.
ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అని ఓ తెలుగు సినిమా రచయిత చెప్పాడు కదా… తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా సేమ్ అని బీజేపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది… కానీ అన్నామలై తగ్గించబడ్డాడు తప్ప తను తగ్గలేదు… కారణాలు బోలెడు, వాటిపై తమిళ మీడియాలో బాగా ప్రచారం వస్తోంది…
అన్నామలై ఈసారి తమిళనాడు ఎన్నికల బరిలో లేడు, టికెట్ ఇవ్వలేదు… ఇది నిజం… ‘మా ఫాదర్ అనారోగ్యం, ఇతర వ్యక్తిగత కారణాలతో పోటీలో లేను, నేనే టికెట్ వద్దన్నాను’ అని పైకి ఏదో చెబుతున్నాడు అన్నామలై… బీజేపీ అభ్యర్థులకు మాత్రం ప్రచారం చేస్తాను అంటున్నాడు… కానీ అన్నాడీఎంకే పళనిస్వామి కోసం, తన పట్టుదల మేరకే అన్నామలైని పూర్తిగా పక్కన బెట్టేసింది…
Ads
పళనిస్వామి, అన్నామలై… ఇద్దరూ కొంగునాడు ఏరియాకు చెందినవాళ్లే… ఇద్దరిదీ ఒకే కులం… గౌండర్… రాష్ట్రంలో బీజేపీని ఎంతోకొంత పెంచడానికి అన్నామలై దూకుడుగా వెళ్లాడు… కానీ ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీగా ఉన్న అన్నాడీఎంకే నేత పళనిస్వామికి ఇది నచ్చలేదు… ఎందుకంటే…?
ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బలమైన నేతలు ఒకే ప్రాంతంలో ఉంటే, రాజకీయంగా అది ఆధిపత్య పోరుకు దారితీస్తుంది… కొంగునాడు ప్రాంతం గౌండర్ సామాజిక వర్గానికి కంచుకోట… అన్నాడీఎంకే (AIADMK) వ్యవస్థాపకుల కాలం నుంచి ఈ ప్రాంతంపై ఆ పార్టీకి తిరుగులేని పట్టు ఉంది… ఎడప్పాడి పళనిస్వామి (EPS) కొంగునాడు ప్రాంతంలో అత్యంత బలమైన గౌండర్ నాయకుడుగా గుర్తింపు పొందాడు…
అన్నామలై బీజేపీలో చేరిన తర్వాత, తన దూకుడుతో అదే కొంగునాడు ప్రాంతంలో బీజేపీని బలోపేతం చేసి, పళనిస్వామి గౌండర్ ఓటు బ్యాంకుకు గండి కొట్టడం మొదలుపెట్టాడు… తన సొంత నియోజకవర్గాల్లోనే తన సామాజిక వర్గ ఓట్లను బీజేపీ వైపు మళ్లించే ప్రయత్నం చేయడం పళనిస్వామికి మింగుడు పడలేదు… తన రాజకీయ భవిష్యత్తుకు, పార్టీ పునాదికి దీర్ఘకాలంలో అన్నామలై ఒక ‘ముప్పు’ (Threat) అనుకున్నాడు… అన్నామలై వంటి “హై-ప్రొఫైల్” లీడర్ అక్కడ యాక్టివ్గా ఉండటం ఆయనకు ఇష్టం లేదు…
ఒకే సామాజిక వర్గ నేతల మధ్య ఘర్షణ పెరిగితే, అది మొత్తం ఎన్డీయే కూటమికి నష్టం చేస్తుందని, చివరికి డీఎంకే (DMK) కి లాభం జరుగుతుందని బీజేపీ అధిష్టానం గ్రహించింది… అన్నాడీఎంకే లేకుండా ఎన్డీయే లేదు తమిళనాడులో… బీజేపీ బలం నామమాత్రం… అందుకని పళనిస్వామి కోరగానే అన్నామలైని రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచే తొలగించి, కాస్త తగ్గాలని సూచించింది…
పళనిస్వామి ఇక్కడితో ఆగలేదు… అన్నామలై అసలు పోటీలోనే ఉండవద్దని షరతు పెట్టాడు… బీజేపీ దానికీ సరేనన్నది… అందుకే అన్నామలై పోటీలో లేడు… ఓ టైమ్ వస్తుంది, కాస్త తగ్గి ఉండు అని అన్నామలైకి చెప్పిన బీజేపీ అవసరమైతే తనను జాతీయ స్థాయిలో వాడుకుంటామని కూడా నచ్చజెప్పింది… ప్రస్తుతానికి పళనిస్వామి, అన్నామలై కోల్డ్ వార్కు తెరవేసింది…
అన్నాడీఎంకేకు దగ్గరగా ఉండే నైనార్ నాగేంద్రన్ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేసిన బీజేపీ ప్రస్తుతం తన మాటలకే విలువ ఇస్తోంది… కూటమి తరఫున బీజేపీ పోటీచేసే సీట్ల సంఖ్య, సీట్లు, అభ్యర్థుల విషయంలో నైనార్ నాగేంద్రన్, పళనిస్వామి ఏది చెబితే అదే చెల్లుబాటు ప్రస్తుతం… అలాగే పీఎంకే వంటి పార్టీలకు ఇచ్చిన ప్రాధాన్యం కూడా బీజేపీకి ఇవ్వకపోవడం మీద కూడా అన్నామలై అసంతృప్తిగా ఉన్నాడు… దాంతో మరింత సైలెంట్ అయిపోయాడు…
సో, అన్నామలై, పళనిస్వామి వైరానికి కారణం కేవలం రాజకీయ విభేదాలు మాత్రమే కాదు, సామాజిక వర్గ ఆధిపత్యం (Caste Supremacy), ప్రాంతీయ రాజకీయ ఉనికి (Regional Dominance) కాపాడుకోవడానికి జరిగిన పోరాటం… మరి నైనార్ నాగేంద్రన్..?
తను దక్షిణ తమిళనాడు (Southern Tamil Nadu) ప్రాంతానికి చెందిన నేత… తనది తిరునెల్వేలి (Tirunelveli) జిల్లా… గత 25 ఏళ్లుగా తిరునెల్వేలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తూ వస్తున్నాడు… ఈసారి మాత్రం తన సొంత నియోజకవర్గాన్ని మార్చి విరుదునగర్ జిల్లాలోని సాత్తూరు (Sattur) నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాడు… తనది తేవర్ (Thevar / Mukkulathor) సామాజిక వర్గం… దక్షిణ తమిళనాడు రాజకీయాల్లో తేవర్ సామాజిక వర్గం అత్యంత శక్తివంతమైంది…
గౌండర్ నేతను పక్కన పెట్టాల్సి వచ్చింది కాబట్టి, మరో బలమైన కులం నుంచి నైనార్ను ఎంపిక చేసి, రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇచ్చింది బీజేపీ… అన్నాడీఎంకేలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటం వల్ల, పళనిస్వామి (EPS) వంటి సీనియర్ నేతలతో సమన్వయం చేసుకోవడానికి ఈయన సరైన వ్యక్తి అని బీజేపీ అధిష్టానం భావించింది…
నైనార్ నాగేంద్రన్ గతంలో జయలలితతో సాన్నిహిత్యం ఉన్న నేత… దాంతో అన్నాడీఎంకే శ్రేణులకు ఆమోదయోగ్యమైన వ్యక్తి అయ్యాడు అన్నామలైతో పోలిస్తే…! ఏతావాతా తమిళనాడులో పళనిస్వామి చెప్పినట్టు బీజేపీ ఆడుతోంది, అవసరార్థం..!!
Share this Article