.
మేడారం… కోట్ల మంది దర్శించుకున్న జాతర అనంతరం నిన్న తిరుగువారం పండుగ జరిగింది… అంటే పూజారులు కుటుంబసమేతంగా వచ్చి, గద్దెలను, గుడి పరిసరాలను పసుపు నీళ్లు, ఆవుపేడతో శుద్ధి చేయడం… దీనికి కూడా మంత్రి సీతక్క హాజరై… మొత్తం ఆ జాతర పరిసరాల్లో సాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించింది…
గద్దెల చుట్టూ 150 కోట్ల ఖర్చుతో శిలాతోరణాలు, ప్రత్యేక క్యూ లైన్లు, స్నానఘట్టాలు, ఆదివాసీ- దేవతల చరిత్రకు శిలాక్షరీకరణ వంటి పనులతో ఈసారి మేడారం కొత్తగా కనిపించింది… అంతేకాదు, ప్రభుత్వం అక్కడ మంత్రివర్గ సమావేశం జరపడం ఆదివాసీ సంస్కృతిని అమిత ప్రాధాన్యతతో గౌరవించినట్టయింది… జాతర ఏర్పాట్లు, పనుల పర్యవేక్షణ దగ్గర నుంచి… ఇన్నిరోజులూ ఎటుచూసినా మంత్రి సీతక్క కనిపించింది…
Ads
ఆమె స్వయంగా ప్రతి పనినీ ఆ పరిసరాల్లో స్వయంగా తిరుగుతూ పర్యవేక్షించడం నుంచి పోలీసులు, స్థానిక నాయకులు, అధికారులతో ఆనందనాట్యం చేయడం దాకా అనేక వార్తలు, వీడియోలు ఈసారి జాతరకు మరింత ప్రచారం తీసుకొచ్చాయి… ఇక కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ డాన్స్ ఈసారి సోషల్ మీడియా హైలైట్… ఆమె భక్తుల రద్దీని గద్దెల దగ్గర స్వయంగా పర్యవేక్షిస్తున్న వీడియోలు కూడా పాపులరయ్యాయి…

- ఎస్, గద్దెల దగ్గర గానీ, స్నానాల దగ్గర గానీ, పరిసరాల్లో గానీ చిన్న తొక్కిసలాట లేదు… తెలంగాణ పోలీసు యంత్రాంగం ఈసారి ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది… డీజీపీ శివధర్ రెడ్డి పలువురు యువ ఐపీఎస్లకు జాతర బాధ్యతలు అప్పగించడం, వాళ్లు ప్రూవ్ చేసుకోవడం జాతర సజావుగా, సంబురంగా సాగిపోవడానికి కారణమైంది…
ఎక్కడ ఏ చాన్స్ దొరుకుతుందా, ప్రభుత్వంపై విరుచుకుపడదామా అని కాచుకున్న రాజకీయవర్గాలకు మింగుడపడలేదు… చివరకు గద్దెల దగ్గర ఒక రాతి మెట్టు కింద పడటంతో… అక్కడ బీఆర్ఎస్ నేతలు వాలిపోయారు… ఇక మొత్తం స్థంభాలన్నీ విరిగిపడిపోతున్నాయి అనే కువిమర్శలకు దిగారు… బీఆర్ఎస్ ధోరణి తెలిసిందే కదా… జాతర జరుగుతున్న సమయంలో మాత్రం బీఆర్ఎస్ పెద్ద తలకాయలకు అక్కడికి వెళ్లి, మొక్కి.., ఆదివాసీ జాతరను, మనోభావాలను గౌరవించాలనే సోయి మాత్రం లేకపోయింది…

కొన్ని చెప్పుకోవాలి… మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కారు జనదిగ్బంధంలో ఇరుక్కోవడం… సహజం… వాహనాల వరుసతో మంత్రి ఆ టైములో అక్కడికి వెళ్లడమే తప్పు… సమ్మక్క ఆగమనవేళ లక్షల మంది భక్తులు పూనకాలతో, భక్తి మైకంలో ఊగిపోతుంటారు… ఎవరినీ ఎవరూ ఆపలేరు… ఎంత బందోబస్తు ఉన్నా సరే… ఆ టైములో అక్కడ ఉన్నవాళ్లకు తెలుస్తుంది ఆ భక్తి తీవ్రత ఎలా ఉంటుందో…
ఒక దశలో మంత్రి సీతక్క హెచ్చరించింది… జాతర మీద అబద్ధపు ప్రచారాలు చేస్తే తరువాత యాక్షన్ ఉంటుందని..! ఈసారి వీవీఐపీలు పెద్ద కాన్వాయ్లతో రావడం కూడా కొన్ని ఇబ్బందుల్ని క్రియేట్ చేసింది… కోట్ల మంది భక్తుల సజావు దర్శనాలకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన స్థితిలో, ఈ ప్రొటోకాల్ మర్యాదలు నిజంగానే అధికార యంత్రాంగానికి కష్టం…

తప్పిపోయిన పిల్లల్ని ఎఐ సాయంతో వెతకడం దగ్గర నుంచి… ఈసారి జాతర పర్యవేక్షణకు డ్రోన్ ఉపయోగం కూడా విశేషమే… జాతర ముగిశాక ఆ పరిసరాలను మొత్తం శుభ్రం చేయడం జాతర నిర్వహణకన్నా పెద్ద టాస్క్… ప్రస్తుతం అదే పని నడుస్తోంది… ప్రతిసారీ ట్రాఫిక్ ఓ పెద్ద టాస్క్… పోలీసులు బాగానే కంట్రోల్ చేసినా, ఈ వీవీఐపీల కాన్వాయ్స్, హడావుడితో కొన్ని ఇబ్బందులు తలెత్తడం నిజం…
గతం వేరు… ఒకప్పుడు కేవలం గిరిజనం, ఆదివాసీలు అధికంగా రెండేళ్లకోసారి వచ్చి భక్తితో, దేవతల ఆరాధనలతో మమేకం అయ్యేవారు… ఇప్పుడు రెగ్యులర్ భక్తులు వస్తున్నారు… గిరిజనేతర భక్తుల తాకిడి పెరిగింది… బలులు, మద్యం అత్యంత సాధారణం… చిన్న అపశృతి దొర్లకుండా జాతర నిర్వహణ ఎప్పుడూ ప్రభుత్వానికి పెద్ద టాస్కే… ఎక్కడ ఏం తప్పు దొరుకుతుందా, గాయిగత్తర చేద్దామా అని కాచుకునే శక్తులకు ఏ అవకాశం దొరక్కుండా… ఈసారి జాతర సాఫీగా సాగిపోయింది…!!
Share this Article