Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాయకుడు పదే పదే గట్టిగా చెప్పాడంటే… దానికి వ్యతిరేక దిశలో వెళ్తున్నట్టు లెక్క…

September 26, 2023 by M S R

జర్నలిస్ట్ లు అవకాశం ఉన్నంత వరకు చదవాలి . 87 నుంచి 94 వరకు జిల్లాల్లో పని చేసేప్పుడు చాలా మంది జర్నలిస్ట్ లు జిల్లా పేజీలు మాత్రమే చదివేవారు . ఆ తరువాత మనం రాసిన వార్త మనం చదివితే పేపర్ చదివినట్టే అనే దశకు చేరుకున్నాం . ఇప్పుడు ఆ దశ కూడా దాటి పోయి టివిలో న్యూస్ చూడడమే తప్ప చదవడం అనే అలవాటు తగ్గిపోయింది .నాయకుల మాటల్లో మర్మం అర్థం చేసుకోవడానికి ఓషో రచనలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి . మాట్లాడే మాటల అర్థాలు వేరు కావచ్చు , కానీ వాటి వెనుక మతలబు వేరుగా ఉంటుంది .. ఆ మతలబును అర్థం చేసుకోవడంలో ఓషో రచనలు ఉపయోగపడ్డాయి .

********

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన కొత్తలో ఎన్టీఆర్ భవన్ లో అప్పటి టీడీపీ నాయకుడు తమ్మినేని సీతారాం విలేకరుల సమావేశం . సమావేశానికి ముందు , సమావేశం తరువాత నాయకులు మీడియాతో ఇష్టాగోష్టిగా మనసులో మాట మాట్లాడుతుంటారు . విలేకరుల సమావేశాల్లో పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినా అసలు విషయాలు ఇష్టాగోష్ఠిలోనే పంచుకుంటారు .

Ads

చిరంజీవి పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది ? అని సీతారాం విలేకరుల అభిప్రాయం అడిగారు . ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు . అంతంత మాత్రమే ప్రభావం ఉంటుంది .. నమ మాత్రంగానే సీట్లు గెలుస్తారు అని విలేఖరులు తమ అభిప్రాయం చెప్పారు . లేదు, మీరు చూస్తూ ఉండండి, ప్రజారాజ్యం ప్రభావం చాలా ఉంటుంది . బాగానే గెలుస్తారు అని తమ్మినేని చెప్పుకొచ్చారు .

విలేకరుల సమావేశం టైం కాగానే అదే తమ్మినేని స్టేజి మీదకు వెళ్లి వీరావేశంతో ప్రజారాజ్యంను , చిరంజీవిని తీవ్రంగా విమర్శించారు . తమ్మినేని మాట తీరు ఏకపాత్రాభినయంలా గంభీరంగా ఉంటుంది . ఆవేశం తెచ్చిపెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించి .. అకారణంగా, అంత ఆవేశంగా ప్రజారాజ్యంను తిడుతున్నారేమిటి అనడిగి… చూస్తుంటే మీరు కూడా ప్రజారాజ్యంలోకి వెళుతున్నట్టు ఉంది అన్నాను . తమ్మినేని అంతే ఆవేశంగా ఏంటీ నేనా ? ప్రజారాజ్యంలోకి వెళ్లడమా ? చివరి వరకు టీడీపీలోనే ఉంటాను , నా శవం మీద టీడీపీ జెండా కప్పాలి అంటూ ఆవేశంగా చెప్పారు . విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన్ని మళ్ళీ పార్టీలో చూడలేదు . ఎందుకంటే అటు నుంచి అటే వెళ్లి ప్రజారాజ్యంలో చేరారు .

తమ్మినేని అంత ఆవేశంగా ప్రజారాజ్యంను విమర్శిస్తుంటే .. మీరు ప్రజారాజ్యంలోకి వెళ్లేట్టు ఉన్నారు అని ప్రశ్నించడం ఒక రకంగా చూస్తే అర్థం లేని ప్రశ్న అవుతుంది . కానీ ఓషో పుణ్యమా అని అలా ప్రశ్నించాను . నువ్వు ఏదైతే కాదో అదే పదే పదే చెప్పడానికి ప్రయత్నిస్తావు అని ఓషో అంటాడు . మనసులో ఉన్నది ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది అంటాడు …

నాయకుడైన , మాములు వారైనా విలువల గురించి ఎక్కువగా మాట్లాడితే ఓషో చెప్పిన మాట ప్రకారం అతన్ని ఎక్కువగా అనుమానించడం నాకు అలవాటు .

