Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సింగరేణి మట్టి కూడా బంగారమే… అత్యంత విలువైన ‘రేర్ ఎర్త్ మినరల్స్’…

August 20, 2025 by M S R

.

ఉక్రెయిన్‌పై రష్యాకు, అమెరికాకు ఎందుకు పెత్తనం కావాలి..? అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ (అరుదైన భూమూలకాలు) ఉన్నాయి కాబట్టి…

దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో చైనా ఎడాపెడా తవ్వకాలు ఎందుకు సాగిస్తోంది..? అక్కడి రేర్ ఎర్త్ మినరల్స్ కోసం…

Ads

అమెరికాకు పాకిస్థాన్ మీద, మరీ ప్రత్యేకించి బెలూచిస్థాన్ మీద ఎందుకు ఆసక్తి..? అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి…

వీటికోసం అగ్రదేశాల ఆధిపత్య పోరు… ఆక్రమణ యత్నాలు… సుంకాల యుద్ధాలు కూడా…! అలాంటి రేర్ ఎర్త్ మినరల్స్… మన సింగరేణి వేస్ట్‌గా భావించే ఓవర్ బర్డెన్‌లో (బొగ్గు తీశాక మిగిలే మట్టి) ఉన్నాయంటే..? ఆశ్చర్యంగా ఉందా..? కానీ ఇది నిజమే…



సింగరేణి సంస్థకు అదృష్టం తలుపు తట్టింది… కంపెనీకి చెందిన ఓపెన్ కాస్ట్ గనుల వ్యర్థ మట్టిలో (బొగ్గు పొరల్ని వెలికితీసేముందు ఉపరితలం నుంచి తీసే మట్టి), అలాగే దాని థర్మల్ పవర్ ప్లాంట్ల నుండి వచ్చే ఫ్లై యాష్‌లో అరుదైన భూ మూలకాలు (rare earth elements-REEs) ఉన్నట్లు కనుగొనబడింది… ఇది తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వ రంగ సంస్థకు ఆర్థికంగా ఒక పెద్ద బూస్ట్‌గా మారనుంది…

ఈ కీలకమైన విషయాన్ని అధికారులు ఎలా కనుగొన్నారు, దాని ప్రాముఖ్యత ఏంటో ఇక్కడ చూద్దాం:

వ్యర్థాలలో సంపద: ప్రతిరోజూ సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల నుండి వేలాది టన్నుల వ్యర్థ మట్టి బయటకు వస్తుంది. అంతేకాకుండా, కంపెనీకి చెందిన 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నుండి ఫ్లై యాష్ ఉత్పత్తి అవుతుంది. వీటిని సరైన పద్ధతుల్లో వినియోగించుకోవడంపై పరిశోధనలు చేస్తుండగా ఈ విషయం బయటపడింది…

పరీక్షల ద్వారా నిర్ధారణ: భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (IMMT) ల్యాబ్‌లో ఈ ఫ్లై యాష్‌ను పరీక్షించగా, అందులో అరుదైన మూలకాలు ఉన్నట్లు నిర్ధారించబడింది. ఆ తర్వాత ఖమ్మంలోని కల్లూరు, పెద్దపల్లిలోని రామగుండం గనుల నుండి వచ్చిన మట్టిని కూడా పరీక్షించగా, వాటిలో కూడా ఈ మూలకాలు ఉన్నట్లు తేలింది.

14 రకాల అరుదైన మూలకాలు: ప్రాథమిక అధ్యయనాలలో దాదాపు 14 రకాల అరుదైన భూ మూలకాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ముఖ్యమైనవి: సెరియం, లాంతనమ్, నియోడిమియం, ప్రాసియోడిమియం, గాడోలినియం, డిస్ప్రోసియం, లుటేటియం, స్ట్రాన్షియం, వనాడియం, జిర్కోనియం…

ఎక్కువ గాఢత: సాధారణంగా ఈ ఖనిజాల గాఢత 150 నుంచి 220 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) మధ్య ఉంటుంది. అయితే, కొత్తగూడెం జిల్లాలోని దుర్గా గుట్ట గనులలో వీటి గాఢత 266.21 పీపీఎం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) నిర్ధారించింది. ఇది సాధారణ స్థాయి కన్నా చాలా ఎక్కువ…



భవిష్యత్ ప్రణాళికలు…

కేంద్రం అనుమతి: సింగరేణి సంస్థ తమ పరిశోధనల ఫలితాలను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు సమర్పించగా, మరింత అధ్యయనాలు చేసేందుకు అనుమతి లభించింది.

