ఇట్టే ఆ ట్రాపులో ఇలా పడిపోతున్నారో చెప్పటానికి ఈ వార్త… మరి నాగార్జున కుటుంబం వాారికి ఓ లెక్కా..!!
Share this Article