ఓ జర్నలిస్ట్ మిత్రుడు ఉండేవాడు . తెలంగాణ పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ , అంతే గాఢంగా టీడీపీని అభిమానించేవాడు . రాజకీయ పక్షాల్లో విలువలు ముఖ్యం అంటూ ఫేస్ బుక్ లో తెగరాసేవాడు . ఇప్పుడు ఎక్కడ ఉన్నడో తెలియదు కానీ …. తెలంగాణ ప్రభుత్వం గొర్రెలు , బర్రెలు ఇప్పించే పథకంలో కొంతమందితో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడితే అరెస్ట్ చేశారు . తరువాత ఏమైందో తెలియదు .

*************

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అణుఒప్పందంపై వామపక్షాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చాయి . ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు . కోట్ల రూపాయలు ఇచ్చి టీడీపీ ఎంపిలను కొనే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మీడియాలో వార్తలు . ఓ రోజు ఎన్టీఆర్ భవన్ లో ఓ ఎంపీని పలకరిస్తే కోట్ల రూపాయలు ఆఫర్ ఇస్తున్నారని మీరు వార్తలు రాయడమే కానీ ఒక్కరు కూడా సంప్రదించలేదు అని నవ్వుతూ అన్నారు . టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ , టీడీపీ శాసనసభా పక్షం కార్యాలయం ఇంటి వ్యవహారంలా ఉండేది . వాళ్ళు వాళ్ళే కుటుంబ సభ్యుల్లా మాట్లాడుకుంటారు . అదే కాంగ్రెస్ శాసనసభా పక్షం కార్యాలయం నానా జాతి సమితిలా ఉంటుంది . అన్ని పార్టీల నాయకులు , రిపోర్టర్లు అక్కడికి చేరుకునేవారు . అన్ని పార్టీల వ్యవహారాలు అక్కడ చర్చకు వచ్చేవి .

పెళ్లి చేసుకుంటావా తాతా అంటే ఈ వయసులో పిల్లను ఎవడిస్తాడు అంటాడు తాత . అంటే ఇస్తే చేసుకోవడానికి రెడీ అన్నమాట . మనసులో ఉన్నది ఇలా ఎలాగో బయటకు వస్తుంది . ఓషో చెప్పిన దాని ప్రకారం .. ఇప్పటి వరకు ఒక్కరూ డబ్బులు ఇస్తామని ఆఫర్ చేయలేదు అంటే ఆ ఎంపీ డబ్బులకు సిద్ధం అన్నమాట… అక్కడ జరిగిన చర్చలో నా అభిప్రాయం నేను చెప్పాను .. తరువాత ఏం జరిగిందో , ఎవరు ఏం చేశారో , ఎంత ఇచ్చారో తెలియదు కానీ . టీడీపీ ఓట్లు రెండు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా పడ్డాయి . ప్రభుత్వం నిలబడింది . ఎంపిలను కొనడం అనైతికం కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ దేశానికి చేసిన మేలు అంతా ఇంతా కాదు . అణు ఒప్పందం వల్ల దేశం ఈ రోజు శక్తి వంతంగా తయారు అయింది .. ధైర్యంగా నిలబడింది… – బుద్దా మురళి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొమ్మినేని అరెస్టు… పత్రికాస్వేచ్ఛ మీద ఓ సుదీర్ఘ తటస్థ విశ్లేషణ..!!
  • తెలంగాణ అంటే ఇక తాగుడేనా..? ఇవేం ముద్రలురా భయ్..?!
  • ఎలన్ మస్క్‌‌కు రాయునది ఏమనగా… కాస్త నేను చెప్పేదీ ఓసారి విను…
  • కృతి మహేశ్… లండన్‌లో ఫోరెన్సిక్ సైన్స్ పీజీ… ఇప్పుడు డాన్స్ ఫ్లోరే బతుకు…
  • జయమాలిని కేవలం మసాలా డాన్సర్ కాదు… ఫుల్ లెంగ్త్ రోల్ సుమలతలాగే…
  • ఆడదాని ఒళ్లు ఎఫెక్టివ్‌‌గా అమ్మగలగడమే సినీవ్యాపార సూత్రం..!!
  • ఆ దంపతులు నడిపితేనే.. నాటి రాజకీయ ప్రముఖుల విమానయానం…
  • జైన వెడ్స్ బ్రాహ్మణ… ఒక సంపూర్ణ సంప్రదాయిక పెళ్లి వేడుక…
  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions