Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!

May 31, 2025 by M S R

.

Shankar G ….. సినిమా హీరోగా స్థిరపడటానికి నటనే వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. సినిమా రంగంలో కొండంత నటన తెలిసినా అవగింజంత అదృష్టం ఉండాలంటారు కానీ కృష్ణ అనే నటుడుకి కొండంత అదృష్టమే అండగా ఉంది.

నటుడి రూపం, నవ్వు, అందం, నడక, హీరోయిజం ఏదైనా కావచ్చు చూసేవాళ్ళను సమ్మోహితులను చేయటానికి. ఆ నటుడిని చూడటం ఒక వ్యసనంగా మారుతుంది. ఆ వ్యసనం అతడు నటించిన సినిమా కథ బావుందా లేదా అన్నది అనవసరం…

Ads

అసలు సినిమాలో ఏముంది అన్నది కూడా తమకు అనవసరం తెరమీద తమ అభిమాన నటుడు ప్రత్యేక్ష్యమైతే చాలు అనుకుంటారు. ఆ మాయలో కూరుకుపోతారు.  ఆ ఫీటు సాధించిన మొట్టమొదటి స్టార్ కృష్ణ.

నట సూత్రాలతో పనిలేదు. తనకు ఏమొచ్చో అదే చేశాడు. ప్రేక్షకులు తమకు ఏం కావాలనుకున్నారో అదే తీసుకున్నారు. ఏ పాత్ర చేసినా అందులో కృష్ణ నే కనపడతాడు తప్ప పాత్ర కనపడదు. సినిమాల్లో తనో లోక రక్షకుడు, అందం అమాయకత్వం కలగలిసిన నటనతో తేనెమనసులు, కన్నె మనసులు, సాక్షి చిత్రాల్లో నటించినా అప్పటికే నటదిగ్గజలైన అప్పటి నటుల ముందు తేలిపోయడు.

కామెడీ పీస్ అనుకున్నారు. వెక్కిరించారు… అయితే అతని దశ దిశ మార్చి ఊహించని విధంగా తారపధంలోకి దూసుకెళ్లేలా అదృష్టం తలుపు తట్టింది. ఆ అదృష్టం పేరు గూఢచారి116… గూఢచారి 116 తో సరికొత్తగా అవిష్కృతమయ్యాడు. అమ్మాయిలను కవ్వించి వశపరచుకునే జాదూగా, విలన్ మూకను సాహసోపేతంగా తుదముట్టించే ధీరుడిగా కనపడ్డాడు ఈ సినిమాలో…

సరే అప్పటి సినిమా స్థితిగతుల గురించి కాస్త చెప్పుకుందాం…..
ఎన్టీఆర్, అక్కినేనిలు అగ్రశ్రేణి నటులుగా స్థిరపడ్డారు. ఒక విధంగా చెప్పాలి అంటే మకుటం లేని మహారాజులు. ఎన్టీఆర్ గురించి చెప్పాలి అంటే తనకు తాను ఇండస్ట్రీకి రాజులాంటివాణ్ని అని భావించుకునేవాడు. ఏ రకమైన పాత్ర పోషించటానికి వెనుకాడేవాడు కాదు.

పౌరాణిక, సాంఘిక, జానపదాల్లో తనదే హవా. ఇక అక్కినేని విషయానికి వస్తే బాగా లౌక్యుడు. తన పర్సనాలిటికి తగ్గ కథలు మాత్రమే ఎంచుకునేవాడు. మొదట్లో జానపద హీరోగా పేరు తెచ్చుకున్నా తనకు సూటయ్యే సాంఘిక చిత్రాల్లో ఇమిడిపోయారు.

అప్పటి పెద్ద బ్యానర్లు అని చెప్పుకొదగ్గ వాటిలో విజయా, వాహిని, భరణి, అంజలి, వినోద, ఏవియం, అన్నపూర్ణ, యన్ ఏ టి, జగపతి, పద్మశ్రీ, ఇవన్నీ కూడా ఎన్టీఆర్, ఏయన్నార్ లతో మాత్రమే చిత్రాలు నిర్మించేవారు. అగ్రనటులిద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ తోనే చిత్రాలు నిర్మించేవారు.

