.
ఆహా ఎంత బాగుంది స్టోరీ… ఓ మంచి పాలకుడు దొరకాలి, సరైన దిశలో దేశాన్ని నడిపించాలి… ఆ తెలివితో ఆ దేశ భవిష్యత్తు తరాలూ భద్రంగా బతుకుతాయి… ఆ స్టోరీ కావాలా… ఇదుగో… ఇది ఆర్థిక పాఠం కాదు… నిజమైన నాయకత్వ తెలివిడి, ముందుచూపు…
నార్వే… ఈ దేశ పాలకులు రేపటి ఎన్నికల కోసం ఏం వేషాలు వేయాలోనని ఆలోచించలేదు… తమ భవిష్యత్తు తరాల గురించి ఆలోచించారు…
Ads
భవిష్యత్తు కోసం వారి పెట్టుబడి … 1969లో, నార్వే ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రగర్భ చమురు నిక్షేపాలలో ఒకదానిని కనుగొంది…
ఎకోఫిస్క్ (Ekofisk) క్షేత్రం ఆ దేశ తలరాతనే మార్చేసింది… హఠాత్తుగా, ఈ చిన్న స్కాండినేవియన్ దేశం అపారమైన సంపదపై కూర్చుంది… చాలా చమురు దేశాలు చేసే పనినే వారు కూడా చేసి ఉండవచ్చు… వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయడం, భారీ భవనాలు నిర్మించడం లేదా కొంతమంది వ్యక్తులు మాత్రమే ధనవంతులు అయ్యేలా చేయడం. కానీ చమురు అయిపోయినప్పుడు అలాంటి దేశాలు అప్పుల్లోకి, అస్థిరతలోకి కూరుకుపోతాయి…
నైజీరియా, వెనిజులా, లిబియా వంటి దేశాలు అదే బాటలో వెళ్లి దెబ్బతిన్నాయి… నార్వే మాత్రం ఆ తప్పుల బాటలోకి పోలేదు… ఒక భిన్నమైన నిర్ణయం తీసుకుంది…
ఒక విప్లవాత్మక నిర్ణయం 1990లో, నార్వే పార్లమెంట్ ‘గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్’ను ఏర్పాటు చేసింది… దీని నియమాలు చాలా సరళంగా ఉన్నప్పటికీ ఎంతో శక్తివంతమైనవి…
-
చమురు ద్వారా వచ్చే లాభాలన్నీ ఈ ఫండ్లోకి వెళ్తాయి…
-
ఈ ఫండ్ ప్రపంచవ్యాప్తంగా వేల కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది…
-
నార్వే ప్రతి ఏటా ఈ ఫండ్ నుండి కేవలం 3% మాత్రమే ఖర్చు చేయగలదు…
-
మిగిలిన సొమ్ము ఎప్పటికీ పెట్టుబడిగా అలాగే ఉంటుంది…
చాలామంది దీన్ని పిచ్చితనం అనుకున్నారు… “ఇంకా పుట్టని వారి కోసం ఇప్పుడే ఎందుకు డబ్బు దాచాలి? పన్నులు తగ్గించి, ఇప్పుడే ఎంజాయ్ చేయొచ్చు కదా?” అని ప్రశ్నించారు… దానికి నార్వే ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఒక్కటే…. "భవిష్యత్తు నార్వేజియన్లు కూడా పుడతారు... మనకు ఉన్నంత హక్కు వారికి కూడా ఈ సంపదపై ఉంది...."

క్రమశిక్షణే వారి బలం 1996లో వారు మొదటి విడతగా 150 మిలియన్ డాలర్లను డిపాజిట్ చేశారు… అప్పటి నుండి వారు వెనక్కి తిరిగి చూడలేదు…
-
రాజకీయ నాయకులు ఎన్నికల కోసం ఈ నిధులను వాడాలని చూసినా, ఆర్థిక సంక్షోభాలు ఎదురైనా… నార్వే ఆ నిబంధనలను ఎప్పుడూ ఉల్లంఘించలేదు…
-
వారు రిస్క్ తీసుకోకుండా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9,000 కంపెనీలలో (ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటివి) చిన్నపాటి వాటాలను కొనుగోలు చేశారు…
అద్భుతమైన ఫలితాలు
-
2000 నాటికి: $ 50 బిలియన్లు.
-
2010 నాటికి: $ 500 బిలియన్లు.
-
2017 నాటికి: $ 1 ట్రిలియన్ మార్కును దాటింది.
-
నేడు: అది $2 ట్రిలియన్లను మించిపోయింది.
కేవలం 56 లక్షల జనాభా ఉన్న దేశానికి, ఇది ఒక్కో పౌరుడికి సుమారు $340,000 (సుమారు ₹2.8 కోట్లు) విలువైన సంపదతో సమానం…
ఇందులో విశేషం ఏమిటంటే, ఈ ఫండ్ విలువలో సగానికి పైగా చమురు అమ్మకం ద్వారా వచ్చింది కాదు, అది పెట్టిన పెట్టుబడుల లాభాల (Returns) ద్వారా వచ్చింది… ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్ కంపెనీల్లో 1.5% వాటా నార్వే సొంతం…
రేపటి తరానికి భరోసా నార్వేలో చమురు మరో 30 లేదా 50 ఏళ్లలో అయిపోవచ్చు… కానీ అది వారికి సమస్య కాదు… చమురు ఆగిపోయినా, ఈ మల్టీ-ట్రిలియన్ డాలర్ ఫండ్ నుండి వచ్చే లాభాలతో నార్వే పిల్లలు ఉచిత విద్యను పొందుతారు, వృద్ధులు పెన్షన్లతో సురక్షితంగా ఉంటారు, మరియు దేశం మొత్తం ఎప్పటికీ సుభిక్షంగా ఉంటుంది…
నార్వే సాధించిన గొప్పతనం చమురు కనుగొనడంలో లేదు, ఆ సంపదను క్రమశిక్షణతో, ముందుచూపుతో భవిష్యత్తు తరాల కోసం దాచడంలో ఉంది… వారు తమ గురించి కాకుండా, తమ మనవళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించారు...
Share this Article