.
నిన్న ఓ ఫోటో వైరల్ అయ్యింది తెలుసు కదా… ఆనంద్ మహేంద్ర రాఫెల్ రాణి అని ప్రస్తావించిన ఓ పైలట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాఫెల్ ఫైటర్ డోర్ వద్ద దిగిన ఫోటో అది… ఆమె పేరు తెలుసా..? శివాంగీ సింగ్..!
ఐతే చాలామంది అనుకుంటున్నట్టు ఆమె ద్రౌపది ముర్మును రాఫెల్లో తీసుకుపోలేదు… ఆ సమయంలో పైలట్ ఆమె కాదు… ఆ రాఫెల్ నడిపింది గ్రూప్ కెప్టెన్ అమిత్ గెహాని (Group Captain Amit Gehani)…
ఆమె ఆ సమయంలో అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉన్న 17 స్క్వాడ్రన్ ‘గోల్డెన్ యారోస్’ కమాండింగ్ ఆఫీసర్గా (Commanding Officer) ఉంది… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీం కమాండర్గా 30 నిమిషాల పాటు రాఫెల్ విమానంలో ప్రయాణించింది… అదీ విశేషం…
Ads
మరి శివాంగీ సింగ్ ఎందుకు ఆ ఫోటో దిగింది…? శివాంగీ రాఫెల్ నడిపిన మొట్టమొదటి మహిళా పైలట్… ఆమె రాష్ట్రపతి రాఫెల్ ప్రయాణ సమయంలో ఆ ఫైటర్ విమానం గురించి పూర్తి వివరాలు ఆమె చెబుతూ, ఆమెతో ఓ ఫోటో దిగారు… అదీ సంగతి… ఆగండి… ఇంతకీ ఎవరామె..?
భారత వైమానిక దళం (IAF) 2016 లో మహిళలను ఫైటర్ స్ట్రీమ్లోకి అనుమతించినప్పటి నుండి, అనేక మంది మహిళా పైలట్లు చరిత్ర సృష్టించారు…. వీరిలో శివాంగి ప్రత్యేకత ఏమిటీ అంటే..? అంతకుముందు మిగ్-21 బైసన్ నడిపిన ఆమె రాఫెల్ కూడా నడిపిన మొదటి మహిళా పైలట్…
అంతకుముందు అవని చతుర్వేది, భావనా కాంత్, మోహనా సింగ్ జితర్వాల్… వీళ్లు 2016లో ఫైటర్ జెట్లు నడిపే శిక్షణ పొందిన తొలి బ్యాచ్… తరువాత 2017 బ్యాచ్ శివాంగీ సింగ్… వీళ్లంతా గోల్డెన్ యారోస్లో సభ్యులు… యుద్ధ విమానాలన్ని నడిపేందుకు అర్హత, శిక్షణ, అనుభవం ఉన్నవాళ్లు… వీళ్లు గాకుండా ఇంకా మహిళా పైలట్లు ఉన్నారు, వాళ్ల వివరాలను ఎయిర్ఫోర్స్ వెల్లడించదు…
సరే, శివాంగీ సింగ్ దగ్గరకు వద్దాం… ఈమె జన్మ స్థలం ఉత్తరప్రదేశ్లోని వారణాసి… అక్కడే స్కూలింగ్, అక్కడే గ్రాడ్యుయేషన్ బనారస్ హిందూ యూనివర్శిటీలో… అప్పుడే ఎన్సీసీలో చేరింది… గ్రాడ్యుయేషన్ తర్వాత, ఆమె హైదరాబాద్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA) లో కఠినమైన శిక్షణ పూర్తి చేసి ఫైటర్ పైలట్గా కమిషన్ అయ్యింది…
ఆమె ఒక సహచర ఫైటర్ పైలట్ను వివాహం చేసుకుంది.., ప్రస్తుతం ఇద్దరూ వైమానిక దళంలో పనిచేస్తున్నారు… వివరాలు గోప్యం… భద్రతా కారణాల రీత్యా…
ఆమె గురువు ఎవరో తెలుసా..? వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్… (పాకిస్తాన్తో జరిగిన పోరాటంలో చిక్కుకుని, తిరిగి వచ్చిన హీరో) మార్గదర్శకత్వం చేశారని ఆమే చెప్పింది…
.
- ఇంకా అయిపోలేదు.,. చాలా ఉంది… ఆమె జీవితస్వప్నం ఏమిటో తెలుసా..? వ్యోమగామి కావాలని..! అవును, ఇస్రో అంతరిక్ష స్పేష్ షిప్పులో ప్రయాణించాలనేది ఆమె కల… మానవ సహిత గగనయాన్ వంటి అంతరిక్ష మిషన్లలో…దాని కోసం ఆమె ఇప్పటికే టెస్ట్ పైలట్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకుంది…
.
- టెస్ట్ పైలట్గా అర్హత సాధించడం అనేది వ్యోమగామి ఎంపిక ప్రక్రియలో ఒక కీలకమైన మెట్టు… గగనంలో విహరించాలనేది చాలామంది మహిళల కల… ఆమె దాన్ని మించి అంతరిక్ష స్వప్నాన్ని కంటోంది…
ఒక మహిళ ఈ దేశ సుప్రీం కమాండర్… మన ఎయిర్ ఫోర్స్ బలం రాఫెల్… దాని మొదటి పైలట్ ప్లస్ సుప్రీం కమాండర్ కలిసి ఉన్న ఫోటో అందుకే అపూర్వం… అందుకే అది వైరల్…
ఆగండి, ఇంకా ఉంది… ఈ ఫోటో వెనుక ఒక ముఖ్యమైన రాజకీయ మరియు వ్యూహాత్మక సందేశం కూడా ఉంది…. ‘ఆపరేషన్ సింధూర్’ (భారత్ జరిపిన వైమానిక దాడులు) సమయంలో, పాకిస్తాన్ మీడియా, సోషల్ మీడియా సంస్థలు శివాంగి సింగ్పై తప్పుడు ప్రచారం చేశాయి…
శివాంగి సింగ్ నడుపుతున్న రాఫెల్ జెట్ను కూల్చివేశామని, ఆమెను బందీగా పట్టుకున్నామని పాకిస్తాన్ నిరాధారమైన (Baseless) అవాస్తవ (Fabricated) క్లెయిమ్లు చేసింది… సాక్షాత్తూ భారత రాష్ట్రపతి, దేశాధినేత, అత్యంత కీలకమైన అంబాలా వైమానిక స్థావరంలో రాఫెల్ పక్కన నిలబడి శివాంగి సింగ్తో ఫోటో దిగడం ద్వారా, పాకిస్తాన్ ప్రచారమంతా అబద్ధమని గట్టిగా, దృశ్యరూపంలో ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది…
రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మొదటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… అంతకు ముందు రాఫెల్ విమానంలో ప్రయాణించిన మొదటి భారతీయ రాజకీయ నాయకుడు/కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్…
2019లో, రక్షణ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ ఫ్రాన్స్లో రాఫెల్ జెట్ డెలివరీ వేడుకలో భాగంగా మొదటి భారతీయ వ్యక్తిగా రాఫెల్ ఫైటర్ జెట్లో ప్రయాణించాడు (సోర్టీ)… ఈ సందర్భంగా “శస్త్ర పూజ” కూడా నిర్వహించాడు… ద్రౌపది ముర్ము రెండు వేర్వేరు ఫైటర్ జెట్లలో (సుఖోయ్-30 MKI & రాఫెల్) ప్రయాణించిన మొదటి రాష్ట్రపతి….
Share this Article