చిన్న నిర్మాతలు, కొత్త నిర్మాతలు అప్పటి కాస్త చిన్న హీరోలైన కాంతారావు, జగ్గయ్య, అమరనాధ్, హరినాధ్, రామకృష్ణ, రమణమూర్తిలతో చిత్రాలు నిర్మించేవారు. వీరు మంచి నటులయినా తక్కువ బడ్జెట్, అనుభవం లేని నిర్మాత, దర్శకుల వల్ల వీరి సినిమాలు పెద్దగా అడేవికావు. పాటలు బాగున్నా కూడా కలెక్షన్లు ఎన్టీఆర్, ఎయెన్నార్ చిత్రాల్లాగా కలెక్షన్లు, లాంగ్ రన్ ఉండేవి కావు.

జానపద మాయాజాలం…..
కానీ వీరిలో కాంతారావుకి మినహాయింపు ఉండేది. ఆదే మాస్ మంత్రం. ఆబాల గోపాలాన్ని అలరించగల జానపద చిత్రాలు కాంతారావుతోనే నిర్మించేవారు. అప్పట్లో మాస్ చిత్రాలంటే జానపదాలే. ఏడుపుగొట్టు కుటుంబ చిత్రాలను ఇష్టపడని కింది తరగతివారు, పిల్లలు ఈ చిత్రాలను అమితంగా ఇష్టపడేవారు.

ఎన్టీఆర్, ఏయన్నార్ లను స్టార్ లను చేసింది ఈ జానపద చిత్రాలే. కీలుగుర్రం, బాలరాజు, మాయలోకం, ముగ్గురు మరాటీలు లతో విశేషంగా ఆదరణ పొందితే, షావుకారు పెద్దగా ఆడకపోవటంతో ఒక దశలో ఎన్టీఆర్ సినీరంగాన్ని వదిలి వెనక్కి వెళ్ళిపోదామనుకున్నాడు.

విజయా వారు ఎన్టీఆర్ తో చేసిన పాతాళభైరవితో స్టార్‌డం ఎత్తుకుంది. ఎన్టీఆర్ లాంటివాడు కూడా పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు చిత్రాలు సొంతంగా నిర్మించి నష్టపోయాక జయసింహా లాంటి జానపద చిత్రాన్ని నిర్మించి అది భారీ విజయం సాధించటంతో సొంత సంస్థను నిలబెట్టుకున్నాడు.

ఒకే స్టూడియోలో రకరకాల సెట్టింగులతో అతి తక్కువ బడ్జెట్ లో చిత్ర నిర్మాణం పూర్తి చేసేవారు. పెద్ద హీరోలతో చేయలేని చిన్న నిర్మాతలంతా కాంతారావుతో చిత్రాలు నిర్మించేవారు. అలాంటివారిలో ముఖ్యులు దర్శక నిర్మాత విఠలాచార్య. ఈయన నిర్మించిన సాంఘిక చిత్రాలేవీ హిట్టు కాలేదు.

ఎక్కువగా ఎన్టీఆర్, కాంతారావులతోనే జానపద చిత్రాలు నిర్మించారు. తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో పూర్తి చేసి రిలీజ్ చేసేవాడు. మాయలు మంత్రాలు డిషుం డిషుం చిత్రాలు పిల్లలను, కింది తరగతుల వారిని విపరీతంగా ఆకట్టుకునేవి. అంతేకాదు, ఇతర రాష్ట్రాల్లో డబ్ చేస్తే అక్కడ మంచి కలెక్షన్లు వచ్చేవి.

అయితే ఏడుపుగొట్టు సాంఘిక చిత్రాలు ఆడినట్టుగా ఇవి ఎక్కువ రోజులు ఆడేవికావు. కారణం మహిళా ప్రేక్షకులు. వాళ్ళు ఇలాంటి చిత్రాలు కాక కుటుంబ కష్టాలు ఉన్న చిత్రాలను ఆదరించేవారు, మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు. అందుకే ఆడవాళ్లకు నచ్చితే వందరోజులు మగాళ్లకు నచ్చితే నాలుగు వారాలు అనేవాళ్ళు.

జానపదాలను దెబ్బకొట్టిన క్రైం చిత్రాలు….
ఆ మాస్ హిస్టీరియాని జానపదాల నుండి ఈ క్రైమ్ చిత్రాలు హైజాక్ చేశాయి. సరే మళ్ళీ కృష్ణ దగ్గరికి వద్దాం… గూఢచారి 116 తర్వాత జానపద, కుటుంబ కథా చిత్రాలు చేశాడు. సపోర్టింగ్ హీరో రోల్స్ వేశారు. అవేవి పెద్దగా పేరు తీసుకురాలేదు.

అంతేకాదు, తనకంటే అద్భుతంగా నటించగల హరినాధ్, రామకృష్ణ, చలం,శోభన్ బాబులు ఉన్నారు. కానీ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ అయిన అపాయంలో ఉపాయం, అసాధ్యుడు, అవేకళ్ళు, నేనంటే నేనే, నేనూ మనిషినే లాంటి చిత్రాలు హిట్ అయి లాభాలు గడించాయి. దాంతో వరసగా క్రైమ్ చిత్రాలు చేయటం ప్రారంభించాడు.

ఈ క్రైమ్ చిత్రాల్లో కథ కాకరకాయలాంటివేం ఉండవు. నటనతో అసలు పనిలేదు. అరగంట ఛేజింగులు, అరగంట ఫైట్స్, రెండోమూడో క్లబ్ డ్యాన్స్ లు, హీరోయిన్ తో రెండు సాంగ్స్, కమెడియన్ కు ఒక సాంగ్. ఒక రేపు సీన్ బస్… కథ రెడీ.

అప్పట్లో ప్యాకెట్ సైజ్ లో వచ్చే డిటెక్టివ్ కథలను వాడుకునేవాళ్ళు. హీరో చిన్నప్పుడు తన తల్లితండ్రులను చంపిన హంతకులు, లేదా బ్యాంకు దోపిడీ ముఠాలను, దేశద్రోహనికి పాల్పడే వారిని అంతం చేయటమే హీరో పని. ఈ సినిమాలు కూడా తక్కువ రోజుల్లో పూర్తి చేసి రిలీజ్ చేసేవాళ్ళు.

మాస్ జనాలతో ఓపెనింగ్ బాగుండేవి. లాంగ్ రన్ ఉండదు. రెండు మూడు వారాలకు మించి ఆడవు. అప్పట్లో ఎన్టీఆర్, అక్కినేని కుటుంబ కథాచిత్రాలు ప్లాఫ్ అయినా ఆరు, ఏడు వారాలు ఆడేవి. కృష్ణ నటించిన క్రైమ్ చిత్రాలకు గుర్తింపు రావటంతో శోభన్, రామకృష్ణ, హరినాధ్ లు ఇలాంటి చిత్రాలు చేశారు.

ఎస్వీ రంగారావు కూడా వరసపెట్టి క్రైం చిత్రాలు చేశాడు… మొనగాళ్లకు మొనగాడు హిట్ కావటంతో వరసగా జగత్ కిలాడీలు, జగత్ జెట్టీలు, కత్తుల రత్తయ్య లాంటి చిత్రాల్లో నటించాడు. ఒక టైంలో ఎన్టీఆర్ నేనే మొనగాణ్ణి చేస్తే, ఏయన్నార్ హాలివుడ్ హిట్ మూవీ పెరేడ్ ను జమిందార్ పేరుతో రీమేక్ వంటి క్రైమ్ జోనర్ లో చిత్రాలు చేశారు.

అయితే కృష్ణకు క్రైం చిత్రాల్లో వచ్చిన గుర్తింపు కుటుంబ కథాచిత్రాల్లో రాలేదు. ప్రేక్షకులు కూడా కృష్ణను చిత్రంలో పాత్రధారిగా కాకుండా కృష్ణలాగే చూడటం మొదలు పెట్టారు. కారణం కృష్ణ ఏ పాత్ర ధరించినా అందులో వారికి కృష్ణనే కనపడతాడు తప్ప పాత్ర కనపడదు.

అందుకే కృష్ణకు అభిమానులుండరు ఫాలోవర్స్ మాత్రమే ఉంటారు. వీరికి కృష్ణను తెరమీద చూడటం ఒక వ్యసనం. అందుకే ఏ సంవత్సరం కూడా డజనుకు తక్కువకాకుండా చిత్రాలు చేసేవాడు. చిన్న నిర్మాతలకు, కొత్త నిర్మాతలకు అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఎయెన్నార్ లు అందుబాటులో ఉండరు.

ట్రాలీ బాయ్ గా జీవితాన్ని ఆరంభించి కొంత డబ్బు సంపాదించాక ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ తన మొదటి చిత్రాన్ని ప్రారంభిద్దామని అక్కినేని దగ్గరికి వెళితే నువ్వు నాతో సినిమాలు తీసేంతా వాడివా అంటూ అవమానించి పంపాడు. కానీ రాఘవ తన మొదటి చిత్రాన్ని ఫల్గుణ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కృష్ణతో జగత్ కిలాడీలు చిత్రాన్ని నిర్మించి హిట్ కొట్టాడు.

వరుసగా శోభన్ తో జగత్ జంత్రిలు, జగత్ జెట్టీలు నిర్మించాడు. అహం, అధిపత్య ధోరణితో ఉన్న ఎన్టీఆర్, అక్కినేనిలతో పోటీ పడలేనని తెలుసుకున్న కృష్ణ వారికి సరిపడని జోనర్ ను ఎంచుకుని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. నలభై ఏళ్ళు దాటిన పెద్ద నటులిద్దరికీ ఛేజింగులు, ఫైట్లు చేత కాలేదు.

మ్యాన్లీగా చలాకిగా ఉన్న కృష్ణకు అది సాధ్యపడింది. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక కూటమి ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం సొంత చిత్ర నిర్మాణం చేపట్టాడు. మొదటగా అగ్ని పరీక్ష అనే సాంఘిక చిత్రాన్ని తీశాడు. ఇది ప్లాఫ్ అయ్యింది.

జేమ్స్ బాండ్ తరహా క్రైం చిత్రాలకు పోటీ ఎక్కువయ్యింది. హాలీవుడ్ చిత్రాలయినా మెక్కన్నాస్ గోల్డ్, ది గుడ్ ది బ్యాడ్ అండ్ ది అగ్లీ, ఫర్ ఏ ఫ్యూ డాలర్ మోర్ చిత్రాల స్ఫూర్తితో ఆరుద్ర కథనివ్వగా ఒక కౌబాయ్ చిత్రాన్ని ప్రారంభించారు కృష్ణ తన సోదరులతో కలిసి… దాని పేరు మోసగాళ్లకు మోసగాడు.

ఇది మొదటి కౌబాయ్ చిత్రం అంటారు కానీ దీనికంటే కౌబాయ్ పోకడలతో విజయలలిత నటించిన రౌడీరాణి వచ్చింది. ఇది తక్కువ బడ్జెట్ లో తీశారు. కృష్ణ మాత్రం రంగుల్లో భారీ బడ్జెట్ తో అధిక వ్యయ ప్రయాసలకోర్చి రాజస్థాన్ లో వందల గుర్రాలు, జూనియర్ ఆర్టిస్ట్ లను తరలించి భారీ ఎత్తున నిర్మించాడు.

తన ప్రయత్నం వృధా పోలేదు అఖండ విజయాన్ని సాధించటమే కాకుండా అనేక భాషల్లో అనువాదమయ్యింది. ఇక వరసబెట్టి అలాంటి సినిమాలే కొన్ని వచ్చాయి. మంచివాళ్లకు మంచివాడు, మొనగాడొస్తున్నాడు జాగ్రత్త, నిజం నిరూపిస్తా, మావూరి మొనగాళ్లు లాంటి చిత్రాలు వచ్చినా సో సో గా ఆడాయి.

