.
Subramanyam Dogiparthi…. కుక్కపిల్లా సబ్బు బిళ్ళా అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ . స్పందించే మనసు , వ్రాసే దమ్ము ఉండాలి … కవితకు , రచనకు , సినిమాకు ఏదయినా వస్తువే … అలాగే బాలచందర్ , విశ్వనాధులకు తమ సినిమాలకు పెద్ద పెద్ద బంగళాలు , కార్లు , అతిలోకసుందరిలు ఉండక్కరలేదు .
పది ఇళ్ళల్లో పాచి పని చేసుకునే చెవిటి మాలోకం అయిన కోకిలమ్మ , రిక్షా తొక్కుకుంటూ వాల్ పోస్టర్లు అంటించే సీతాలు , కొండయ్యలు కూడా సినిమా వస్తువులే . జనవరి ఒకటో తేదీ 1983 లో విడుదలయిన ఈ కోకిలమ్మ సినిమా అలాంటిదే . కోకిలమ్మ సినిమా . సరిత సినిమా . ఆమే షీరో ఈ సినిమాలో .
Ads
సుందర నగరం విశాఖపట్టణం మర్రిపాలెంలో పది ఇళ్ళల్లో అన్ని పనులూ చేసిపెడుతూ అందరి చేత తిట్లు తింటూ అందరికీ తల్లో నాలికయి చాకిరి చేస్తూ బతుకుని సాగిస్తూ ఉంటుంది కోకిలమ్మ . అక్కడే శంకరాభరణం శంకరశాస్త్రి అంతటి వాడిని కావాలని పగటి కలలు కంటూ ఉంటాడు నిరుద్యోగి రాజా . పొట్ట పోసుకోవటానికి మొబైల్ లాండ్రీ నడుపుతుంటాడు . ఒకే గూటి పక్షుల్లాగా ఇద్దరు కలుస్తారు , ఒకరంటే ఒకరు ఇష్టపడతారు .
అతని లోని సంగీత కళను ప్రోత్సహించి ఉధ్ధరించాలని నడుం బిగించి, అక్కడే ఉండే రేడియో అన్నయ్య దగ్గరకు చేరుస్తుంది . చక్కటి విద్వాంసుడు అవుతాడు . ఆ ఊళ్ళోనే ఉండే ఓ ధనికురాలు స్వప్న రాజా మీద మోజు పడుతుంది . పెళ్ళి చేసుకోవటానికి సిధ్ధపడతారు .
ఇదంతా గమనించిన కోకిలమ్మ గుండె పగిలి రాజా జీవితం నుండి తప్పుకుంటుంది . మళ్ళా తన పాత బతుక్కి వెళ్ళాలని అనుకుంటుంది . కానీ అప్పటికే కాలాతీతం అవుతుంది . ఒక చేయి లేని తల్లి తారసపడుతుంది . ఆ తల్లి , ఆ తల్లి చంకలో పిల్లకు చేదోడు అయి అంతులేని కధ సినిమా వాల్ పోస్టర్ని అంటించడంతో సినిమా ముగుస్తుంది .
ఈ వాల్ పోస్టర్ విషయంలో కూడా బాలచందర్ని అభినందించాలి . కోకిలమ్మది అంతులేని కధ అని ప్రేక్షకులకు చెపుతాడు దర్శకుడు . నిజమే . కొన్ని జీవితాలు అలాగే వ్రాసి పెట్టబడి ఉంటాయి . జీవితమంతా అందరికీ సాయపడటం , వారందరి చేతుల్లో మోసగించబడటం . దేవుడు వాళ్ళ నుదుటిన అదే వ్రాస్తాడు . వాళ్ళు అందుకే పుడతారు .
ఇలాంటి సాదాసీదా కధను , దానికి తగ్గట్లు స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు బాలచందర్ . ఆయన సినిమాల్లో నటీనటుల ఓవర్ క్రౌడింగ్ ఉండదు . రెండో మూడో ప్రధాన పాత్రలు , మరో మూడో నాలుగో సపోర్టింగ్ పాత్రలు ఉంటాయి . వాటిని ధరించేందుకు సూటయ్యే నటీనటులనే ఎంపిక చేసుకుంటారు . కోకిలమ్మగా సరిత తినేసింది . చెవిటి మాలోకంగా , గుండె పగిలిన స్త్రీగా , తన మానాభిమానాలను తాకట్టు పెట్టని ధృఢ మనస్తత్వం కల మహిళగా బాగా నటించింది .
ఆమె నటనకు నంది ప్రత్యేక జ్యూరీ అవార్డుని కూడా గెలుచుకుంది. రాజాగా రాజీవ్ అనే తమిళ నటుడు . తెలుగులో ఇదే మొదటి సినిమా అతనికి . ఇతర ప్రధాన పాత్రల్లో స్వప్న , మా గుంటూరు జీవా , రేడియో అన్నయ్య , తదితరులు నటించారు .
యం యస్ విశ్వనాధన్ సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఎవ్వరో పాడారు భూపాలరాగం సుప్రభాతమై కనుగొంటిని ఆ దేవుని పాట సినిమాకు ఐకానిక్ సాంగ్ అని చెప్పవచ్చేమో ! పల్లవించవా నా గొంతులో పల్లవి కావా , కొమ్మ మీద కోకిలమ్మ కుహూ , నీలో వలపుల సుగంధం నాలో చిలికెను మకరందం , మధురం మధురం నాదం పాటలు చాలా బాగుంటాయి . ఆత్రేయ గారు కనిపిస్తారు పాటల్లో . పోనీ పోతే పోనీ మనసు మారిపోనీ పాట బాగుంటుంది .
గణేష్ పాత్రో డైలాగులు చాలా పదునుగా ఉంటాయి . పాట వినిపించలేదు కనిపించింది అంటుంది చెవిటి కోకిలమ్మ . ఇలాంటి మనసుకు హత్తుకుపోయే డైలాగులు సినిమా అంతా ఉంటాయి . బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారుచేసుకున్నారు బాలచందర్ . మెప్పుగా బెస్ట్ స్క్రీన్ ప్లే నంది అవార్డు కూడా వచ్చింది ఆయనకు .
లక్ష్మీ జ్యోతి ఫిలింస్ బేనరుపై ఆర్ యస్ రాజు ఈ సినిమాను నిర్మించారు . చిన్న బడ్జెటుతో విశాఖ అందాలను ఉపయోగించుకుంటూ తీయబడిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది . ముఖ్యంగా సరితకు మంచి పేరు వచ్చింది . ఆమెకు విశాఖ కలిసొచ్చింది . కమర్షియల్ గా కూడా సక్సస్ అయింది . సినిమా యూట్యూబులో ఉంది . క్లాసికల్ , ఆర్ట్ ఫిలింసుని ఇష్టపడే సినిమా ప్రియులకు బాగా నచ్చుతుంది . It’s an off-beat , classical , watchable movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article