.
రవి వానరసి… దూరం నుంచి చూస్తే, అది హిమాలయాల అంచుల్లోంచి ఉద్భవించిన ఓ అద్భుతమైన కళాఖండంలా కనిపిస్తుంది. వేల అడుగుల లోతైన లోయపై, సన్నని పట్టు దారంలా సాగిపోతున్న ఆ ఉక్కు నిర్మాణం, కేవలం ఒక వంతెన కాదు. అది మనిషి సంకల్పానికి, అత్యాధునిక ఇంజినీరింగ్కి, ప్రకృతి సవాళ్లను అధిగమించే ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం.
ఆ అద్భుతమే చీనాబ్ రైల్ వంతెన! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్ వంతెనగా చరిత్రలో నిలిచిపోయే ఈ నిర్మాణం వెనుక, ఎందరో మహానుభావుల శ్రమ, మేధస్సు, నిరంతర కృషి దాగి ఉన్నాయి. వారిలో ఒకరు, భారతదేశం గర్వించదగ్గ భూసాంకేతిక ఇంజినీరింగ్ శాస్త్రవేత్త, ఐఐఎస్సీ (IISc) ప్రొఫెసర్, డా. గాలి మాధవీలత.
Ads
చీనాబ్ ఒడ్డున సవాళ్ల పర్వం!
జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో, పర్వతాల గుండా ఉధృతంగా ప్రవహించే చీనాబ్ నదిపై ఈ వంతెన నిర్మించారు. సముద్ర మట్టానికి 359 మీటర్లు (దాదాపు 1,178 అడుగులు) ఎత్తులో, ఈఫిల్ టవర్ కంటే కూడా సుమారు 35 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఈ వంతెనను నిర్మాణం అబ్బురపర్చేది.
ఈ ప్రదేశం ఎంతటి దుర్గమమైనదో ఊహించుకోండి! ఒకవైపు హిమాలయాల కఠినమైన భూభాగం, భూకంపాలు వచ్చే అవకాశం, ఇంకోవైపు శీతల వాతావరణం, హిమపాతం, వేగవంతమైన గాలులు, నిరంతరాయంగా వర్షాలు… ఇవన్నీ ఈ వంతెన నిర్మాణానికి అడుగడుగునా అడ్డంగా నిలిచాయి.
కేవలం వాతావరణ సవాళ్లు మాత్రమే కాదు, భూమి లోపలి నిర్మాణం (Geology) కూడా ఒక పెను సవాలు. ఈ ప్రాంతంలోని శిలలు చాలా సంక్లిష్టమైనవి, తరచుగా పగుళ్లతో, గుహలతో కూడుకుని ఉంటాయి. ఇలాంటి ప్రదేశంలో వేల టన్నుల బరువును మోయగల ఒక భారీ వంతెనను నిర్మించాలంటే, కేవలం ఇంజినీరింగ్ నైపుణ్యం సరిపోదు.
అది సవాళ్లను ఛేదించే అద్భుతమైన సృజనాత్మకత, దార్శనికత, వినూత్న పరిష్కారాలను కనుగొనే సామర్థ్యం కావాలి. సరిగ్గా ఈ కీలకమైన సమయంలోనే, డా. గాలి మాధవీలత భూసాంకేతిక ఇంజినీరింగ్ నైపుణ్యం వెలుగులోకి వచ్చింది.
భూమిని అర్థం చేసుకున్న గాలి!
డా. గాలి మాధవీలత కేవలం ఒక ఇంజినీరింగ్ ప్రొఫెసర్ మాత్రమే కాదు, ఆమె భూమిని అర్థం చేసుకున్న ఒక నిపుణురాలు. మట్టి, శిలల స్వభావం, వాటిపై ఒత్తిడి ఎలా పనిచేస్తుంది, నిర్మాణాలు వాటిపై ఎలా ప్రభావం చూపుతాయి అనే విషయాలపై ఆమెకు లోతైన జ్ఞానం ఉంది
. 1992లో జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ నుండి సివిల్ ఇంజినీరింగ్లో బీ.టెక్ పూర్తి చేసిన ఆమె, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ నుండి జియోటెక్నికల్ ఇంజినీరింగ్లో ఎం.టెక్ (గోల్డ్ మెడల్ గ్రహీత) మరియు ఐఐటి మద్రాస్ నుండి సివిల్ ఇంజినీరింగ్లో పీహెచ్.డి. పూర్తి చేశారు. ఈ అసాధారణ విద్యా నేపథ్యం, ఆమెను ఈ క్లిష్టమైన ప్రాజెక్ట్కు ఒక అనివార్యమైన భాగస్వామిగా మార్చింది.
పీహెచ్.డి. తరువాత, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో పోస్ట్డాక్టోరల్ పరిశోధనలు చేసి, ఆ తర్వాత ఐఐటి గౌహతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి, 2004లో ఐ.ఐ.ఎస్.సి.లో ఫ్యాకల్టీ సభ్యురాలిగా చేరారు. అప్పటి నుండి, ఆమె భూసాంకేతిక ఇంజినీరింగ్లో ఎన్నో పరిశోధనలు, ఆవిష్కరణలు చేశారు. ఆమె పరిశోధనలు ప్రధానంగా మట్టి బలోపేతం, జియోసింథెటిక్స్, శిలల మెకానిక్స్ చుట్టూ తిరుగుతాయి.
మట్టి, జియోసింథెటిక్స్ల మధ్య ఘర్షణ స్వభావం, చిత్ర ఆధారిత సాంకేతికతలను ఉపయోగించి సూక్ష్మ ఉపరితల మార్పులను విశ్లేషించడం వంటివి ఆమె పనిలో భాగం. రోడ్ల నిర్మాణం, భూకంపాల సమయంలో నిలబడి ఉండే గోడల స్థిరత్వం వంటి అంశాలపై కూడా ఆమె విస్తృతంగా పరిశోధనలు చేశారు.
