.
నిన్న మనం చెప్పుకున్నాం కదా… ఏపీ తనకు అనుకూలంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రెండుసార్లు మార్చుకున్నది గానీ, తెలంగాణ ఆందోళనలు మాత్రం ఎవరికీ పట్టకుండా పోయాయి… ఏపీ ఏది అనుకుంటే అదే చేస్తోంది ఏకపక్షంగా…
గతంలో ఏడు పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపేస్తే ఒకరోజు నామ్కేవాస్తే బంద్ పిలుపు తప్ప, బీఆర్ఎస్ తన తొమ్మిదిన్నరేళ్లలో మళ్లీ ఎప్పుడూ వాటి గురించి ఆలోచించింది లేదు, అడుగు వేసింది లేదు… నిన్న కూడా అమరావతి రాజధాని కోసం రాష్ట్ర విభజన సవరణ బిల్లును ఆమోదించింది తప్ప, తెలంగాణ డిమాండ్లు, ప్రయోజనాల గురించి పెద్దగా రాజ్యసభలో మాట్లాడలేకపోయింది…
Ads
సురేష్ రెడ్డి ఎంతసేపూ కేసీయార్ను ఆహా, ఓహో అంటూ ఎత్తుకోవడానికి ప్రయత్నించడం, మొన్న కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు నీటిలో కొట్టుకుపోయాయని కేంద్ర జలమంత్రి పాటిల్ చేసిన వ్యాఖ్యల్ని కౌంటర్ చేయడానికి ప్రయత్నించడం తప్ప… కనీసం కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తరహాలోనైనా తెలంగాణ అవసరాలు, ప్రయోజనాల్ని ఫోకస్ చేయడానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు…
- (ఆమె అమరావతి, కమ్మరావతి తాలూకు వ్యాఖ్యలు మాత్రం అబ్సర్డ్… నిజానికి ఆమె అత్తిల్లు తెలంగాణ కాంగ్రెస్, పుట్టిల్లు మాత్రం టీడీపీ యెల్లో కూటమే అన్నట్టు వ్యవహరిస్తుంటుంది…) (నిన్న బయట ఎక్కడో మాట్లాడిన హరీష్ రావు కూడా ఎంతసేపూ కాళేశ్వరంపై కేంద్రానికి కౌంటర్లు ఇచ్చే ప్రయాస తప్ప విభజన చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తే, తెలంగాణకు సమాచారం కూడా లేకుండా ఎందుకు ఇగ్నోర్ చేశారనే ప్రశ్నే లేదు…)
లక్షన్నర కోట్ల ఆస్తుల పంపిణీ, రైల్వే కోచ్, ఎన్టీపీసీ, ట్రైబల్ వర్సిటీ వంటి అంశాలను ప్రస్తావించడమే కాదు, ఆమె ఏడు ముంపు మండలాలను కలిపేసుకున్నారు కదా… కనీసం 5 ఊళ్లయినా ఇవ్వండి అనడిగింది… మహాభారతంలో అరణ్యవాసం అనంతరం పాండవులు కనీసం 5 ఊళ్లు ఇవ్వమని దుర్యోధనుడిని అడుగుతారు… దుర్యోధనుడు ఎహెఫో అంటాడు, యుద్ధం, కురుక్షేత్రం, తరువాత కథ వేరు…
అసలు ఏమిటి ఆ అయిదు ఊళ్లు…? తెలంగాణ ప్రభుత్వం తిరిగి కోరుతున్న గ్రామాలు భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న పురుషోత్తపట్నం, పిచుకలపాడు, ఏటపాక, గుండాల, కన్నాయిగూడెం… ఇవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి…
1. భద్రాచలం అస్తిత్వం, విస్తరణ…: భద్రాచలం పట్టణం ప్రస్తుతం మూడు వైపుల ఆంధ్రప్రదేశ్ సరిహద్దులతో చుట్టబడి ఉంది… పట్టణం విస్తరించాలన్నా లేదా కొత్తగా ప్రభుత్వ కార్యాలయాలు, వసతులు కల్పించాలన్నా ఖాళీ స్థలం లేదు… ఈ ఐదు గ్రామాలు భద్రాచలం పట్టణానికి అత్యంత సమీపంలో ఉండటంతో, వీటిని కలిపితేనే భద్రాచలానికి భౌగోళికంగా పరిపూర్ణత వస్తుందని తెలంగాణ వాదన…
