.
ఏదో ఓ చిన్న వెబ్ పత్రికలో ఒక ఆర్టికల్ కనిపించింది, బాగుంది అనిపించింది… తెల్లారిలేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడే లాగూలో తొండల భాషను, తన అన్ పాలిష్డ్ ఇంగ్లిష్ను, యాక్సెంటును విస్మరించే లోకల్ మీడియా, ప్రత్యేకించి సోషల్ మీడియా… నాయకుడికి కావాల్సింది ‘యాక్సెంట్’ (ఉచ్చారణ) కాదు, ‘ఇంటెంట్’ (సంకల్పం) అని గుర్తించడం లేదు…
ఢిల్లీలో జరిగిన ఎఐ సమ్మిట్లో రేవంత్ రెడ్డి ప్రసంగాంశాల్లో పరిణతి, ముందుచూపును ఏకంగా ప్రధాని మోడీ కూడా చప్పట్లు కొట్టి అభినందించినా… తన పక్కనే కూర్చోబెట్టుకుని సుమారు అరగంటపాటు ఏదో చర్చిస్తూ కనిపించినా… సీఎం ప్రెస్ విభాగం పంపించిన తన స్పీచ్ పాయింట్లు కవర్ చేసింది లోకల్ మీడియా, అంతే తప్ప అక్కడ కనిపించిని ఈ విశేషాన్ని మాత్రం విస్మరించింది…
Ads
తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంకా తన ‘పింక్ మేనియా’ ‘పింక్ షాడో’ ‘పింక్ గ్లాసెస్’ ‘పింక్ హ్యాంగోవర్’ల నుంచి బయటపడినట్టు లేదు… లేదా ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్ అనే తేలిక భావన లేదా అసహనం కూడా కావచ్చు… అప్పటికప్పుడే ఏదో క్రియేట్ చేసి, రోజూ కేటీయార్, హరీష్ రావులు వదిలే అనేకానేక ఆరోపణలు, విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది… మరీ ప్రత్యేకించి ఈమధ్య హరీష్ రావు విమర్శలు మరీ విచిత్రంగా, ఇక నవ్వుపుట్టించేట్టుగా సాగుతున్నాయి…
దేవాదుల పంపులు ఆన్ చేయకపోవడం కూడా ఏపీకి నీళ్లు ఇవ్వడం కోసమేనన్నాడు నిన్న ఎక్కడో… రేవంత్ కదిలితే చాలు, తుమ్మినా, దగ్గినా అది చంద్రబాబు కోసమే అన్నట్టు సాగే విమర్శలతో… చివరకు హరీష్రావుకన్నా ఆ కేటీయారే నయమేమో అనేలా మారిపోతున్నాడు… గంగ చంద్రముఖిలా మారిపోయినట్టు..!! సరే, ఢిల్లీ ఎఐ సదస్సుకు వద్దాం…
రాజకీయాలు వేరు- పార్టీలపరంగా విభేదించడం వేరు… దేశానికి, రాష్ట్రానికి అవసరమైన అభివృద్ధి అంశాల్లో కేంద్రం- రాష్ట్రం నడుమ సఖ్యత, సంయమనం, సహకారం వేరు… ఇది ఒక స్టాలిన్ కో, ఒక మమతకో అర్థం కాలేదు… రేవంత్ రెడ్డి అర్థం చేసుకున్నాడు… మనది ఫెడరల్ స్పిరిట్ ఉన్న దేశమనే స్పృహ ముఖ్యం ఏ ప్రాంతీయ నాయకుడికైనా… ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం…
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏ కేంద్ర ప్రాజెక్టునైనా గుజరాత్కు తీసుకుపోతుంది… అందరికీ తెలిసిందే… అంతేకాదు, చైనాకు దీటుగా ఏర్పాటు చేయదలిచిన సెమీ కండక్టర్ చిప్స్ తయారీ యూనిట్ను యూపీకి తీసుకుపోతోంది… ఎప్పుడూ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యం… తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కాబట్టి చిన్నచూపు…
దాన్ని బ్రేక్ చేయడానికి పదే పదే రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నాడు… మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్ సహా అనేక ప్రిస్టేజియస్ ప్రాజెక్టులకు కేంద్ర సాయం అభ్యర్థిస్తున్నాడు… పెద్దన్నా, ఈ విశ్వనగరాన్ని కూడా పట్టించుకో అని అడుగుతున్నాడు… హైదరాబాద్ నగరం తెలంగాణ ఆర్థిక ఇంజన్ మాత్రమే కాదు… దేశానికి కీలకమైన నగరమే అని గుర్తించమంటున్నాడు… చివరకు ఎఐ ఆధారిత ఏ ప్రాజెక్టుకైనా చేపట్టడానికి మేం రెడీ అని చెప్పాడు…
ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ AI సమ్మిట్లో రేవంత్ రెడ్డి తనకు కేటాయించిన 11 నిమిషాల సమయంలోనే, AI రంగంపై తనకున్న స్పష్టమైన విజన్ను, భవిష్యత్తులో దేశం అనుసరించాల్సిన విధానాలను బలంగా వినిపించాడు… రేవంత్ రెడ్డి ప్రసంగం ముగియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చప్పట్లు కొట్టి అభినందించడమే కాకుండా, ఆయనను తన పక్కనే కూర్చోబెట్టుకుని సుమారు అరగంట పాటు చర్చలు జరపడం విశేషం…
ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రి అంతటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఖచ్చితంగా తన ప్రసంగాంశాలకు ప్రధాని ఇంప్రెస్ అయ్యాడనే అర్థం… నిజానికి లోకల్ పొలిటికల్ ప్రసంగాల్లోకి వస్తే రేవంత్ రెడ్డి భాష వేరు, పక్కా మాస్, తెలంగాణ మట్టి వాసన… అప్పుడు “లాగూలో తొండలు” భాష వస్తుంది… అదీ కేటీయార్ వంటి నేతల మీదే… మిగతా నాయకుల మీద ఆ పరుష భాష వాడడు… అదేమంటే..? ఎవరికి ఏ భాషలో చెబితే అర్థమవుతుందో అదే భాషలో మాట్లాడాలి అంటాడు…
అందుకే చెప్పేది.., లోకల్ పొలిటికల్ మీటింగులోని రేవంత్ రెడ్డి ‘అన్ పాలిష్డ్ తొండల భాష’నే పట్టుకువేలాడే లోకల్ మీడియా... ఢిల్లీ ఎఐ సదస్సులో తను మాట్లాడిన ‘పాలిష్డ్ విజన్’ను ఎందుకు విస్మరించింది అని ఆ వెబ్ పత్రిక కథన సారాంశం... అదీ సంగతి... అన్నట్టు మొత్తం కేబినెట్ను హైకమాండ్ వద్దకు తీసుకుపోయి, ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చి, భేష్ అని చప్పట్లు కొట్టించుకున్న తీరు కూడా ప్రాధాన్య కవరేజీకి నోచుకోలేదు, అదీ చెప్పుకోవాల్సిందే...
Share this Article