.
ఇది రాజకీయం కాదు… పొలిటికల్ సవాళ్లు, ప్రతిసవాళ్లు, నిందారోపణలు కావు… తెలంగాణ సర్వతోముఖాభివద్ధి దిశలో ఓ ప్రణాళిక…! ఓ సంకల్పం…! దీన్ని పొలిటికల్ కోణంలో కాదు, చూడాల్సింది తెలంగాణ సమాజం కోణంలో…!!
రేవంత్ రెడ్డి పదే పదే ఓ మాట చెబుతున్నాడు… పదేళ్లు సమయమివ్వండి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వన్ ట్రిలియన్ స్థాయికి తీసుకుపోతానని… అసలు ఎక్కడా అప్పు పుట్టడం లేని ప్రస్తుత ఆర్థిక దురవస్థ నుంచి ఏకంగా పదేళ్లలో వన్ ట్రిలియన్ ఆర్థిక సత్తాను టార్గెట్ చేసుకోవడం అంటే ఓ బృహత్తర లక్ష్యం అది… స్థూలంగా చూస్తే ఇది అయ్యేపనేనా అనిపిస్తుంది…
Ads
అవును, సంకల్పానికి దరిద్రం ఎందుకుండాలి..? అడుగులు వేయడానికి ఎదురుగా ఓ టార్గెట్ ఉండాలి, అదీ భారీగానే ఉండాలి… హైదరాబాద్ అభివృద్ధిని నిజంగానే దేశంలోని మరో నగరంతో ఎందుకు పోల్చుకోవాలి, టార్గెట్ పెట్టుకోవాలంటే న్యూయార్క్, టోక్కోలతో పెట్టుకోవాలి… గుడ్, అభినందనలు… కానీ అదెలా సాధ్యం..?
అంతర్గత రాజకీయాలు… విమర్శ తప్ప మరొకటి తెలియని ప్రతిపక్షం… ప్రపంచమంతా ఓరకమైన ఆర్థిక నిస్తేజం… అవును, నిజమే… కానీ లక్ష్యం భారీగా పెట్టుకుని, అడుగులు వేస్తేనే కదా మార్గం మీద స్పష్టత…! ఇప్పుడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సైజు కేవలం 200 బిలియన్ డాలర్లు… మహారాష్ట్ర 500 బిలియన్ డాలర్లు…
సో, సాధారణ అభివృద్ధి రేటుతో వెళ్తే రేవంత్ రెడ్డి సంకల్పించిన వన్ ట్రిలియన్ రేంజ్ చేరుకోవడానికి కనీసం పదిహేనేళ్లు పడుతుంది… దీన్ని పకడ్బందీగా, ప్రణాళికబద్దంగా కాస్త ముందుకు తీసుకురావాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది…
దీనికి నాలుగు పాయింట్ల ప్రణాళిక ఒకటి రచిస్తున్నారు… పరిశ్రమల వృద్ధికి జోనింగ్ విధానం, నైపుణ్యాభివృద్ధి, తక్కువ జనాభా వృద్ధిరేటు, కార్యకలాపాల్లో మహిళా భాగస్వామ్యం… ఇంట్రస్టింగు…
సరైన ప్రణాళిక రచనకు సరైన టీమ్ అవసరం… శుక్రవారం, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు ఆధ్వర్యంలో “విజన్ 2035” సమావేశం జరిగింది… ఈ సమావేశం ఎజెండా ఏమిటంటే..? 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ.., 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంపై కార్యాచరణ ఎలా..?
భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ రంగరాజన్ ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య చేశారు… — “2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారే అత్యధిక అవకాశాలున్న నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి…” అనే ఆయన అభిప్రాయాన్ని ప్రభుత్వం ఓ స్పూర్తి మంత్రంగా తీసుకుంది…
స్థూల ఉత్పత్తిని (జీఎస్డీపీ) స్థూలంగా రాష్ట్రం యూనిట్గా గాకుండా నగరాలవారీగా లెక్కించడం బెటరనే ఓ అభిప్రాయం వినిపిస్తోంది… అలాగే జోన్ విధానం ప్రకారం, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల సర్వీస్ రంగం, ORR, రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్య ప్రాంతాల్లో తయారీ రంగం (మ్యానుఫ్యాక్చరింగ్) అభివృద్ధి చేయాలనేది ప్రస్తుత ప్రణాళికలో ప్రధానమైన పాయింట్…
ఏ రాష్ట్రానికైనా ఎక్కువ ఉద్యోగాలు, స్థిరమైన అభివృద్ధిని అందించేది తయారీ రంగమే అనేది రాష్ట్ర ప్రభుత్వ భావన… తక్కువ జనాభా వృద్ధిరేటు కూడా రాష్ట్రానికి అనుకూలం… ప్రస్తుతం సుమారు 3.8 కోట్ల జనాభా ఉండగా ఇది 4.2 కోట్ల వద్దే స్థిరపడే అవకాశం ఉంది…
అదే విధంగా, మహిళలు, యువత భాగస్వామ్యం కూడా చాలా కీలకం… దేశవ్యాప్తంగా ఎక్కువ మంది మహిళలు కార్మిక శక్తిలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి… వారికి గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల యాజమాన్యం ఇవ్వడం ద్వారా ఆర్థిక కార్యకలాపాల్లో వారి పాత్రను పెంచనున్నారు…
ఐతే ఇదంత సులభసాధ్యమేమీ కాదు… ప్రస్తుతం రాష్ట్రం మీద ఉన్న అప్పుల భారం, జీతభత్యాలు, పెన్షన్లు, వడ్డీల చెల్లింపులు… కొత్త అప్పులు పుట్టడం లేదు… సో, ఇవన్నీ రాత్రికిరాత్రి పరిష్కరించబడే సమస్యలు కావు… కానీ ఆలోచనలు, అడుగుల్లో ఎప్పుడూ ఈ అంశాలు కూడా పరిగణనలోకి రావల్సిన అవసరం ఉంది… సంకల్పం మంచిదే… సకారాత్మక ఆచరణ, అడుగులే వేచిచూడాలి…
Share this Article