.
ధూర్త జ్యోతిష్కులున్నారు జాగ్రత్త… —– జ్యోతిషం పేరుతో మనలో పలు వికారాలు చలమణిలో ఉన్నాయి. యూట్యూబ్, టీ.వీ. చానళ్ల ద్వారా జ్యోతిష నామ ధూర్తత్వం సమాజానికి కీడు చేస్తోంది.
గోచార గ్రహ ఫలితాలు అంటూ, ఉగాది ఫలితాలు అంటూ ఒక రకమైన విదూషకత్వం, వికారం వ్యాపిస్తున్నాయి. పరిహారాలు అంటూ జ్యోతిష్కులు అనబడుతున్న కొందరు వైపరీత్యాన్ని ప్రజలకు అలవాటు చేస్తున్నారు. ఇవాళ జ్యోతిషం అన్నదాని వల్ల కూడా సమాజానికి హాని జరుగుతోంది!
Ads
రానున్న ఉగాది సందర్భంగా ఒక పరిహారంగా ఆంజనేయస్వామి గుళ్లో సిందూరం, వెన్న దానం ఇవ్వాలట; సిందూరాన్ని విగ్రహానికి రాయించాలట. ఈ పరిహారం చేస్తే ఉగాది దుష్ప్రభావాలు పోతాయట, మేళ్లు జరుగుతాయట. చదువు, బుద్ధి, సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు చెప్పే జ్యోతిష్కులు అనబడుతున్న వాళ్లు ప్రజలకు పెనుహానికరం. ఇలాంటి వాళ్లు జ్యోతిషం అన్న దానికి కళంకం.
విపరీత జ్యోతిష్కుల వల్ల జ్యోతిషం అన్నది భ్రష్టుపట్టిపోతోంది. బృహజ్జాతకం, జాతక పారిజాతం, సారావళి, కేరళీయం, భావార్థ చంద్రిక, బృహత్సంహితా, పరాశర జ్యోతిషం, జైమిని సూత్రాలు, జ్యోతిష గ్రహ చింతామణి, జాతకాలంకారం వంటి సాంప్రదాయిక జ్యోతిష గ్రంథాలు ఉన్నాయి అన్న సంగతైనా ఈ విపరీత జ్యోతిష్కులకు తెలుసో లేదో?
జ్యోతిషం అన్నది ఒక సాగరం. మిడిమిడి జ్ఞానంతో ఏదో పేలాపన చేస్తూ కొందరు ధూర్తులు జ్యోతిషం పేరుతో సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. జ్యోతిషం విషయంలో సరైన, సమగ్రమైన చదువు, అవగాహన అవసరం. సరైన డాక్టర్, సరైన ఆడిటర్, సరైన లాయర్, సరైన ఎలక్ట్రీషన్, సరైన డ్రైవర్ కాని వాళ్ల వల్ల ఎంత హాని జరుగుతుందో సరైన జ్యోతిష్కులు కాని వాళ్ల వల్ల కూడా ప్రజలకు అంతే హాని జరుగుతుంది.
గోచార ప్రభావం ఒక రాశి వాళ్లందరిపైనా ఒకేలా ఉండదు. జాతక చక్రం (రాశి, నవాంశం కలుపుకుని)లోని గ్రహ స్థానాలు, దశ, భుక్తులకు తగ్గట్టుగా మాత్రమే గోచార ప్రభావాలు, ఫలితాలు ఒక మేరకు ఉంటాయి.

‘దశాను భావేన ఫలం వదతి’ అని జాతక పారిజాతం తెలియజేస్తోంది. జాతక చక్రం అన్నదే ప్రధానం. జాతక చక్రాన్ని బట్టే గోచార ప్రభావాలు ఉంటాయి. ఒక వ్యక్తికి ఇమ్యూనిటి ఉన్నప్పుడు వాతావరణంలో ఉన్న వైరస్ వల్ల హాని ఉండదు. ఆ విధంగానే జాతక చక్రం బలంగా ఉంటే గోచార ప్రభావాలు హానికరంగానూ, నష్టకరంగానూ, అపాయకరంగానూ ఉండవు. గోచార ప్రభావం అన్నది 10% శాతానికి మించి ఉండదు.
జ్యోతిష్కుల విషయంలో ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలి; సరైన, మేలైన జ్యోతిష్కులను ఎంచుకోవాలి. మౌలికమైన విషయాలు కూడా తెలియని, సరైన తెలివి, తెలివిడి లేని, శాస్త్ర జ్ఞానం లేని, అనుభవ జ్ఞానం లేని జ్యోతిష్కుల(?) పేలాపనలకు, అజ్ఞానానికి, అతి తెలివికి ధూర్తత్వానికి ప్రజలు బలి కాకూడదు. గోచార ప్రభావం విషయంలో జ్యోతిష్కులు అనబడుతున్న వాళ్ల వంచనకు ఎవరూ ఎర కాకూడదు.
జ్యోతిష్కులు అన్న పేరుతో కొందరు చీడ పురుగుల్లా సమాజానికి పట్టారు. అటువంటి ‘ధూర్త జ్యోతిష్కులు’ ప్రజల జీవితాలను అపాయాలపాలు చేస్తారు. ధూర్త జ్యోతిష్కులున్నారు జాగ్రత్త.
రోచిష్మాన్
9444012279
Share this Article