.
పెళ్లయిన 9 రోజులకే నా భర్త రాజు పాల్ను హత్య చేసిన దుర్మార్గులను యోగి బొందపెట్టాడు.., నేరగాళ్లను ఏమాత్రం ఉపేక్షించని సీఎం యోగికి అభినందనలు……. ఈ మాటన్నది ఎవరు..? పూజా పాల్…
ఎవరామె..? సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే… వెంటనే ఆ పార్టీ అధినేత అఖిలేష్కు ఎక్కడో కాలింది… తన పార్టీ డీఎన్ఏ మొత్తం మాఫియా, క్రిమినల్సే కదా… పరమ అరాచక పాలన తనది…
Ads
ఏయ్, మన ప్రబల శత్రువు యోగిని మెచ్చుకుంటావా అని వెంటనే ఫైరయిపోయి, ఆమె పార్టీ నుంచి ఫైర్ చేశాడు… క్రిమినల్స్, మాఫియా గ్యాంగ్స్టర్ల పట్ల యోగి ప్రభుత్వ యాక్షన్ను ఆమె ప్రశంస అతి పెద్ద సర్టిఫికెట్…
సరే, ఈ కథంతా పత్రికల్లో చదివారు కదా… ఇక్కడ ఒక దంపతుల గురించి చెప్పుకోవాలి… వాళ్లెవరంటే..? రుక్సానా, సాదిక్… ఆ రాజు పాల్ హత్య కేసుకు సాక్షులు… 19 ఏళ్లుగా ఎన్నో బెదిరింపులు, దాడులు, అక్రమ కేసుల్ని కూడా ఎదుర్కుని… ఏమాత్రం సరెండర్ గాకుండా ఆ హత్య కేసు ఓ కొలిక్కి రావడానికి సహకరించారు…
19 ఏళ్ల క్రితం, అంటే 2005 జనవరిలో జరిగిన ఈ సంఘటన రుక్సానా, సాదిక్ దంపతుల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది… రాజు పాల్ కుటుంబానికి న్యాయం జరగాలన్న వారి సంకల్పం మొక్కవోనిది… రాజు పాల్ వారి కుటుంబ స్నేహితుడు… వారి ధైర్యానికి ఫలితంగానే నిందితులకు శిక్ష పడింది…
ఘటన జరిగిన రోజును గుర్తు చేసుకుంటూ రుక్సానా…, “మేము మా అక్కను కలవడానికి వెళ్తున్నప్పుడు, చౌఫత్కా క్రాసింగ్ వద్ద మా స్కూటర్ ఆగిపోయింది. అప్పుడు రాజు భయ్యా తన కారులో మా దగ్గరికి వచ్చి లిఫ్ట్ ఇచ్చారు. నేను కారులో కూర్చున్నాను, మా ఆయన పెట్రోల్ పంప్ వైపు వెళ్లారు.
రాజు పాల్ కారు డ్రైవ్ చేస్తుండగా, దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. నాకు రెండు బుల్లెట్ గాయాలు తగిలి నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను. కళ్లు తెరిచేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. ఆ రోజు రాజు భయ్యా నా కళ్ల ముందే చనిపోవడం తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుంది…’’ అని వివరిస్తోంది…
ఈ సంఘటన తర్వాత రుక్సానా రెండు నెలల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది… “ఈ హత్య తర్వాత అతిక్, అతని గ్యాంగ్ మా వెంటపడటంతో మా జీవితాలు పూర్తిగా మారిపోయాయి… రాజు పాల్ మా కుటుంబ స్నేహితుడు, అతను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మేము అతనికి మద్దతు ఇచ్చాం… అందుకే అతని హత్య కేసులో సాక్షులుగా ఉండాలని నిర్ణయించుకున్నాం..,” అని ఆమె అన్నారు…
ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉన్న ఆమె భర్త సాదిక్ మాట్లాడుతూ, “రుక్సానా ముఖ్య సాక్షి కావడంతో అతిక్, అతని గ్యాంగ్ మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టారు. గత 19 ఏళ్లుగా మేము చాలా రకాలుగా వేధింపులకు గురయ్యాము, రెండు సార్లు ఇళ్లు కూడా మార్చుకోవాల్సి వచ్చింది. అతిక్ నన్ను, నా కుటుంబాన్ని అక్రమ కేసుల్లో ఇరికించాడు, కానీ మేము మా నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఒకసారి అతిక్ అనుచరులు మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరించారు. అప్పుడు మేము మా లైసెన్స్ గన్తో వారిపై కాల్పులు జరపడంతో వారు పారిపోయారు. ఈ విషయాన్ని మేము పోలీసులకు, సీబీఐకి కూడా చెప్పాం…”
