.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఈ దేశంలోని రాష్ట్రంగా గుర్తించడం లేదా..? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి అమర్యాదను, వివక్షను ప్రదర్శిస్తోందా..? ఇక్కడ ఉన్నది ఏమైనా విదేశీ ప్రభుత్వమా..?
.
Ads
ఈ చర్చ బ్యూరోక్రాట్లు, జర్నలిస్టు సర్కిళ్లలో జోరుగా సాగుతోంది… విషయం ఏమిటంటే..? గ్లోబల్ సమిట్ జరుగుతోంది కదా ఫ్యూచర్ సిటీలో… హాజరు కావాలని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధానిని కలిసి కోరాడు… కేంద్ర మంత్రుల్నీ ఆహ్వానించారు… సరే, ఖర్గే, సోనియా, రాహుల్లను కూడా ఇన్వైట్ చేశాడు, సొంత పార్టీ హైకమాండ్ కాబట్టి తప్పదు…
మరెందుకు ఒక్క కేంద్ర మంత్రీ రావడం లేదు..? (కిషన్ రెడ్డి వస్తాడట, తనను ఇక్కడ తెలంగాణ బీజేపీ నాయకుడిగా చూడాలి తప్ప కేంద్ర ప్రతినిధి కాదు)… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడేమో గ్లోబల్ సమిట్ స్వాగతిస్తున్నాం అనే ఓ మొహమాటపు మర్యాద ప్రకటన చేశాడు తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఏముంది..?
ఎందుకు ఉండకూడదు..? కేంద్ర ప్రభుత్వం ప్రవచించే వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగానే తెలంగాణ విజన్ 2047 రూపు దిద్దుకుంది కదా… మోడీ చెప్పే 30 ట్రిలియన్ల ఎకానమీలో మేం 3 ట్రిలియన్లు ఇస్తాం, ఏకంగా 10 శాతం జీడీపీకి మేం కంట్రిబ్యూట్ చేస్తాం అంటున్నాడు కదా… మరెందుకు కేంద్రం నుంచి చిన్న ప్రోత్సాహక మాట ఏది..?
మన మంత్రులు వెళ్లి, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రులను పిలిచారు… సరే, హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ రావడం ఆయా రాష్ట్రాలకు ఇష్టం లేదు, రావడం లేదు, రారు అనుకుందాం ఓ సమర్థనగా… కానీ కేంద్రానికి ఆ సోయి లేకపోవడం ఏమిటి..?
కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవాలకు అటెండ్ కావల్సిన అవసరం లేదు, అదెవరూ ఆశించరు కానీ ఒక రాష్ట్రం వచ్చే రెండు దశాబ్దాలకు ఓ ప్రణాళికను విడుదల చేస్తుంటే, అదీ కేంద్ర వైఖరికి అనుగుణంగా ఉంటే… ఓ కేంద్ర ప్రభుత్వంగా భుజం తట్టే చిన్న సూచన లేకపోవడం ఏమిటి..?
కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే చాలు, వివక్ష ప్రదర్శించాల్సిందేనా..? కేంద్రంలోని పెద్దన్నగా తనకు ఏ బాధ్యత లేదా..? 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా… ఈ దేశాన్ని పరిపుష్టం చేసేవి కావా ఆ పెట్టుబడులు..? పలు దేశాల నుంచి ప్రతినిధులు కూడా వస్తున్నారు…
రీసెంటుగా రెండు ఈవెంట్లకు మోడీ వర్చువల్ అటెండెన్స్ వేశాడు… స్కై రూట్ స్టార్టప్, సెఫ్రాన్ ఇంజన్ల యూనిట్ ఈవెంట్లు అవి… మరి ఈ గ్లోబల్ సమిట్కు చిన్న వీడియో సందేశమైనా ఎందుకు కరువైంది..?
కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనే వివక్షతో కేంద్రం నుంచి నిధులను ఎలా తగ్గించేశారో మొన్న ఓ కథనంలో చెప్పుకున్నాం కదా… ఇదుగో లింక్…
కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి… ఇదీ తెలంగాణపై కేంద్ర బీజేపీ వివక్ష లెక్క…
మరోవైపు ఏపీ పెట్టుబడుల ఈవెంట్ జరిపితే కేంద్ర కామర్స్ మంత్రి పీయూష్ గోయల్ వెళ్లాడు కదా, 2 రోజులు అక్కడే ఉన్నాడు కదా… మరి తను గానీ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గానీ ఎందుకు రావడం లేదు..? ఎందుకు రాకూడదు..? గ్లోబల్ ఈవెంటును గవర్నర్ ప్రారంభించడం ఏమిటి..?

నిజాలు ఇలాగే నిష్ఠురంగా ఉంటాయి… రాజకీయాలు వేరు… మోడీ- రేవంత్ రాజకీయంగా విభేదించవచ్చు, ఎవరి కార్యాచరణ వాళ్లది… విమర్శలూ ఉంటాయి… కానీ స్థూలంగా దేశం- రాష్ట్ర సంబంధాలు అనే కోణంలో.., అభివృద్ధి అనే కోణంలో… ప్రభుత్వాల కోణంలో… ఫెడరల్ గవర్నమెంట్ కోణంలో… మోడీ నుంచి ఆ సానుకూల స్పందన ఏది..? మోడీ భాయ్… తెలంగాణ ఈ దేశంలోని ఒక రాష్ట్రమే… హ్యాపెనింగ్ స్టేట్…!! (ఈ కథనం రాసే సమయానికి ఉన్న సిట్యుయేషన్ను బట్టి...)
Share this Article