.
( రమణ కొంటికర్ల – 99126 99960 ) …… ఇండియా- న్యూజిలాండ్ ఫైనల్స్ మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సంలో ఒక విశేషం చోటుచేసుకుంది. సాధారణంగా ఈ విశేషాన్ని ఎవ్వరూ ఎక్కువగా గుర్తించి ఉండకపోవచ్చుగానీ… చాలామందికి పెద్దగా రిజిస్టర్ కూడా కాకపోవచ్చు. కానీ, ఒక స్థాయిలో ఇదో పెద్ద చర్చకే దారి తీసింది. ఏందంటారా.. ? ప్రెజెంటేషన్ సెర్మనీలో ఆటగాళ్ల కంటే ముందు.. అందరికంటే ముందు.. ఓ వ్యక్తి వచ్చి మెమెంటోను అందుకోవడమే ఈ చర్చకు కారణం.
ఎవరాయన..? ఏ మ్యాచ్ తర్వాతైనా ఆటగాళ్లకే ముందు బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. కానీ, ఈసారి అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో మాత్రం అందుకు భిన్నమైన సెర్మనీ కనిపించింది. అందరికంటే ముందు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వెళ్లి మెమెంటో అందుకోవడమే ఈ చర్చకు కారణం.
Ads
పుండుపై కారం చల్లినట్టు! అవునూ, ఈ సూక్తిని ఇక్కడెందుకు వాడినట్టంటే.. ఆండీ పైక్రాప్ట్ కే మొట్టమొదటి మెమెంటోను అందజేయడమే అందుకు కారణం. ఈ విన్నింగ్ సెర్మనీని ఒక విజయోత్సవంగానే కాకుండా… ఒక వివాదానికి ప్రతిస్పందనలా డిజైన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.
ముందుగా మరి ఆండీ పైక్రాప్ట్ నే స్టేజ్ పైకి ఎందుకు పిలిచినట్టు..? ఆటగాళ్లకు బదులు విక్టరీ సెర్మనీలో ముందుగా అధికారుల పేర్లను పిల్చారు. అందులో మొట్టమొదటి పేరే ఆండీ పైక్రాప్ట్. అలా వేదికపైకొచ్చిన ఆండీ పైక్రాప్ట్ కు మెమెంటో ఇచ్చి సత్కరించారు.
ఆసియా కప్ వివాదమే ఇందుకు కారణమా..? ఆండీ పైక్రాప్ట్ నే మొట్టమొదట స్టేజ్ పైకి పిలిచి మెమెంటోతో సత్కరించడానికి గల కారణమేంటన్నది డీకోడ్ చేయడంతో ఆసియా కప్ వివాదం మళ్లీ ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ఆ సంఘటన వెనుక మనందరికీ తెలిసిన ఓ కథ ఉంది.
2025 ఆసియా కప్ లో భారత్ – పాక్ మధ్య మ్యాచ్ తర్వాత జరిగిన ఓ చిన్న ఘటన ఆ తర్వాత పెద్ద వివాదంగా మారింది. మ్యాచ్ ముగిసిననంతరం సాధారణంగా ఎవ్వరోడినా, గెల్చినా ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు చేతులు కలపడం క్రీడాస్ఫూర్తి. కానీ, నాటి ఆసియా కప్ లో పాక్ తో జరిగిన మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు చేతులు కలపలేదు. ఆ ఘటనపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది.
ఆ మ్యాచులో రిఫరీగా ఉన్న ఆండీ పైక్రాఫ్టా నిబంధనలను, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని పాక్ బోర్డ్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఆ దేశంలో కూడా పలురకాలు చర్చలకు దారితీసింది. పాక్ క్రికెట్ బోర్డ్ క్రీడాస్ఫూర్తి లోపించిందంటూ ఆ తర్వాత మ్యాచును బహిష్కరించబోతున్నట్టుగా కూడా ప్రకటించింది. అంతేకాకుండా, అప్పుడు కూడా మ్యాచ్ రిఫరీగా ఉన్న ఆండీ పైక్రాప్ట్ ను తొలగించాలనే డిమాండ్ బలంగా తెరపైకి తెచ్చింది.
