.
డెస్టినీ… విధి… కాలం… టైమ్… రకరకాల పేర్లతో మనం చెప్పుకుంటాం కదా… “జో హోనా హై, వో హోకర్ హీ రహేగా” (ఏది జరగాలో అది జరిగి తీరుతుంది)… మనం ఏం సాధించినా, ఎంత ముందుకు పోయినా… డెస్టినీని దాటి పోలేం… అది చెప్పేందుకు రోజూ కోట్ల ఉదాహరణలు… తాజాగా ఇదీ అలాంటిదే…
మనిషిగా మనం చేయగలిగింది ‘పోరాడటం’ మాత్రమే, ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదు అని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది…. వార్తలోకి వెళ్దాం…
Ads
విధి ఆడిన వింత నాటకం: ప్రాణం కాపాడుకోవాలని అప్పు చేస్తే.. ప్రాణాలే పోయాయి!
ఆయన పేరు సంజయ్ కుమార్ (41)… జార్ఖండ్లోని లాతేహార్ జిల్లా చంద్వాలో ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించే ఏకైక ఆధారం… వారం క్రితం తన హోటల్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు… దాదాపు 65 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతున్న సంజయ్ను ఎలాగైనా బతికించుకోవాలని ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది…
స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స ఫలించకపోవడంతో, ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తీసుకెళ్తే ఆయన ప్రాణాలు దక్కుతాయని వైద్యులు సూచించారు… కానీ, అందుకు కావాల్సిన ఎయిర్ అంబులెన్స్ ఖర్చు సామాన్యులకు భారమే… అయినప్పటికీ, సంజయ్ ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదని భావించిన ఆ కుటుంబం, తమ వద్ద ఉన్న కొద్దిపాటి పొలాన్ని, ఆస్తులను అమ్మడానికైనా సిద్ధపడింది…
చివరికి బంధువులు, స్నేహితుల దగ్గర సుమారు రూ. 8 లక్షలు అప్పుగా తీసుకుని ఆ ఎయిర్ అంబులెన్స్ను ఏర్పాటు చేశారు…
“ప్రాణం దక్కితే చాలు, జీవితాంతం కష్టపడి ఆ అప్పు తీర్చుకుంటాం” అన్న ఆశతో సంజయ్ భార్య అర్చన, మరికొందరు బంధువులు ఆయనతో కలిసి ఆ అంబులెన్స్ ఎక్కారు… రాంచీ విమానాశ్రయం నుంచి విమానం గాల్లోకి లేచినప్పుడు, వారి కళ్లలో తమవాడు క్షేమంగా తిరిగి వస్తాడన్న ఆశ మాత్రమే ఉంది…
కానీ, విధి మరోలా తలచింది… విమానం బయలుదేరిన 20 నిమిషాలకే వాతావరణం ప్రతికూలంగా మారింది… పిడుగులు, ఉరుములతో కూడిన భారీ వర్షం వల్ల పైలట్లు దారి మళ్లించాలని కోరారు… కానీ కొద్దిసేపటికే ఛత్రా జిల్లాలోని దట్టమైన అడవుల్లో ఆ విమానం కుప్పకూలిపోయింది…
విషాదాంతం…: ఎవరి ప్రాణాలనైతే కాపాడుకోవాలని అప్పులు చేసి, ఆరాటపడ్డారో… అదే విమానం ఆ సంజయ్ను, ఆయన భార్యను, ఇతర సిబ్బందిని బలితీసుకుంది… పాపం, తన కొడుకును డాక్టర్ చదివించడానికి సర్వం అమ్ముకున్న ఒక వృద్ధ తండ్రి కొడుకు (డాక్టర్ వికాస్) కూడా ఈ ప్రమాదంలో కన్నుమూశాడు…
ఈ కథలో అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, ఆ కుటుంబం చేసిన అప్పు మాత్రం అలాగే మిగిలింది, కానీ ఆ అప్పు తీర్చడానికి కష్టపడతానన్న మనిషి, ఆయనకు తోడుగా నిలిచిన భార్య ఇద్దరూ లేకుండా పోయారు… విధి ఎంత బలీయమైనదో, మనిషి ప్రయత్నం దాని ముందు ఎంత చిన్నదో చెప్పడానికి ఈ ఘటన ఒక కన్నీటి గాథగా నిలిచిపోతుంది…
చివరికి మిగిలిందేమిటి? ఒక తండ్రి తన కొడుకును డాక్టర్ను చేయడానికి చేసిన త్యాగం బూడిదలో పోసిన పన్నీరైంది. ఒక భార్య తన భర్తను బతికించుకోవాలని చేసిన పోరాటం, ఆమెనే మృత్యువు ఒడిలోకి తీసుకెళ్లింది.
Share this Article