.
కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా దగ్గరకు సీఎం ఒక్కడే కాదు… సీఎంఓ సెక్రెటరీ శేషాద్రి, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి కూడా వెంట ఉన్నారు… అందుకే… ఇంత టీమ్ ఎందుకు అనే ప్రశ్న రకరకాల వార్తలకు తావిచ్చింది…
మోదీని, అమిత్ షాను రేవంత్ రెడ్డి కలవడంలో ఆశ్చర్యం లేదు, చాలాసార్లు కలిశాడు… తను కాంగ్రెస్ కాబట్టి, అమిత్ షో బీజేపీ కాబట్టి ఎందుకు పదే పదే కలవాలనే సంకుచిత ధోరణి రేవంత్ రెడ్డిలో లేదు… రాజకీయం వేరు- రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో సమన్వయం- సహకారం వేరు… అది అన్ని రాష్ట్రాలకూ కేంద్ర ప్రభుత్వం కదా…
Ads
మా రాష్ట్రంలో ఈగల్ను స్ట్రెంతెన్ చేయండి, మరిన్ని ఐపీఎస్ పోస్టులు ఇవ్వండి అనే కోరికలు చెప్పి ఉండవచ్చుగాక… కానీ అవి చెప్పడానికి ఈ పోలీస్ టీమ్తోపాటు వెళ్లాల్సిన పనిలేదు… ఎప్పుడో అమిత్ షా దగ్గరకు వెళ్లినప్పుడు చెప్పొచ్చు… లేదా ప్రాపర్ చానెల్లో కరెస్పాండెన్స్ చాలు…
పోనీ, అమిత్ షాతో రాజకీయాలు మాట్లాడాడా… సవాలే లేదు… అధికారుల టీమ్ ఎదుట ఆ ప్రస్తావనలు రావు… ఈ నెలాఖరుతో నక్సల్ ముక్త భారత్ లక్ష్యాన్ని పెట్టాడు అమిత్ షా అన్ని రాష్ట్రాల ఎదుట… అదే దిశలో ప్రతి రాష్ట్రమూ భారీగా లొంగుబాట్లను ప్రోత్సహిస్తూనే… కీలక ఆపరేషన్లను కూడా చేపడుతోంది… ప్రత్యేకించి మహారాష్ట్ర, చత్తీస్గఢ్, తెలంగాణ…
మావోయిస్టు పార్టీ టాప్ లీడర్ షిప్ ప్రధానంగా తెలంగాణ వాళ్లే కాబట్టి… తెలంగాణ ఎక్కువ ఫోకస్ పెట్టింది… ఏపీ పోలీసుల్లాగా గాకుండా… రక్తపాతాలు అవసరం లేకుండా, సేఫ్ ప్యాసేజీలు, ప్రాణరక్షణ భరోసాలు ఇచ్చి, శాంతియుతంగా లొంగిపోయేలా చూడటమే ప్రయారిటీగా పెట్టుకుంది తెలంగాణ… ఆ దిశలోనే సరైన వర్క్ జరిగింది… మావోయిస్ట్ కేంద్ర కార్యదర్శి సహా కీలకనేతలు కూడా లొంగిపోయారు…
ఇక మిగిలింది గణపతి… తనూ తెలంగాణే… అనారోగ్యంతో కేంద్ర కార్యదర్శిగా విరమించినా, ఈరోజుకూ అజ్ఞాతంలో ఉన్న అత్యంత సీనియర్, సైద్ధాంతిక మార్గదర్శి… రకరకాల వార్తలు, నేపాల్ లేదా ఫిలిప్పీన్స్లో షెల్డర్ తీసుకున్నాడని… ఇక్కడ రోజులు బాగాలేవు, ఏ క్షణం ఏ ప్రత్యేక బలగం తుపాకీ తూటా పేలుతుందో తెలియదు కాబట్టి…

గణపతి లొంగుబాటుకు కూడా తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు చేశారనీ, తనకు టచ్లో వెళ్లారనీ, రేపో మాపో గణపతి లొంగుబాటుతో ఇక ఈ ‘జీరో మావోయిస్ట్’ ఆపరేషన్ పూర్తవుతుందనీ వార్తలొచ్చాయి… పోలీసులు ఖండించలేదు, ఔననలేదు… చేసే పనేదే సైలెంటుగా చేస్తూ వెళ్లారు… ఇప్పుడు ఏకంగా అమిత్ షా వద్దకు ‘యాంటీ నక్సల్’ ఆపరేషన్లలో కీలకంగా ఉన్న శివధర్రెడ్డి, సుమతి కూడా వెళ్లడంతో… గణపతిని ఏకంగా అమిత్ షా దగ్గర లొంగిపోయే ప్రోగ్రామ్ ఏదో ప్లాన్ చేసినట్టు నిన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి…
ఏదో మావోయిస్టులకు సంబంధించిన పెద్ద విశేషం లేకపోతే అమిత్ షా దగ్గరకు ఈ టీమ్ వెళ్లదు, అదీ రేవంత్రెడ్డితోపాటు…! సో, అదేమిటి..? గణపతిలోపాటు 100- 150 మంది ఆయుధాలతో లొంగిపోతారనీ, అది తెలంగాణ పోలీసుల నేతృత్వంలో సాగబోతోందనీ, అదుగో ఆ ఫినిషింగ్ టచ్ ప్రోగ్రాం చర్చించడానికే ఈ టీమ్ అమిత్ షాను కలిసిందనేది వార్తల సారాంశం…
అది రేపా, నేడా, ఎల్లుండా అనేది ప్రశ్న కాదు… ఇంకాస్త లేటుగా కూడా కావచ్చు… కానీ గణపతి సరెండర్తో మావోయిస్ట్ ప్రస్థానానికి ఎండ్ కార్డ్ పడటం ఖాయం… అదీ తెలంగాణ పోలీసులు నేతృత్వంలోనే ఖాయం… అదెప్పుడనేది వేచిచూస్తూ, ఈలోపు ఇక రకరకాల వార్తలు చదవడమే..!
మావోయిస్ట్ పార్టీపై నిషేధం ఎత్తివేత, ఏకరూప పునరావాస ప్యాకేజీలు, కేసుల ఎత్తివేతల, ఆపరేషన్ కగార్ నిలుపుదల వంటివి ఒక్క రాష్ట్రం పోలీసులతో చర్చించి నిర్ణయించేవి మాత్రం కావు… పైగా కేంద్రంలోని బీజేపీ రాజకీయ ధోరణిలో అవేవీ సాధ్యం కావు కూడా..!!
Share this Article