కానీ, ఆ పాక్ బోర్డ్ డిమాండ్ ను ఐసీసీ అధికారగణం పట్టించుకోలేదు. పైక్రాప్ట్ యథావిధిగా తన బాధ్యతల్లోనే కొనసాగారు. ప్రస్తుతం కొనసాగుతున్న జియోపొలిటికల్ సినారియోలో ఆండీ వ్యవహరించిన తీరే సరైందని ఐసీసీ నమ్మింది.
నాటి వివాదానికి నేడు కౌంటర్! 2026 టీ 20 వరల్డ్ కప్ లో భారత్ గెలిచాక జరిగిన విజయోత్సవ వేడుకల్లో నాటి వివాదానికి ఓ కౌంటర్ గా ఓ నిశ్శబ్ద సందేశాన్ని పంపించారనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అందులో భాగంగానే, టీ 20 వరల్డ్ కప్ ఫైనల్స్ బహుమతి ప్రదానోత్సవంలో మొట్టమొదట అందరికంటే ముందు మ్యాచ్ రిఫరీగా ఉన్న ఆండీ పైక్రాప్ట్ ను వేదికపైకి పిల్చారంటున్నారు. ఈ ఎత్తుగడతో పాక్ బోర్డుకు పుండుమీద కారం చల్లిన విధంగా మరింత మంట పుట్టించారనే భావన వ్యక్తమవుతోంది.
వార్తల్లోకెక్కిన రిఫరీ! క్రికెట్ లో ఆటగాళ్లు తప్ప మిగిలినవాళ్లు వార్తల్లోకెక్కడం అరుదు. అందునా రిఫరీలైతే ఎక్కడా కనిపించరు, వినిపించరు. కానీ, ఆసియా కప్ ఘటన అనంతరం ఆండీ పైక్రాఫ్ట్ పేరు మాత్రం పెద్దఎత్తున ప్రచారంలోకొచ్చింది.
అసలెవరు ఈ ఆండీ పైక్రాఫ్ట్..? మాజీ జింబాబ్వే ఆటగాడు. డొమెస్టిక్ క్రికెట్ లో మంచి రికార్డ్స్ ఉన్నవాడు. 3 టెస్టులు, 20 వన్డేలు ఆడాడు. జింబాబ్వేకు కోచ్ గా, ఆ తర్వాత సెలెక్టర్ గా పనిచేశాడు. ప్రస్తుతం ఐసీసీ మ్యాచ్ రిఫరీగా పనిచేస్తున్నాడు. మన జవగల్ శ్రీనాథ్ కూడా మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ తో ఈ పొట్టి ప్రపంచకప్ 2026 సీరీస్ లో పనిచేశారు.
ఓవైపు, స్టేడియమంతా సంబరాలతో మార్మోగుతుండగా… మరోవైపు, భారత్ ట్రోఫీ ముద్దాడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో… వేడుకలో మొట్టమొదట వేదికపై గుర్తింపు పొందిన వ్యక్తిగా ఆండీ పైక్రాఫ్ట్ ఫోకస్ అయ్యారు. ఆ తర్వాత ఆయన్నే మొట్టమొదట ఎందుకు పిల్చారన్న అన్వేషణతో.. నాటి ఆసియా కప్ వివాదంలో ఆయన వైఖరి ప్రస్తావనకొచ్చింది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా ఆండీ పైక్రాఫ్ట్ పేరును మొదటగా పిలిచి.. 2026 టీ 20 కప్ విజయోత్సవ సభకు మరో ఆసక్తికరమైన కథను జోడించారనే చర్చ జరుగుతోంది.
అందుకే అని ఉంటారు… ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయోనని రష్యా విప్లవ నేత లెనిన్!
Share this Article