.
అదేదో పాత తెలుగు సినిమాలో (ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్?) తన భర్త మల్లిఖార్జునరావు కాళ్లకు లక్ష పాదపూజల నోము చేస్తుంది శ్రీలక్ష్మి… కనిపిస్తే చాలు, పాదాలపై నీళ్లు పోసి, వీలైతే రెండు అగరొత్తులు కూడా వేళ్ల మధ్య పెట్టి వెలిగిస్తుంది… నిజానికి మనం చెప్పుకోబోయే కథకూ దీనికీ సంబంధం లేదు, కానీ ఈ వార్త చదువుతుంటే అదే ఎందుకో గుర్తొచ్చింది…
ఈ కథనం ఏమిటంటే..? సినిమా నటి ప్రణీత గుర్తుంది కదా… ఈమధ్య కనిపించడం లేదు తెరపై… కానీ సౌత్ సినిమాల్లో బాగానే నటించింది… అదేనండీ, అత్తారింటికి దారేది సినిమాలో ఉందిగా… దేవదేవం పాట… సినిమాల్ని వదిలేస్తే, కరోనా పీరియడ్లో ఆమె చేసిన సేవకు బహుళ ప్రశంసలు వచ్చాయి… తారలెవరూ ఇళ్లు దాటి బయటికి రాని ఆ దుర్దినాల్లో ఆమె అనేక మందికి రోజూ ఫుడ్ సప్లయ్ చేసింది ఉచితంగా…
Ads
తల్లిదండ్రులిద్దరూ వైద్యులు… ఎన్ని సినిమాలు చేసినా ఇక సెకండ్ హీరోయిన్ పాత్రలే తప్ప మంచి పాత్రలు రావడం లేదని 2021లో నితిన్ రాజు అనే వ్యాపారిని పెళ్లి చేసుకుంది, ఓ కూతురు కూడా… పెద్దగా తెర మీద కనిపించడం లేదు… కానీ సోషల్ మీడియాలో యాక్టివ్… తాజాగా తన భర్త పాదాలకు పూజ చేస్తూ ఫోటోలు పెట్టింది సోషల్ మీడియాలో భీమన అమావాస్య అని టైటిల్ పెట్టింది…
రకరకాల ప్రయోగాత్మక పద్ధతుల్లో… ప్రియులతో కలిసి మొగుళ్లను రఫరఫా పెళ్లాలే కడతేరుస్తున్న రోజులివి… అలాంటిది ఈ ప్రణీత తన భర్తకు పాదపూజ చేస్తున్న ఆ ఫోటోలు చూసిన భార్యాబాధితుల కళ్లు చెమర్చాయి… అసలు ఏమిటి ఈ భీమన అమావాస్య..?
ప్రణీత సినిమాల్లో ఎలా కనిపించినా సరే, రియాలిటీలో కొంచెం సంప్రదాయవాది… కొన్ని లిమిటేషన్లలోనే ఉంటుంది… బహుశా నిర్మాతలు ఆమెను పట్టించుకోకపోవడానికి అదే కారణం ఏమో, పాపం శమించుగాక… ఈ భీమన అమావాస్య- పాదపూజ ఫోటోలను ఆమె 2022 నుంచీ సోషల్ మీడియాలో ప్రతి ఏటా పోస్ట్ చేస్తుంది ఆమె…
ఇది వివాహితలు పెళ్లయిన 9 ఏళ్లపాటు చేస్తారట ఈ భీమన అమావాస్య పద్ధతిలో… ఆషాఢ అమావాస్య రోజున చేస్తారు… ఇది ప్రధానంగా కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది… భర్త ఆయుష్షు కోసం, క్షేమం కోసం… ఈ రఫరఫా రోజుల్లో భర్త ఆయుష్షు కోసం పూజలు విశేషమేగా మరి… పైగా ఓ సినిమా సెలబ్రిటీ..!! అందుకే ఆ ఫోటోలు వైరల్ ఇప్పుడు…

ఈ పూజ విధానం కూడా కాస్త డిఫరెంటు… శివపార్వతుల స్వరూపంగా భావించే రెండు మట్టి దీపాలను (దీపస్తంభాలు) సిద్ధం చేసి వెలిగిస్తారు… గోధుమ లేదా బియ్యం పిండితో ‘కడుబు’ అనబడే ముద్దలను తయారు చేస్తారు… వీటి లోపల నాణేలను (Coins) దాచి ఉంచుతారు…
తొమ్మిది ముడులు ఉన్న పవిత్రమైన దారాన్ని శివపార్వతులకు పూజించి, స్త్రీలు తమ చేతికి కట్టుకుంటారు… పూజ ముగిసిన తర్వాత, ఇంట్లోని సోదరులు లేదా చిన్న పిల్లలు ఆ కడుబు ముద్దలను తమ మోచేతులతో పగలగొడతారు… వివాహిత మహిళలు పూజ అనంతరం తమ భర్త పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకుంటారు…
Share this Article