.
‘ముచ్చట’ వాల్ మీద కసబ్ కళ్ళలోకి చూస్తూ… అనే పోస్ట్ చదివాకా ఒకటి గుర్తుకువచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం దేవరుప్పుల కేంద్రంగా సాగుతున్న రోజులు అవి… రజాకార్లు ఊరు మీద పడి విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు.
ఊళ్ళో ఎనిమిది మందిని ముందుగా పట్టుకొని… ఎనుకట ఎడ్లబండి ఎడ్లను అదిలించేందుకు తోలు బెల్టు కట్టిన వార్పటల్ తో ఇల్లిల్లూ తిరిగి, మరో పది మందిని పట్టుకొని, బయటకు లాక్కొచ్చి, కొడుతూ ఊరంతా తిప్పారు. ఊరంతా బిక్కచచ్చి పోయింది.
Ads
రజాకార్ల భయంకర అరుపులు, బాధితుల అర్తనాదాలతో వూరు పానాలు అరచేతిలో పెట్టుకుంది. వీరందరిని ఇప్పుడున్న దేవరుప్పుల చిన్నబడి దగ్గర గడ్డివాముల్లో వీరిని కాళ్ళు చేతులు కట్టి కూర్చోపెట్టి, గడ్డిమోపులు వేసి నిప్పుపెట్టారు. పైశాచిక ఆనందంతో రజాకార్లు ఉరంతా నినాదాలు చేస్తూ తిరుగుతూ పాత శివాలయం దగ్గరకు వస్తుండగా.. ఒక వృద్ధురాలు తెగించింది.
ఇంకెంతమంది పుస్తెలు తెగుతాయో అని భయంతో గంపెడు ధైర్యంతో వీరికి ఎదురేగింది. ఏమే ముసలిదానా.. పోవాలని ఉందా అని ఒకడు తుపాకీ ఎక్కుపెట్టాడు. భయపడని ఆ ధీశాలి ‘‘ఓ బిడ్డా కొంప మునుగుతుంది. కడెండి (ఇప్పటి కడవెండి) నుంచి అన్నల దళం (కమ్యూనిస్టులు) వస్తున్నదట.. ఊళ్ళోకాంచి తొందరగా ఉరుకుండ్రి… ఉత్త పుణ్యానికి పానాలు పోగొట్టుకోకండి. మీ దండం పెడుతా.. ఉరుకుండ్రి.. అని గుండెలు బాదుకుంటూ దొంగ ఏడ్పుతో చెప్పిందట.
జరిపిన ఘోరకలి తరువాత ఈ ఏడ్పుతో ఒక్కసారిగా సోయి వచ్చిన రజాకార్లు.. ఆమె చెప్పే మాట నిజమనుకుని వూరు వదిలి హడావుడిగా పారిపోయారట. లేకపోతే ఇంకెంత మందిని ఇలా బలిగొనేవాళ్లో… ఇది నిజంగా జరిగిన సంఘటనగా ఊరు ఈరోజుకూ చెప్పుకుంటుంది.
##ఇందుకు సంబంధించి… గడ్డివాములో సజీవదహనమైన వారి పేర్ల శిలాఫలకం ఫోటో ఇదుగో… వుప్పల రమేష్ శర్మ (దేవరుప్పల)

- (ముచ్చటలో ‘కసబ్ కళ్లలోకి చూస్తూ… అనే కథనం కసబ్ గ్యాంగ్ పైశాచిక దాడి వేళ… 20 మంది గర్భిణులను, ఆ కడుపుల్లో పిల్లల్ని కాపాడిన అంజలి కుల్తే అనే నర్సు గురించి…)
Share this Article