.
ప్రతిపక్ష సభ్యులు ఏకంగా పార్లమెంటులోనే ప్రధాని మీద భౌతిక దాడికి ప్రయత్నించే అవకాశముందని నాకు సూచనలున్నాయి, అందుకే ప్రధానికి చెప్పాను… తను అందుకే లోకసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద సమాధానం ఇవ్వడానికి కూడా రాలేదు…… ఇదీ లోకసభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటన…
నిజానికి ఇండియన్ పార్లమెంటు చరిత్రలో ఇది మనం ఊహించి ఉండం… విస్మయం, ఆందోళన… నిజంగా ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామిక ప్రభుత్వ వ్యవస్థగా గౌరవం పొందుతున్న ఇండియాకు ఇంత చేదు మరకా..? నిజమేనా అని చాలామందిలో సందేహం…
Ads
జరగొద్దని ఏమీ లేదు, జరగాలనీ ఏమీ లేదు… ప్రస్తుతం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మనస్థితి, వ్యవహార ధోరణిని బట్టి ఇలాంటి జరగకూడదని ఏమీ లేదు… చాలా నెగెటివ్ బాటలో వెళ్తున్నాడు… పరుషంగా ఉన్నా సరే, ఇది రియాలిటీ… ఎహె, పార్లమెంటులో అలా ఎవరైనా చేయగలరా అని మీ ప్రశ్నా..?
ఒక్కసారి గుర్తుచేసుకొండి… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు… కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే ప్రయోగిస్తే… ఎంపీలు దగ్గుతూ, కళ్లు మండుతూ, హాహాకారాలు చేస్తూ బయటికి పరుగులు తీసిన దృశ్యాలు… (తరువాత తన రాజకీయ జీవితమే సమాధి అయిపోయింది, అది వేరే కథ)…
పార్లమెంటు బయటి వరకే ఎంపీలు ఎవరికైనా భద్రత… ప్రధానికైనా సరే బయటి వరకే ఎస్పీజీ భద్రత… ఒకసారి హౌజులోకి వెళ్లాక అందరూ ఒకటే… అవసరమైతే, స్పీకర్ ఆదేశిస్తే మార్షల్స్ వస్తారు, అదీ సభ్యులకు రక్షణగా కాదు, సభ్యులను బయటికి పంపించడానికి… ఒక్కసారి ఈ సీన్ చూడండి…

ప్రధాని కుర్చీ దగ్గరకు వెళ్లి, ప్రతిపక్ష మహిళా ఎంపీలు గొడవ చేస్తున్న దృశ్యం (రిపబ్లిక్ టీవీ ఇమేజ్)… సో, స్పీకర్ ఓం బిర్లా అనుమానం ఏమిటంటే..? మహిళా ఎంపీలనే ముందు పెట్టి ఏకంగా మోడీ మీద అటాక్ చేయడం… నిజమో కాదో తెలియదు, కానీ విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్న ప్రతిపక్షం మూడ్ మాత్రం అదే… పైన చూడండి, ప్రధాని (పార్లమెంటరీ నేత) కుర్చీ ఎదుట ఈ హడావుడి…
ఇక్కడ ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం… నిజంగా ప్రధాని మోడీ మీద ఏ చిన్న భౌతిక దాడి జరిగినా… కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయేది… రాహుల్ గాంధీ పొలిటికల్ కెరీర్కు ఫుల్స్టాప్ పడేది… ఒకవేళ అర్జెంటుగా మార్షల్స్ గనుక ప్రవేశించి, ప్రతిపక్షం ముందు పెట్టి కథ నడిపిస్తున్న మహిళా ఎంపీల పట్ల ర్యాష్గా బిహేవ్ చేస్తే అది అధికార పక్షానికి మైనస్ అయ్యేది, ప్రతిపక్షం సానుభూతి గేమ్ మొదలుపెట్టేది…
సో, ఇక్కడ స్పీకర్ – మోడీ గైర్హాజరు నిర్ణయాన్ని తప్పుపట్టలేం, మెచ్చుకోనూలేం… ఎందుకంటే… మోడీ, అంటే, ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రధాని భయపడ్డాడు అనే అప్రతిష్ట, అదొక మరక… అనివార్యమైనా సరే..! అవసరమైతే ప్రధాని చుట్టూ మార్షల్స్ను నిలబెట్టి, ప్రసంగింపజేసినా సరే, అదీ ఓ అప్రతిష్టే… సొసైటీలోకి అది పాజిటివ్గా వెళ్లదు…
