.
డిస్క్లెయిమర్… ఇది కేవలం విశ్వాసులకు, ఆధ్యాత్మిక అనురక్తులకు, తీర్థయాత్రికులకు మాత్రమే… మిగతా వాళ్లు దయచేసి అవాయిడ్ చేయండి… కొంచెం పెద్ద స్టోరీ… మామూలు భక్తులకే కాదు, దత్తాత్రేయ భక్తులకు, గానుగాపూర్, మంత్రాలయం పర్యాటకులకు ప్రత్యేకం…
.
Ads
ఓసారి మా సమీపబంధువునే తిరుమలకు తీసుకెళ్లాను, వాడినీ వీడినీ పట్టుకుని, సిఫారసు లెటర్ తీసుకుని… తిరుమల వెంకన్న భక్త సులభుడు కాదు కదా… దేవుడి దగ్గర దాకా నేరుగా వెళ్లి, దండం పెట్టుకుని, బయటకు వచ్చాక ఏమన్నదీ అంటే..?
అయ్యో, అలా పోయాం, ఇలా వచ్చాం… దర్శనం చేసుకున్నట్టే లేదు అని… కొందరి మైండ్ సెట్ అంతే… భక్తసులభుడిగా ఉంటే ఆ దేవుడికే విలువ ఉండదు… అప్పుడప్పుడూ నిజమే అనిపిస్తుంటుంది… వీవీఐపీలకు శాలువాలు, ఆశీర్వచనాలు, బంగారు వాకిలి దర్శనాలు, ఫోటోలు జస్ట్, మీడియాలో రాసుకునే చెత్త వార్తల కోసం తప్పితే,… ఆ దేవుడు వాళ్లను ఆశీర్వదిస్తాడనేది భ్రమే…
అప్పట్లో గవర్నర్ నరసింహన్ కథ చూశాం కదా… గంటల కొద్దీ భక్తుల క్యూలు ఆపేసేవాళ్లు, వాళ్లు లోలోపల బండబూతులు తిట్టుకునేవాళ్లు… సరైన రీతిలో లేకపోతే పూజారులనే తిట్టిపోసేవాడు ఆయన… ఎంత పాపం మూటగట్టుకున్నాడో, యాడ ఉన్నాడో నాకు తెలియదు గానీ…
వ్యయమో, ప్రయాసో… ఆ దేవుడు పిలిస్తేనే వెళ్లగలం… మామూలుగా నువ్వు ఎంత సంకల్పించినా వెళ్లలేం… అది కాలనీలోని చిన్న గుడి కావచ్చు, అమరనాథ్ కావచ్చు… చాన్నాళ్లుగా అనుకుంటున్నా సరే, వర్కవుట్ కాలేదు, ఎప్పుడూ ఏదో అడ్డంకి… మొన్న పిలుపు వచ్చింది… హఠాత్తుగా వర్కవుట్ అయిపోయింది…
గమ్యం… కురువాపురం… తెలంగాణ, కర్నాటక బోర్డర్లో… కృష్ణా నదీ ప్రవాహం మధ్యలో ఓ ద్వీపంలో ఉన్న గుడి… చిన్న గుడి… చాలా చిన్నది… దీన్నే కురుగడ్డి అనీ అంటారు… దీని విశేషం, ప్రాశస్త్యం ఏమిటంటే..?
కర్నాటకలోనే, గుల్బర్గా పరిధిలో గానుగాపూర్ తెలుసు కదా… అది దేనికి విశేషం అంటే… దత్తాత్రేయుడి రెండో అవతారం నృసింహ సరస్వతి స్వామీజీ తపోభూమి అది… అక్కడ మతిస్థిమితం లేనివాళ్లకు స్వాస్థత చేకూరుతుందని ప్రతీతి… దాని విశేషాలు గతంలో చెప్పుకున్నాం… మరి ఈ కురువాపురం..?
అదే దత్తాత్రేయుడి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడి తపోభూమి ఇది… మంత్రాలయంలో కూడా అంతే కదా… రాఘవేంద్రస్వామి సమాధి… ఈ యోగులు సంచరించిన ప్రాంతాల్లో విశేషమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుందనేది భక్తుల నమ్మకం… సరే, కురువాపురం వద్దాం…
నలుగురం బయల్దేరాం… కారు… హైదరాబాద్ నుంచి 180- 190 కిలోమీటర్లు… శంషాబాద్ రూట్లో, మహబూబ్నగర్, మక్తల్… అక్కడి నుంచి లెఫ్టు,.. వెళ్లేటప్పటికి రాత్రి 8.30 గంటలు… ఎదురుగా కృష్ణా నది… ఇటు గట్టు తెలంగాణ… నది దాటితే కర్నాటక… మధ్యలో ఓ ద్వీపంలో గుడి…
ఇటు గట్టు మీద ప్రాంతాన్ని వల్లభాపురం అంటారు… కాస్త వసతి సౌకర్యం ఉంది… చాలా తక్కువ మందికి వోకే… అక్కడేమీ దొరకదు తినడానికి.,. చాయ్ తప్ప, టిఫిన్లు గట్రా ఏమీ దొరకవు… కానీ రాత్రి నిద్ర చేస్తే గుడి ఆవరణలోనే చేయాలని కదా… మరి ఆ రాత్రి ఆ నది దాటించే గుహుడు ఎవరు..?
వేసవి… నదిలో నీళ్లు లేవు… ఎండిపోయి కనిపిస్తూనే ఉంది… అక్కడ వర్షాకాలంలో నీళ్లున్నప్పుడు భక్తుల్ని తీసుకుపోవడానికి బుట్టీలు లేదా బోట్లు నడిపిస్తుంటారు… ఇప్పుడు బోట్ల గిరాకీ లేదు కదా, అక్కడే చాయ్ హోటల్ నడుపుకునే నవీన్ అనే పిల్లాడు నేను దారి చూపిస్తాను అన్నాడు… అంటే..?
ఏమీ లేదు… అన్నీ బండరాళ్లు, మధ్యలో చిన్నవి, సన్నని నీటిపాయలు… అక్కడక్కడా లోతు… ఇసుక పర్రలు… ఎలా వెళ్తే బెటరో నేను తీసుకెళ్తాను అన్నాడు… ఫీజు సరేసరి… బయల్దేరితే… ఓ బండరాయి మీద నుంచి మరో బండరాయి మీదకు కాళ్లు… నడుమ ఇసుక పర్రలు, నీటి పాయలు… ఒకటీరెండు చోట్ల మోకాళ్ల పైదాకా నీళ్లు…
అప్పుడెప్పుడో నల్లమల సలేశ్వరం జాతర వెళ్లిన అనుభవం గుర్తొచ్చింది… అదీ ఇంతే… 3 కీలోమీటర్లకు పైగా దట్టమైన అడవిలో దుర్గమమైన బాటలో ట్రెక్కింగ్… ఈ నది దాటాక దాన్ని కురుగడ్డి అంటారు… చాలా తక్కువ మంది భక్తులకు వసతి… అదీ పూజారి ఫోన్ నంబర్ తీసుకుని ముందుగా అడిగితే… వీలుగాకపోతే 300- 400 దాకా పడుకోగల పెద్ద హాల్ (సత్రం) ఉంది… ఫ్యాన్లు, టాయిలెట్స్, మంచినీళ్లు ఉన్నయ్…
ఇంటి నుంచి తెచ్చుకున్న పెరుగన్నం తినేసి, పడుకుని పొద్దున 4 గంటలకే లేచి, నదిలో స్నానం చేసి, నేరుగా గుడిలోకే… 5 నుంచి 8 గంటల దాకా అభిషేకాలు ఉంటాయి… మామూలు రోజుల్లో ఇక్కడికి 100- 200 మంది దాకా వస్తారు, పౌర్ణమి రోజున 500- 600 మంది దాకా… అంతే…
అభిషేకానికి గానీ, దర్శనాలకు గానీ, ఇతరత్రా ఏ టారిఫులూ లేవు, దోచుకునేదీ లేదు… నచ్చింది ఏమిటంటే..? అభిషేకానికి అక్కడ కూర్చున్నవాళ్లతో ఆ మఠ సంప్రదాయంలో ఎక్కడా ఏ డీవియేషనూ లేకుండా పూజ చేయిస్తారు… ఆహా… నానా కష్టాలూ పడి, బోలెడు ధారబోసి, అలా వెళ్లి, ఇలా దండం పెట్టేసి, సిబ్బంది పోపో అని తోసేస్తుంటే బయటికి వచ్చేసే పెద్ద పెద్ద క్షేత్రాలకన్నా ఎంత బెటరో కదా…
మరి గానుగాపూర్ ఎందుకంత ఫేమస్ అయిపోయింది..? నిజానికి ఎక్కువ ప్రాశస్త్యం ఇక్కడ కదా..? విలువైన ప్రశ్నే… కానీ గానుగాపూర్కు రవాణా సౌకర్యాలున్నాయి… వసతి, భోజన సౌకర్యాలున్నాయి… కానీ కురువాపురంలో అవేవీ లేవు… అదీ పెద్ద డ్రా బ్యాక్…
పైగా గానుగాపూర్ను పాజిటివ్ మౌత్ టాక్తో (నిమిషాంబిక టెంపుల్ తరహాలో) హైదరాబాద్ వాళ్లే చాలా ఫేమస్ చేశారు… గురు పౌర్ణిమ రోజున పెద్ద జాతరే, తట్టుకోవడం కష్టం… సరే, ఎవరి నమ్మకాలు వాళ్లవి… కానీ కురువాపురం వెళ్లాలనుకునేవారికి కొన్ని సూచనలు…
సొంత వాహనం బెటర్… రాత్రి నిద్రకు వెళ్లేవాళ్లు సొంతంగా పులిహోర, పెరుగన్నం తీసుకుపోతే బెటర్… హాలులో పడుకోవాలంటే చాపలు ఇస్తారు వాళ్లే… పొద్దున అభిషేకం అయ్యాక మక్తల్ వచ్చాకే టిఫిన్లు… వర్షాకాలం అయితే నది దాటడానికి బోట్లు, బుట్టీలు ఉంటాయి… వేసవిలో మాత్రం నడిచి పోవాల్సిందే… సాహసయాత్ర… ఎక్కువ జనం మహారాష్ట్ర నుంచి వస్తుంటారు… గానుగాపూర్ కూడా అంతే కదా…
గుడికి సమీపంలోనే శ్రీపాద శ్రీవల్లభ తపస్సు చేసిన గుహ, చెట్టు ఉంటాయి… ఆ గుహను రెండు నెలలుగా మూసేసారు… కారణం తెలియదు…
ఇటు వైపు నది గట్టు మీద ఓ గుడి… వెళ్తే దత్తాత్రేయుడి భార్య అని చెప్పాడు పూజారి… దత్తాత్రేయుడికి భార్యలున్నారా అని ఆశ్చర్యంతో అనడిగితే ఏదో కథ చెప్పాడు… సరే, తిరిగి వచ్చేటప్పుడు మన్యంకొండ గుడి… వెంకటేశ్వరుడి గుడి… గుట్టపైకి ఘాట్ రోడ్డు… దేవాదాయ శాఖ పరిధిలోనిది…
నాకు అస్సలు నచ్చలేదు, చెత్తా మెయింటెనెన్స్… మరీ ఓ పూజారి అయితే బొట్టు లేదు, జంధ్యం లేదు… బుడ్డ గోచీ కట్టుకుని ఉన్నాడు… ఇదేమని అడిగితే జంధ్యం వేసుకుంటే ఎలర్జీ అట… అరాచకం… ఇవెలా ఉన్నా, వెళ్లగలిగితే… జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే… కురువాపురం మాత్రం ఆధ్యాత్మిక సంతృప్తి..!! (దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా…)
సూచన… టీటీడీ ఎక్కడెక్కడో కొత్త గుళ్లు కట్టడానికి కోట్లకుకోట్లు పెట్టేబదులు ఇలాంటి ప్రాశస్త్య క్షేత్రాలను మౌలిక వసతుల కల్పన కోసం దత్తత తీసుకుంటే బెటర్ కాదా… సర్లెండి, టీటీడీ పాలన గురించి తెలిసిందే కదా అంటారా..? అంతేలెండి..!!
Share this Article