.
నాకు ఈ వార్తాకథనాల్లో చివుక్కుమనిపించిందీ… రాజకీయ నాయకులు ఏ స్థితిలోనైనా స్వార్థంతోనే ఎలా ఆలోచిస్తారో అర్థమైంది… విషయంలోకి వెళ్దాం…
అమెరికాలో పోలీసు వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మరణం యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది… ప్రమాదం తరువాత అక్కడి పోలీసులు వ్యవహరించిన అమానవీయ వైఖరి మీద ఆగ్రహాన్ని కూడా కలిగించింది… తెల్లోడు ఏ దేశంలో ఉన్నా అంతేనేమో…
Ads
సరే, కోర్టుకు ఎక్కింది కేసు… జాహ్నవి మరణానికి పరిహారంగా సియాటెల్ అధికారులు ఏకంగా రూ. 262 కోట్ల (సుమారు $31 మిలియన్లు) భారీ మొత్తాన్ని ప్రకటించారు… ఈ వార్త బయటకు రాగానే ఆ కుటుంబానికి ఊరట కలగాల్సింది పోయి, కొత్త కష్టాలు మొదలయ్యాయి… ఒకవైపు మీడియా సంస్థలు ఇంటర్వ్యూల కోసం వేధిస్తుంటే, మరోవైపు బ్యాంకులు ఆ భారీ మొత్తాన్ని తమ బ్రాంచ్లలో డిపాజిట్ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయి…
అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే, ఒక స్థానిక ఎమ్మెల్యే ఆ కుటుంబానికి ఉన్న ఆస్తిపై కన్నేసి, తన కొడుకుకి జాహ్నవి చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని ప్రతిపాదించడం… ఆ ఎమ్మెల్యే కోరిక మరీ ఈ సందర్బంలో అమానవీయంగానే కనిపిస్తోంది… బ్యాడ్…
ఆ ఎమ్మెల్యే పేరును బయటపెట్టడం లేదు, అలాగే జాహ్నవి చెల్లెలి పేరు, చదువు, కొలువు వివరాలు వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ఏ మీడియా కూడా రాయడం లేదు, గుడ్… జాహ్నవికి పరిహారం ప్రకటించిన కొద్దిరోజుల ముందే, కూతురి వియోగాన్ని, ఈ ఒత్తిడి- విషాదం భరించలేక ఆమె తండ్రి కన్నుమూశాడు… అటు కన్నకూతురు, ఇటు భర్త ఇద్దరినీ కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లికి ఇప్పుడు ఈ కోట్ల రూపాయల ధనం లెక్కలోకి రావడం లేదు… ఏం చేసుకోవాలి అనే భావన.,.
ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం… జాహ్నవి తల్లి విజయలక్ష్మి ఒక సంచలన, అత్యంత గౌరవప్రదమైన నిర్ణయం తీసుకుంది… ప్రభుత్వం ఇచ్చే ఈ రూ. 262 కోట్ల పరిహారంలో అత్యధిక భాగం జాహ్నవి చదువుకున్న నార్త్ ఈస్టర్న్ యూనివర్శిటీకే (North Eastern University), ఆంధ్రా యూనివర్శిటీ కాలేజీకి విరాళంగా ఇవ్వాలని ఆమె భావిస్తున్నట్లు ఆమె బంధువులు చెబుతున్నారు…
ఆమె ప్రమాదం, మరణం, కేసు, భౌతిక దేహం ఇండియాకు వచ్చేవరకు… ఆ యూనివర్శిటీ, ఆ పిల్లలు జాహ్నవి కుటుంబానికి అండగా ఉన్నారట… (తండ్రి శ్రీకాంత్ పులివెందులలో కూడా పోలీసుగా పనిచేశాడని ఓ సమాచారం…)
“తన కూతురిని పోగొట్టుకున్న ఆ తల్లికి, ఆ డబ్బులో తన బిడ్డ ముఖం కనిపిస్తోంది తప్ప సుఖం కనిపించడం లేదు… మరో పదిమంది విద్యార్థులకు ఉపయోగపడేలా యూనివర్శిటీకి అధికశాతం ఇవ్వడమే మేలని ఆమె భావిస్తోంది” అని బంధువులు పేర్కొంటున్నారు… జాహ్నవి కందుల మెమోరియల్ ఫౌండేషన్ పేరుతో విదేశాల్లో ఉన్నత చదవుల కోసం వెళ్లిన విద్యార్థుల భద్రత, స్కాలర్షిప్లు, సింగిల్ పేరెంట్ కుటుంబాలకు సాయం చేయాలని భావిస్తున్నదట…
కన్నబిడ్డను కోల్పోయి, భర్త దూరమై, స్వార్థపూరిత సమాజం మధ్య ఒంటరిగా పోరాడుతున్న ఆ తల్లి తీసుకున్న ఈ నిర్ణయం అసామాన్యం… డబ్బు కంటే మానవత్వమే గొప్పదని, తన బిడ్డ జ్ఞాపకం పదికాలాల పాటు పదిమందికి ఉపయోగపడాలని కోరుకుంటున్న ఆమె మనసుకి యావత్ ప్రపంచం సలాం చేస్తోంది…
Share this Article