ఈ కేసులో మరో సాక్షి అయిన ఓం ప్రకాష్పై కూడా అతిక్ దాడి చేసి, స్టేట్మెంట్ మార్చుకోవాలని ఒత్తిడి చేశాడని తెలిసింది… అయితే, తరువాత అతను సీబీఐ ముందు తన స్టేట్మెంట్ను సరిదిద్దుకున్నాడు… 2019లో, రాజు పాల్ హత్య కేసులో నిందితుడైన అబ్దుల్ కవి, ఓం ప్రకాష్పై అతని స్వగ్రామంలో కాల్పులు జరపగా, అతను తప్పించుకోగలిగాడు…
అడ్వకేట్ ఉమేష్ పాల్ కూడా రాజు పాల్ హత్య కేసులో ఒక సాక్షిగా ఉన్నారు. అయితే, అతిక్ అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించడంతో అతను కోర్టులో విరోధి సాక్షిగా మారిపోయాడు… ఆ తర్వాత సీబీఐ కూడా ఉమేష్ పేరును సాక్షుల జాబితా నుంచి తొలగించింది… 2007లో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, ఉమేష్ పాల్ తన కిడ్నాప్, దాడికి సంబంధించి అతిక్, ఖాన్ సౌలత్, ఇతర వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు… 2023 ఫిబ్రవరిలో ఉమేష్ పాల్ హత్యకు గురయ్యాడు…
ఇలా ఆ రాజు పాల్ హత్య కేసులో సాక్షులందరినీ వేటాడారు అతీక్, అష్రఫ్ అండ్ గ్యాంగ్… కానీ రుక్సానా దంపతులు స్థిరంగా నిలబడటంతో ఆ కేసులో వాళ్లతోపాటు మరికొందరిని దోషులుగా నిర్ధారించింది… తరువాత అతిక్ అహ్మద్, అష్రాఫ్ 2023 ఏప్రిల్లో, వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మీడియా ప్రతినిధులలాగా వచ్చి వారిని కాల్చి చంపారు… కేస్ ఖతం…
మరి లాయర్ ఉమేష్ పాల్ను హతమార్చిన అర్బాజ్, విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ ఏమయ్యారు..? వాళ్లు కూడా ఎన్కౌంటర్లో మరణించారు… యోగి ఇచ్చిన తీర్పు, అమలు చేసిన శిక్ష… అవునూ, ఇంతకీ అతీక్, అష్రఫ్ రాజు పాల్ మీద పగ ఎందుకు పెంచుకున్నారు..?
అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం అతిక్ అహ్మద్కు కంచుకోట లాంటిది. అక్కడ నుంచి అతిక్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2004లో ఆయన లోక్సభకు ఎన్నికవ్వడంతో, ఆ స్థానం ఖాళీ అయింది… ఆ ఉప ఎన్నికల్లో అతిక్ సోదరుడు అష్రాఫ్ను బరిలోకి దించాడు… కానీ ఆ ఉపఎన్నికల్లో అష్రఫ్ మీద రాజుపాల్ గెలిచాడు… పైగా అష్రఫ్ గ్యాంగ్కు ఎదురొడ్డి నిలిచాడు రాజు పాల్… దాన్ని తట్టుకోలేక ఏకంగా రాజు పాల్నే హతమార్చారు ఆ సోదరులు…
రాజు పాల్ హత్య తరువాత జరిగిన ఉపఎన్నికలో ఆయన భార్య పూజా పాల్ను బీఎస్పీ నుంచి మాయావతి పోటీచేయించింది, కానీ ఓడిపోయింది పూజ… కానీ తరువాత 2007లో అదే అష్రఫ్ మీద గెలిచింది… 2012 లో కూడా గెలిచింది… తరువాత ఆమె ఎస్పీలో చేరింది… ఇదీ ఆమె నేపథ్యం…
ఆమె బ్రాహ్మిన్, తను పెళ్లి చేసుకున్న రాజు పాల్ ఎస్సీ,., కులాంతర వివాహం… తరువాత చాన్నాళ్లకు, అంటే 2022లో ఆమె మరో పెళ్లి చేసుకుంది, ఆయన పేరు బ్రిజేష్ వర్మ… అదీ కులాంతర వివాహమే… ఇదీ పూజా పాల్ కథ…!
Share this Article