ఉత్పత్తి ప్రారంభం: సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ ప్రకారం…, ఈ నెల నుండి ఈ ఖనిజాల వెలికితీత ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం ఐఐటీ హైదరాబాద్, నాన్-ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ (NFTDC) వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు…

వ్యాపార విస్తరణ: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సమక్షంలో NFTDCతో ప్రాథమిక అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నారు. సింగరేణి నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC)తో, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వంతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆలోచిస్తోంది…

మరింత సంపద: సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో లక్షల టన్నుల వ్యర్థ మట్టి ఉందని, సత్తుపల్లి, రామగుండం, మంచిర్యాల వంటి ప్రాంతాల నుండి సేకరించిన నమూనాలలో ప్రతి 15 టన్నుల మట్టి నుండి ఒక కిలో అరుదైన ఖనిజాలు వెలికితీయవచ్చని బలరామ్ తెలిపారు…



దీని వల్ల దేశానికి లాభాలు.,.

దిగుమతులు తగ్గుతాయి: ప్రస్తుతం అరుదైన ఖనిజాల నిల్వల్లో భారతదేశం ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది. సింగరేణిలో 3 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నట్లు అంచనా వేయడంతో, రానున్న రోజుల్లో ప్రాసెస్ చేసిన అరుదైన మూలకాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు.

ఆర్థిక లాభాలు: ఈ ఖనిజాల వాణిజ్య వెలికితీతతో సింగరేణి ఆదాయం పెరగడమే కాకుండా, జాతీయ ఖనిజ రంగం కూడా గణనీయంగా లాభపడుతుంది.

బహుళ ఉపయోగాలు: ఈ అరుదైన మూలకాలు ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలు, మాగ్నెట్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, ఏరోస్పేస్ పరికరాలు, రక్షణ వ్యవస్థలు వంటి ఆధునిక సాంకేతికతలో విరివిగా ఉపయోగించబడతాయి…

బంగారం, రాగి గనుల తవ్వకాలు, అన్వేషణకు సంబంధించి కీలకమైన ఒప్పందాలు చేసుకున్నదని, అది రాబోయే రోజుల్లో సింగరేణి ఆదాయాన్ని పెంచబోతున్నదని నిన్న ముచ్చటించుకున్నాం కదా… ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సింగరేణికి మరింత బంగారం… ఎస్, సింగరేణి దశ ఇంకా ఇంకా మారబోతోంది..!! .... అప్పరసు శ్రీనివాసరావు, హిందుస్థాన్ టైమ్స్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగరేణి మట్టి కూడా బంగారమే… అత్యంత విలువైన ‘రేర్ ఎర్త్ మినరల్స్’…
  • ఎందుకు కట్టాలి టోల్..? భలే బాగా చెప్పారు యువరానర్…
  • వేరే గ్రహాల దాకా దేనికి..? ఈ భూమి లోపలే తెలియని ఏవో ప్రపంచాలు…!
  • భలే మ్యాషప్ చేశారబ్బా..! అరుదైన స్వరవిన్యాసాలు, స్వరప్రయోగాలు..!!
  • సింగరేణి అంటే నల్లబంగారమే కాదు… ఇప్పుడిక అసలు బంగారం కూడా..!!
  • అవునూ.., హిందూ ఉత్సవాల వేళ భారత్ మాతాకీ జై అనకూడదా..?!
  • తెలుగు అభ్యర్థి..! ఇండియా కూటమిలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు..!!
  • మార్వాడీ గో బ్యాక్…! అశాంతి రేపే అసాంఘిక శక్తులకు చుక్కెదురు…!!
  • ఎక్కడో న్యూజిలాండ్‌లో కనిపించేవి… ఇప్పుడివి ఖమ్మం అడవుల్లో ప్రత్యక్షం…
  • సింహాసనం , నిరీక్షణ , స్వాతిముత్యం… నడుమ పుణ్యస్త్రీ స్లో సక్సెస్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions