.
మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి, అంటే ప్రస్తుతం పోరాటాన్ని లీడ్ చేస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ప్లస్ మరికొందరు అగ్రనేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన వేదిక… ఒక మహిళ ఉనికి ప్రస్ఫుటంగా కనిపించింది… ఎవరు ఆమె..?
బుల్లెట్ ఖర్చు కావద్దు, రక్తపు చుక్క చిందొద్దు… కానీ మావోయిస్టు అగ్రనేతల దాకా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి… అదీ వాళ్ల నమ్మకాన్ని గెలుచుకుని… చిన్న టాస్క్ కాదు ఇది… తెర వెనుక చాలా సీరియస్ వర్క్… అదుగో అందులో సక్సెస్ క్రెడిట్ దక్కాల్సిన కేరక్టర్ ఆమె… పేరు బి.సుమతి…
Ads
అందుకే అదే వేదిక మీద తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తూ.., “ఈ హైప్రొఫైల్ లొంగుబాటు సాధ్యం కావడానికి సుమతి, ఆమె నేతృత్వంలోని SIB బృందమే కారణం” అని పెద్ద సర్టిఫికెట్ ఇచ్చాడు… ఆమె అర్హురాలే… యాంటీ నక్సల్ ఆపరేషన్లలో ఉన్నవాళ్లకు బాగా తెలుసు ఇది ఎంతటి క్లిష్టమైన పనో..!
ఇంకాస్త గతంలోకి వెళ్దాం… రెండు దశాబ్దాల క్రితం…, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం మావోయిస్టు నాయకులు అడవి నుండి బయటకు వచ్చిన సందర్శం.., ఆమె అప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DySP) హోదాలో ఉంది… 2001 బ్యాచ్ స్టేట్ సర్వీస్ అధికారిణి… 2010లో ఐపీఎస్ (IPS) పొందిన ఆమె 2004లో మావోయిస్ట్ అగ్రనాయకత్వం శాంతి చర్చల కోసం అడుగులు వేసినప్పుడు అక్కడే ఉంది…
సీన్ కట్ చేస్తే… ఇది 2026… మంగళవారం, ప్రస్తుతం తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) అధిపతిగా ఉన్న ఆమె మళ్ళీ వార్తల్లో నిలిచింది… రెండు వేర్వేరు సందర్భాలు… రెండు చోట్లా ఆమె ఉనికి… ఇప్పుడైతే బలంగా, ప్రధాన పాత్రలో… ఇంకొన్ని వివరాల్లోకి వెళ్దాం…
-
2004 చర్చల సమయంలో సుమతి తన మొదటి బిడ్డతో గర్భిణి… చర్చలు ముగిసిన తర్వాతే ఆమె ప్రసూతి సెలవుపై వెళ్లింది… అదీ ఆమె కమిట్మెంట్…
-
ఎస్ఐబి (SIB) చీఫ్గా ఆమె పర్యవేక్షణలో ఇప్పటివరకు 591 మంది మావోయిస్టులు లొంగిపోయారు… ఇందులో నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు, 16 మంది స్టేట్ కమిటీ సభ్యులు ఉన్నారు…
-
వరంగల్లో డీఎస్పీగా పనిచేసినప్పుడు ఆమెకు “పీపుల్స్ ఆఫీసర్” అనే పేరు వచ్చింది… ఆమె బదిలీ అయినప్పుడు స్థానిక ప్రజలు ధర్నాలు కూడా చేశారు…
-
హైదరాబాద్లో బాంబు పేలుళ్లు జరిగిన సమయంలో ఆమె సీఐడీ, సైబర్ క్రైమ్, కౌంటర్ ఇంటెలిజెన్స్లో పనిచేస్తుండేది… ఇండియన్ ముజాహిదీన్, సిమి (SIMI), ఐసిస్ (ISIS) వంటి సంస్థలకు చెందిన అనుమానితులను ఆమె స్వయంగా విచారించిన అనుభవం ఉంది…
-
మావోయిస్టులను చంపడం వల్ల ఏమవుతుంది..? వారు ‘అమరవీరులు’ అవుతారు.., కానీ వారిని మార్చి, ఒప్పించి, జనజీవన స్రవంతిలో కలపడం (Rehabilitation) ద్వారానే శాశ్వత శాంతి లభిస్తుందని సుమతి నమ్మకం… అదే సమయంలో, లొంగిపోయే నేతలు “ప్రభుత్వ మార్గమే సరైనది” అని అంగీకరించాలని ఆమె స్పష్టం చేస్తుంది…
- ఒకరకంగా చెప్పాలంటే ఇది ఓ సైద్ధాంతిక సమరం… ఇదేసమయంలో మావోయిస్టు పార్టీలో నిష్ఫలంగా సాగుతున్న సాయుధపోరాటంపై ఆత్మచింతన ప్రారంభం కావడం కూడా ఆమె లొంగుబాట్ల ప్రయత్నాలకు మరింత ఉపకరించింది… సరైన సినేరియోలో సరైన ఎఫర్ట్స్… సరైన రిజల్ట్స్…
సరే, అప్పుడే అయిపోలేదు, ఈ దిశలో మరో కీలక వికెట్ పడాల్సి ఉంది, అది వేరే సంగతి… దేవ్జీ లొంగిపోయిన తరువాత మాట్లాడుతూ “నేను ఈ దేశ చట్టబద్ధమైన చట్రంలో పని చేయాలనుకుంటున్నాను” అని చెప్పడం రాజ్యం గెలిచిన సైద్ధాంతిక సమరం…
ఆమె మావోయిస్టుల తిరుగుబాటును అణిచివేసేందుకు ఏర్పాటైన ఎస్ఐబి విభాగానికి నాయకత్వం వహిస్తున్న తొలి మహిళా అధికారిణి… సాధారణంగా ఇలాంటి ఆపరేషన్లలో ప్రధానంగా పురుష అధికారులే ఉంటుంటారు… కానీ 2004 శాంతి చర్చల నుండి దేవ్జీ లొంగుబాటు వరకు: మావోయిస్ట్ కోటను ఛేదించిన ‘తొలి మహిళా’ అధికారిణి… ఎస్ఐబీ పుస్తకంలో ఆమెకంటూ ఓ పేద్ద అధ్యాయమే ఉంది ఇప్పుడు..!!
అన్నట్టు... తెలంగాణ మావోయిస్టు నేతలూ, తెలంగాణలోనే లొంగిపొండి అనే బొడ్డుపేగు బంధం సెంటిమెంట్ ప్రయోగించి మరీ సక్సెసైన డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబీ సుమతి ఇద్దరూ తెలంగాణ బిడ్డలే..!
Share this Article