సో, స్పీకర్ నిర్ణయం, ప్రతిపక్ష దుందుడుకు ఆలోచనలు, ప్రధాని గైర్హాజరు… ఏదీ తప్పనలేం, ఒప్పనలేం… నిజానికి లగడపాటి ఎపిసోడ్ తరువాత ఎంపీల ఎంట్రీ సమయంలోనే సిబ్బంది కఠినంగా ఉంటున్నారు… మరీ కత్తులు, కఠార్లు తీసుకుపోయే సీన్ ఏమీ లేకపోయినా సరే, అక్కడ వేరే ప్రత్యేక భద్రత ఏర్పాట్లు ఏమీ ఉండవు కాబట్టి నేరుగా ప్రధాని కుర్చీ దగ్గరకు దూకుడుగా దూసుకుపోయే అవకాశం మాత్రం ఉంది…
ఎహె, రాహుల్ గాంధీ అంత పరిణతి లేని ప్రణాళికలు వేస్తాడా అనేది కొందరి ప్రశ్న… తన ధోరణే అది… పొలిటికల్ గెయిన్ కోసం స్పీకర్, బీజేపీ కావాలని ‘ఈ భౌతిక దాడి’ ప్రచారాన్ని ఆశ్రయించారని అనుకోవడానికి లేదు… ఎందుకంటే, ప్రధాని కుర్చీ ఎదుట మహిళా ఎంపీలు వీరంగం చూశాం కదా… పైగా ఈసారే లోకసభలో వైరల్ అయిన ఓ సీన్ గురించి కూడా చెప్పుకోవాలి…
(ఫిబ్రవరి 4, 2026)… పార్లమెంటు ప్రాంగణంలో రాహుల్ గాంధీ- కేంద్ర మంత్రి, సిక్కు నేత రవ్నీత్ సింగ్ బిట్టూ మధ్య ఒక ఆసక్తికరమైన, ఘాటైన సంభాషణ జరిగింది…
పార్లమెంటులోని ‘మకర ద్వారం’ వద్ద ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా రాహుల్ గాంధీ నిరసన తెలుపుతున్నాడు… ఆ సమయంలో బిజెపి ఎంపీ, కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ అక్కడి నుండి వెళ్తుండగా, రాహుల్ గాంధీ ఆయనను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు…
“ఇదిగో ఒక ద్రోహి (Traitor) వెళ్తున్నాడు, ఇతని ముఖం చూడండి…” అని అంటూ, నవ్వుతూనే తన చేయిని షేక్ హ్యాండ్ కోసం చాచాడు… “హలో బ్రదర్, నా ద్రోహి మిత్రమా (My traitor friend)… చింతించకు, నువ్వు మళ్ళీ తిరిగి (కాంగ్రెస్లోకి) వస్తావు” అని అన్నాడు…
అది అసందర్భం… పైగా అక్కడ అప్రస్తుతం… అపరిణత ధోరణి… (నేపథ్యం… రవ్నీత్ సింగ్ బిట్టూ గతంలో కాంగ్రెస్లో ఉండేవాడు, 2024 ఎన్నికలకు ముందు ఆయన బిజెపిలో చేరాడు… అందుకే రాహుల్ ఆయనను ‘ద్రోహి’ అని సంబోధించాడు… అదెలా బూమరాంగ్ అయ్యిందంటే..?
రాహుల్ గాంధీ ఇచ్చిన షేక్ హ్యాండ్ను బిట్టూ తిరస్కరించాడు, చాలా తీవ్రంగా స్పందించాడు… రాహుల్ గాంధీని ఉద్దేశించి బిట్టూ “దేశ్ కే దుష్మన్” (దేశ శత్రువు) అని అన్నడు అక్కడే… ఆ తర్వాత మీడియాలో మాట్లాడుతూ… “నేను మీతో షేక్ హ్యాండ్ ఇవ్వను… మీరు, మీ కుటుంబం సిక్కుల హంతకులు… 1984 అల్లర్ల సమయంలో సిక్కులపై జరిగిన దాడులకు మీరే బాధ్యులు…” అని మండిపడ్డాడు..
తన తాత, మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, కేవలం పార్టీ మారినంత మాత్రాన తనను ‘ద్రోహి’ అనడం సరికాదని చెప్పుకొచ్చాడు…
ఈ ఘటనపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది… ప్రధాని మోదీ రాజ్యసభలో మాట్లాడుతూ… ఒక సిక్కు ఎంపీని ద్రోహి అని పిలవడం సిక్కు సమాజం మొత్తాన్ని అవమానించడమే అని రాహుల్పై విమర్శలు గుప్పించాడు… బిజెపి రాహుల్ గాంధీకి సిక్కుల పట్ల ద్వేషం ఉందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టింది… అకారణ వ్యాఖ్యలు దేనికి..? అనుకోకుండా నెగెటివిటీని నెత్తికి రుద్దుకోవడం దేనికి..?
Share this Article