.
సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రంపై అభిశంసన..? సరిగ్గా ఇదే హెడింగుతో వార్త… ‘దిశ’ పత్రికలో నిన్న కనిపించింది… వేరే ఏ తెలుగు పత్రిక ఈ పరిణామాన్ని పట్టుకోలేకపోవడం ఆశ్చర్యం అనిపించింది… ఏమో, తెలిసీ రాయకుండా ఉండిపోయారో… (ఈరోజు మిగతా పత్రికలు రాశాయి)… ఇంతకీ ఆ వార్త ఏం చెబుతున్నదంటే..?
‘‘ఆయన వైఖరిపై కేంద్ర కమిటీ తీవ్ర ఆగ్రహం! ఇప్పటికే రాష్ట్ర కమిటీకి అభిశంసన లేఖ అందజేత… పదేళ్లలో పార్టీలో గ్రూపులు, క్యాస్టిజం పెంచారని మండిపాటు… ఆయన పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణను ఉల్లంఘించారని పేర్కొంటూ నాలుగున్నర పేజీల అభిశంసన లేఖను పార్టీ రాష్ట్ర కమిటీకి అందించింది…
Ads
పార్టీ అంతర్గత నిర్మాణం, క్రమశిక్షణను ఉల్లంఘించడం, గ్రూపిజం, క్యాస్టిజం, పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించడం.. ఇలా అనేక అంశాలపై కేంద్ర కమిటీ తప్పుబట్టిందని తెలిసింది… తెలంగాణలో పార్టీ ఈ విధంగా ఉండటానికి పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయాలే కారణమంటూ తమ్మినేని వీరభద్రం విమర్శించినట్లు సమాచారం… దీంతో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై మధురైలో జరిగిన జాతీయ కమిటీ సమావేశంలో అగ్ర నేతలు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలిసింది…
పార్టీ కేంద్ర కమిటీ ముగ్గురు సభ్యులతో ఓ కమిషన్ను నియమించింది… అది గతంలో రాష్ట్రంలో పర్యటించి పార్టీ ముఖ్య నాయకులందరితో విడివిడిగా మాట్లాడింది… వారందరి అభిప్రాయాలు సేకరించిన ఓ నివేదికకు కేంద్ర కమిటీ ఆమోదం తెలిపింది… ఆ తర్వాత కమిషన్ నివేదిక ఆధారంగా తమ్మినేనిపై అభిశంసన లేఖను కేంద్ర కమిటీ తయారు చేసింది….
తమ్మినేని కూడా ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు… 2025 పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల్లో కూడా కేంద్ర నాయకత్వం ఆలోచనలు, ప్రతిపాదనలకు భిన్నంగా తమ్మినేని వోటింగుకు పట్టుబట్టి, గ్రూపులు క్రియేట్ చేసి, పార్టీలో మనస్పర్థలు, విభేదాలకు కారణమయ్యారు..’’

స్థూలంగా ఆ వార్త ఇదే… మార్క్సిస్టు పార్టీ రాజకీయ ధోరణుల్ని వ్యతిరేకించేవాళ్లు కూడా మెచ్చుకోదగిన అంశం ఏమిటంటే..? పార్టీని నష్టపరిచే నాయకుల్ని అభిశంసించే సిస్టం ఉండటం… తదుపరి చర్యల మాటెలా ఉన్నా, పార్టీలో అంతర్గతంగానైనా ఓ పద్దతిని పాటించడం..!
దేశంలో చూస్తున్నాం కదా… కుటుంబ పార్టీలు, వ్యక్తి కేంద్రిత పార్టీల వ్యవహారం… అధినేత లేదా ఆ కుటుంబం ఎవరిని వద్దనుకుంటే వాళ్లను సింపుల్గా బహిష్కరించేస్తారు, వాటికి వోట్లేసే జనానికి ఆ కారణాలు కూడా ఎవరూ చెప్పరు… ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల్లా వ్యవహరిస్తాయి…
అంతెందుకు బీఆర్ఎస్ పార్టీనే తీసుకుంటే..? నరేంద్ర, విజయశాంతి నుంచి ఈటల దాకా… చివరకు అధినేత బిడ్డ కవిత దాకా పార్టీ నుంచి పంపించేస్తారు అవమానకరంగా… ఎందుకు అనే ప్రశ్నలకు వివరణలు ఉండవు… ఇలాంటి రాజకీయ పార్టీల వాతావరణంలో సీపీఎం ఏకంగా తన కేంద్ర కమిటీ సభ్యుడినే అభిశంసించడానికి పూనుకోవడం విశేషమే… ఈ కోణంలో జాతీయ పార్టీలే చాలా నయం…
అయితే..? తమ్మినేని పనితీరుపై ఇన్నాళ్లకు ఓ మథనం జరగడం కూడా ఆశ్చర్యమే… ఆయన గ్రూపులు క్రియేట్ చేయడం దగ్గర నుంచి… పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి డబ్బు వసూలు చేసి టీవీ చానెల్ పెట్టడం, అమ్మేయడం, ఆ డబ్బు ఎవరికో ఇవ్వడం, అవి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులుగా మారడం… ఇలాంటి ధోరణులెన్నో పార్టీలో అంతర్గతంగా ఎన్నో ఏళ్లుగా అసంతృప్తిని రాజేస్తూనే ఉన్నాయి కదా, ఇప్పుడేమీ కొత్త కాదుగా..! ఇన్నేళ్లూ చూసీ చూసీ ఇప్పుడు కేంద్ర కమిటీ ఇక తప్పదని కొరడా పట్టుకుందా..?
అసలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి సీపీఎం ఈ ప్రాంతంలో బాగా నష్టపోయింది… రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావరహితం అయిపోయింది… రాష్ట్ర నాయకుల వ్యక్తిగత రాజకీయ ధోరణులు కూడా కారణమే… ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ దురవస్థకు కారణాల మథనం జరగడం ఖచ్చితంగా వార్తాంశమే..!!
Share this Article