2. భద్రాద్రి రాముని ఆస్తులు…: ఈ ఐదు గ్రామాల్లో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి… భౌగోళికంగా ఇవి వేరే రాష్ట్రంలో ఉండటం వల్ల ఆ భూముల నిర్వహణ, కౌలు వసూలు వంటి అంశాల్లో దేవస్థానం ఇబ్బందులు ఎదుర్కొంటోంది…
3. పరిపాలనా సౌలభ్యం…: ఈ గ్రామాల ప్రజలు తమ నిత్య అవసరాల కోసం, వైద్యం కోసం భద్రాచలంపైనే ఆధారపడతారు… కానీ, అధికారిక పనుల కోసం మాత్రం సుదూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది… ఇది ప్రజలకు భారంగా మారింది…
4. పోలవరం ముంపు భయం…: పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ ఐదు గ్రామాలే కాకుండా, భద్రాచలం పట్టణానికి కూడా ముంపు ముప్పు పొంచి ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది… ఈ గ్రామాలు తమ ఆధీనంలో ఉంటేనే రక్షణ కరకట్టల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా చేయగలమని తెలంగాణ వాదిస్తోంది…
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే…? ఎలాగూ విభజన చట్టానికి సవరణ ప్రతిపాదిస్తున్నారు కదా, అది ఏపీ రాజధాని ఇష్యూయే కావచ్చు… మరి అదే సమయంలో తెలంగాణ ప్రయోజనాల్ని, కనీసం ఈ ఐదు గ్రామాల పునర్విలీనం గురించి అందులో ఎందుకు చేర్చలేదు..? అంటే ఏపీ తలుచుకుంటే ఏదైనా జరగాలి, తెలంగాణ ఎవరికీ అక్కర్లేదా..?
కిషన్ రెడ్డి కూడా ఎన్నో మాట్లాడాడు గానీ ఈ ఐదూళ్ల మాటే ఎందుకు ఎత్తుకోలేదు..? ఆ సవరణ బిల్లులోని అంశాలు తెలంగాణ ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం లేదా..? ఈ ప్రభుత్వం సవరణ బిల్లుకు ఇంకేమీ యాడ్ చేయడానికి వీల్లేకుండా నిషేధం ఏమైనా విధించారా..? అవును, కిషన్ రెడ్డి జవాబు చెప్పాల్సిన ప్రశ్న…!!
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించింది… అంటే ప్రజెంట్ తెలంగాణ, ఏపీలకు సంబంధించి, ఆ చట్టానికి ఏం సవరణలు చేయాలన్నా సరే, రెండు రాష్ట్రాలనూ సంప్రదించాలి కదా… తెలంగాణ ఆల్సో పార్ట్ ఆఫ్ 2014 యాక్ట్… మరెందుకు విస్మరించినట్టు..!!
- ఇక్కడే మరో అంశం… ఈనాడు మెయిన్ ఎడిషన్ సెంటర్ స్ప్పెడ్ సహా ఏదో అద్భుతం జరిగిపోయినంత బిల్డప్ ఇచ్చింది… తెలంగాణ ఎడిషన్లో కూడా… మరి తెలంగాణ ఇష్యూస్, ఏపీ ఏకపక్షత మాటేమిటి..? చివరకు బెంగాల్ మాల్డా ఇష్యూ మీద సీజేఐ కూడా ఆందోళన వెలిబుచ్చితే దానికీ నాలుగు వాక్యాల వార్తతో ముగించి, అమరావతి అజరామర నగరి అట…
ఆంధ్రజ్యోతి దాని తోకే కదా… అదీ అంతే… రెచ్చిపోయి ఏదేదో రాసింది… మావిగన్ ప్లాన్ మీద జగన్ మీద ఇంకా ఇంకా భారీ ట్రోలింగ్ సాగుతూనే ఉంది… మరోవైపు సాక్షి తప్పదు కాబట్టి తనూ ఏదేదో ఆ ప్రతిపాదన మీద ఏదేదో రాసుకుని పొద్దుపుచ్చింది… మూడింటికీ ఆంధ్రాయే కావాలి, తెలంగాణ ఎడిషన్లలో కూడా ఏపీ యవ్వారాలే కావాలి… పక్కా ఆంధ్రాతనం… తెలంగాణకు ఎటొచ్చీ ప్యూర్ తెలంగాణ మీడియా లేకపోవడం ట్రాజెడీ… ఉన్న నమస్తే తెలంగాణకు అసలు పత్రిక లక్షణాలే లేకపోవడం మరో విషాదం… మేడిగడ్డ బరాజులాగా..!!
Share this Article