.
డిజిటల్ స్లో పాయిజన్ ……. మీరు ఉదయం కళ్లు తెరవగానే మొదట చేసే పని ఏమిటి? పక్కనే ఉన్న ఫోన్ను వెతకడమేనా? రాత్రి నిద్రపోయే ముందు.. ఆఖరి నిమిషం వరకు రీల్స్ స్క్రోల్ చూస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి!
అటు సోషల్ మీడియా మాయలో పడి మానసిక ఆరోగ్యాన్ని… ఇటు AI వేగంతో పోటీ పడలేక సాఫ్ట్వేర్ ఉద్యోగాలను ఫణంగా పెడుతున్నారు. మనల్ని మనం నియంత్రించుకోలేక స్మార్ట్ ఫోన్ మన జీవితాలనే శాసిస్తుంటే.. మనం సృష్టించిన టెక్నాలజీయే మనల్ని మింగేసే పరిస్థితి వస్తే? అదే ‘డిజిటల్ స్లో పాయిజన్’. భారత్లో ఈ ప్రమాదకర ధోరణి పెరుగుతోంది.
Ads
యువతపై డిజిటల్ ఉచ్చు- కేంద్ర ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు కేంద్ర ఆర్థిక సర్వే 2025-26 వెల్లడించిన గణాంకాలు మన కళ్లు తెరిపిస్తున్నాయి. 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువత మానసిక ఆరోగ్యం ప్రస్తుతం ఒక ‘టైమ్ బాంబ్’ మీద ఉంది. స్మార్ట్ఫోన్ల వాడకం కేవలం కాలక్షేపం కాదు, అది ఒక వ్యసనంగా మారింది.
* మెలటోనిన్ ఎఫెక్ట్..: ఫోన్ బ్లూ లైట్ వల్ల నిద్ర కరువవుతోంది.
* ప్రొడక్టివిటీ పతనం..: అకడమిక్, వర్క్ క్వాలిటీ దారుణంగా పడిపోతోంది.
* సంబంధాల దూరం..: ఒకే టేబుల్ మీద కూర్చున్నా.. పలకరించుకోవడానికి టైమ్ లేదు కానీ, స్క్రోల్ చేయడానికి గంటల సమయం ఉంటోంది.
* హెల్ప్ లైన్ డేటా…: మానసిక వ్యాధులకు కౌన్సిలింగ్ అందించే ‘టెలీ మానస్’ హెల్ప్లైన్కు ఒక్క ఏడాదిలో 32 లక్షల కాల్స్ వచ్చాయంటే డిజిటల్ ఉపద్రవం తెచ్చిన దుస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

టెక్కీల కొంపముంచుతున్న AI భయం … మరోవైపు, సాఫ్ట్వేర్ రంగంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. లక్షల జీతాలు వస్తున్నాయని సంబరపడే లోపే.. AI (కృత్రిమ మేధ) ఉద్యోగాలను మింగేస్తోంది. ‘రెస్ట్ ఆఫ్ వరల్డ్’ నివేదిక ప్రకారం, 2017- 2025 మధ్య పని ఒత్తిడి, అభద్రతా భావంతో 227 మంది భారతీయ టెక్కీలు తనువు చాలించారు.
ఒకప్పుడు రాయల్ లైఫ్ అనుకున్న సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు ‘రేపు నా ఉద్యోగం ఉంటుందా? లేదా? అనే భయంకరమైన రేసులా మారిపోయింది. కంపెనీలు లాభాల కోసం AI పై పెట్టుబడి పెడుతుంటే, సామాన్య ఉద్యోగి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
డోపమైన్ మాయాజాలం – సైకియాట్రిస్ట్ ల హెచ్చరిక సైకియాట్రిస్ట్ ల విశ్లేషణ ప్రకారం.. డిజిటల్ వ్యసనం మెదడులోని డోపమైన్ (Dopamine), సెరటోనిన్ (Serotonin) వంటి రసాయనాల సమతుల్యతను దెబ్బతీస్తోంది. ఫలితంగా చిన్న విషయాలకే కోపం, చిరాకు, విపరీతమైన ఒంటరితనం వేధిస్తున్నాయి. ఈ మానసిక బలహీనతే మనిషిని ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తోంది.
పరిష్కారం: మనం ఏం చేయాలి? ఈ డిజిటల్ మాయాజాలం నుంచి బయటపడటానికి మార్గాలు ఉన్నాయి:
1. డిజిటల్ వెల్నెస్..: స్కూల్స్, ఆఫీసుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాలి.
2. ఆఫ్లైన్ హబ్స్..: యువతను ఫోన్ల నుంచి ఆటల వైపు మళ్లించేలా హబ్స్ ఏర్పాటు చేయాలి.
3. పర్సనల్ డిసిప్లిన్..: రోజుకు కనీసం రెండు గంటల పాటు ‘ఫోన్ ఫ్రీ’ టైమ్ కేటాయించుకోవాలి. టెక్నాలజీ మన అవసరానికి మాత్రమే ఉండాలి, మనల్ని బానిసలుగా మార్చకూడదు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article