.
ఎవరైనా రాజకీయ నాయకులపై కేసులు పడితే… జైలుకెళితే, కడిగిన ముత్యంలా బయటికొస్తాం అని చెబుతుంటారు గంభీరంగా..! మన న్యాయవ్యవస్థ మీద ఉన్న అపారమైన నమ్మకం అది…! కొందరు నాయకులైతే బెయిల్ రాగానే ఇక కేసు నుంచి విముక్తి పొంది, నిర్దోషులుగా బయటికొచ్చినట్టే అన్నంత బిల్డప్ ఇస్తుంటారు, ర్యాలీలు, విజయోత్సవాలు చేసుకునేవాళ్లూ ఉన్నారు…
కానీ బెయిల్ రాగానే లేదా దిగువ కోర్టులు నిర్దోషులుగా తీర్పు చెప్పగానే అదేమీ అంతిమ తీర్పు కాదు… అలాగే కింది కోర్టులు దోషులుగా తేల్చినా సరే అదీ అంతిమ తీర్పు కాదు… ట్రయల్ కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు, డివిజన్ బెంచ్ ఎన్ని దశలు లేవు..? అదేదో సినిమాలో దాసరి డైలాగులు గుర్తున్నాయి కదా…
Ads
‘‘కోర్టు కోర్టుకీ తీర్పు తీర్పుకీ ఇంత మార్పుంటే ఇంతకీ మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా లేనట్టా యువరానర్’’ అని ప్రశ్నిస్తాడు ఎన్టీయార్… సరే, ఇదంతా ఎందుకిప్పుడు అంటే..? మన ప్రజాప్రతినిధులపై దోషిత్వం నిరూపణయ్యే కేసులు అత్యల్పం… అవీ ఏళ్లుగా సాగుతూనే ఉంటాయి… టూజీ స్కాం పెద్ద ఉదాహరణ…
ఢిల్లీ మద్యం కేసు సంగతే తీసుకుందాం… ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మంత్రి సిసోడియా, కల్వకుంట్ల కవిత తదితరులు చాలామంది అరెస్టయ్యారు, జైలు జీవితం గడిపారు, బెయిల్ కూడా అంత సులభంగా రాలేదు… ఈ కేసు రాజకీయ ప్రేరితమని నిందితులు ఆరోపించారు… చివరకు మొన్న రౌస్ అవెన్యూ సీబీఐ ట్రయల్ కోర్టు ఆ కేసులో ఏ ఆధారాలూ లేవని, అనుమానించదగిన అంశాలు కూడా లేవని వ్యాఖ్యానిస్తూ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది…
అంతేకాదు, సీబీఐ మీద కొన్ని పరుషమైన ప్రతికూల వ్యాఖ్యలు కూడా చేసింది… ఇంకేం..? కేజ్రీవాల్ అయితే భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు… చాలారోజులు జైలులో ఉన్న సిసోడియా ఉద్వేగమైతే చెప్పనక్కరలేదు, కవిత కూడా కడిగిన ముత్యంలా బయటపడ్డాను అని చెప్పుకుంది… కానీ నిజం ఏమిటంటే..? ఏ ముత్యమూ ఇంకా పూర్తిగా కడగబడలేదు… సినిమా ఇంకా అసంపూర్ణంగానే ఉంది… శుభం కార్డు పడలేదు…
ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలతో సీబీఐ దీన్ని సీరియస్గా తీసుకుంది, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది… ట్రయల్ కోర్టు తీర్పు అసాధారణం, క్రిమినల్ న్యాయశాస్త్రానికే విరుద్ధమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించాడు… హైకోర్టు సదరు కేసులోని 23 మంది నిందితులకూ నోటీసులు పంపించింది… ట్రయల్ కోర్టు తీర్పుతోపాటు అది చేసిన ప్రతికూల వ్యాఖ్యల మీద స్టే ఇచ్చింది… ఈ కేసు ఆధారంగా నమోదైన ఈడీ కేసు విచారణపైనా స్టే ఇచ్చింది…
తగినన్ని సాక్ష్యాధారాలు చూపించడం వల్లే కదా పదే పదే బెయిల్ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది..? అసలు ప్రాథమిక ఆధారాలు లేవనీ, అనుమానించదగిన అంశాలే లేవని చెప్పడం ఏమిటనేది సొలిసిటర్ జనరల్ ప్రశ్న… సో, ప్రజెంట్ సిట్యుయేషన్ ఏమిటి..? ముందే చెప్పినట్టు… ఎవరూ నిర్దోషులుగా తేలినట్టు కాదు, ముత్యాలు కడగబడినట్టు కూడా కాదు…!! ఇంకా నిందితులు లీగల్ ఫైట్ కొనసాగించాల్సిందే..!!
Share this Article