“డిజైన్-యాజ్-యూ-గో” – ఒక వినూత్న విధానం!
చీనాబ్ వంతెన నిర్మాణంలో డా. మాధవీలత బృందం అనుసరించిన ఒక వినూత్న విధానం “డిజైన్-యాజ్-యూ-గో” (Design-As-You-Go) వ్యూహం. అంటే, ముందుగా మొత్తం డిజైన్ చేసి, ఆపై దానిని అమలు చేయడం కాకుండా, నిర్మాణ ప్రక్రియలో భూమి లోపలి పరిస్థితులకు అనుగుణంగా డిజైన్ను నిరంతరం మార్చుకుంటూ, మెరుగుపరుచుకుంటూ వెళ్ళడం. ఈ విధానం చీనాబ్ వంటి సంక్లిష్ట భౌగోళిక పరిస్థితులలో చాలా అవసరం. ఎందుకంటే, లోయ లోపల శిలల నిర్మాణంలో ఊహించని పగుళ్లు, గుహలు, భిన్నమైన రాతి పొరలు కనిపించే అవకాశం ఉంది.
ఈ వంతెన నిర్మాణంలో, శిలల స్థిరత్వం ఒక పెద్ద సవాలు. వేల టన్నుల బరువును మోయగల వంతెనను నిర్మించాలంటే, దాని పునాదులు చాలా ధృడంగా ఉండాలి. డా. మాధవీలత, ఆమె బృందం, ఈ వంతెన పునాదులకు అవసరమైన స్థిరత్వాన్ని అందించడానికి “రాక్ యాంకర్ల” రూపకల్పన, ప్లేస్మెంట్లో కీలక పాత్ర పోషించారు. ఈ రాక్ యాంకర్లు, బలహీనమైన లేదా పగుళ్లతో కూడిన శిలలను దృఢంగా పట్టి ఉంచి, వంతెన నిర్మాణానికి కావాల్సిన స్థిరత్వాన్ని అందించాయి.
భూకంపాలు సంభవించినా, తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో కూడా వంతెన చెక్కుచెదరకుండా ఉండాలంటే, ఈ రాక్ యాంకర్ల రూపకల్పన అత్యంత ఖచ్చితత్వంతో కూడుకున్నది. ఆమె నిపుణత కారణంగా, అత్యంత కఠినమైన, మారుతూ ఉండే శిలల పరిస్థితులలో కూడా సురక్షితమైన నిర్మాణం సాధ్యమైంది.
జ్ఞాన దీప్తి… పరిశోధన ప్రయాణం!
డా. మాధవీలత పరిశోధనలు కేవలం అకడమిక్ పేపర్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఆమె కృషి, భారతీయ ఇంజినీరింగ్ రంగానికి, ముఖ్యంగా భూసాంకేతిక ఇంజినీరింగ్కు ఒక కొత్త దిశానిర్దేశం చేసింది. ఆమె పర్యవేక్షణలో ఎంతో మంది పరిశోధనా విద్యార్థులు భూసాంకేతిక ఇంజినీరింగ్లో నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు.
ఆమె బోధన, పరిశోధన, మరియు ప్రాజెక్ట్ సలహాలు, భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకమైన పునాదులు వేస్తున్నాయి. చీనాబ్ రైల్ వంతెన కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఆమె జ్ఞానం, అంకితభావం భారతదేశంలోని ఎన్నో ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పరోక్షంగా, ప్రత్యక్షంగా తోడ్పడుతున్నాయి.
భారతదేశ ఆత్మస్థైర్యానికి ప్రతీక.. చీనాబ్ వంతెన!
నేడు, ఆ అద్భుతమైన చీనాబ్ రైల్ వంతెన చీనాబ్ నదిపై సగర్వంగా నిలబడి ఉంది. రైళ్లు దానిపై దూసుకుపోతుంటే, అది కేవలం ఒక రవాణా మార్గం మాత్రమే కాదు, అది భారతదేశ ఆత్మస్థైర్యానికి, ఇంజినీరింగ్ పరాక్రమానికి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మనోనిబ్బరానికి ప్రతీక.
ఈ వంతెన నిర్మాణంలో ఎన్నో సవాళ్లను అధిగమించడంలో, ముఖ్యంగా భూమి లోపలి సంక్లిష్టతలను అర్థం చేసుకుని, దానికి తగ్గ పరిష్కారాలను అందించడంలో డా. గాలి మాధవీలతది ఐకానిక్ పాత్ర.
ఆమె కృషి, కోట్ల మంది జీవన ప్రయాణాన్ని సులభతరం చేసింది. దుర్గమమైన హిమాలయ ప్రాంతాలను అనుసంధానించడం ద్వారా, ఆర్థికాభివృద్ధికి, పర్యాటకానికి, మరియు జాతీయ భద్రతకు ఈ వంతెన ఎంతగానో తోడ్పడుతుంది.
డా. గాలి మాధవీలత వంటి అంకితభావం గల శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఉన్నంత కాలం, భారతదేశం ఇంజినీరింగ్ రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తూనే ఉంటుందనేందుకు చీనాబ్ ఇప్పుడో ఉదాహరణ. ఆమె కృషి భారత యువతరానికి స్ఫూర్తి. చీనాబ్ వంతెన కథలో మొత్తంగా డా. మాధవీలత పాత్ర ఓ కొత్త అధ్యాయం!
చివరగా..... నన్ను మరీ అంత గొప్పదాన్ని చేయకండి, అది సమిష్టి కృషి అని వినమ్రంగా ఓ ప్రకటన జారీ చేసింది ఈమె...
Share this Article