కానీ ఈ చిత్రాలు క్రింది క్లాసుల వాళ్ళను, చిన్న పిల్లలను బాగా ఆకట్టుకునేవి. స్థిరమైన ఫ్యాన్ బ్యాంక్ ఏర్పడిపోయింది. తనను నమ్ముకుని చిత్రాలు నిర్మించే నిర్మాతలు ఏర్పడ్డారు. కానీ పెద్ద స్థాయి నటుల చిత్రాల స్థాయిలో పరిగణింపబడలేదు కారణం కృష్ణ తీసే చిత్రాలన్నీ కేవలం మూడువారాలు ఆడే బి గ్రేడ్ చిత్రాలుగా ప్రచారంలో ఉండేవి.

ఎందుకంటే… అక్కినేని, ఎన్టీఆర్ చిత్రాలు కథ, కథనం, పాత్రధారుల మధ్య నటన అత్యున్నత స్థాయిలో ఉండేవి. సావిత్రి, జమున, జగ్గయ్య, ఎస్వీఆర్, కాంతారావు లాంటి హేమహేమీల మధ్య పోటాపోటీ నటన ఉండేది. అందుకే మిడిల్ క్లాస్, హైక్లాస్ వారంతా ఆ చిత్రాలను ఇష్టపడేవారు.

పౌరాణిక, సాంఘిక చిత్రాలు కాబట్టి గ్రామీణ ప్రజలు, స్రీలు బాగా ఆదరించేవారు శతదినోత్సవాలు జరుపుకునేవి. కృష్ణ ఈ పెద్ద నటులతో పోటీ కష్టం అని భావించాడు. అందుకే కొత్త సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి, అధిక ఖర్చుతో మోసగాళ్లకు మోసగాడు నిర్మించాడు.

కొత్త నిర్మాతలు, చిన్న నిర్మాతలు కృష్ణ మీద అంత పెట్టుబడి పెట్టలేరు. అందుకే సొంత బ్యానర్ లో నిర్మించాడు. క్రమంగా ఇలాంటి చిత్రాలకు ఆదరణ తగ్గడంతో కుటుంబ కథాచిత్రాల వైపు మళ్ళాడు. అంతకుముందు నటుడు ప్రభాకర్ రెడ్డి కథ అందించిన పచ్చని కాపురం హిట్ అవటంతో మళ్ళీ ఒక కథ రాసుకుని కృష్ణతో షూటింగ్ అనుకున్నారు.

అయితే దీనికి బడ్జెట్ సమస్య వచ్చింది భారీ తారగణం, రంగుల్లో తీయాల్సి రావటంతో కృష్ణ ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. ఆ సినిమా పండంటి కాపురం. రంగారావు, జమున లాంటి వారి నటనతో పాటలు మంచి ఆదరణ పొందటంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీని తర్వాత వచ్చిన ఇల్లు ఇల్లాలు, అత్తలు కోడళ్ళు, నేరము శిక్ష లాంటి కుటుంబ గ్రామీణ చిత్రాలు హిట్ అయ్యాయి.

పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ గా పద్మాలయ…..
అంతకుముందు సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న కృష్ణ ఈసారి ఎన్టీఆర్ తో సొంత చిత్రాన్ని ప్రారంభించాడు. ఆ చిత్రం దేవుడు చేసిన మనుషులు. అత్యంత భారీ తారాగణంతో నిర్మించిన ఈ చిత్రం కూడా అఖండ విజయాన్ని సాధించి అనేక కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకుంది.

ఆ ఉత్సాహంతో అల్లూరి సీతారామరాజు తీస్తున్నట్టు ప్రకటించాడు. ఇక్కడే తనకు ఎన్టీఆర్ తో పేచీ వచ్చింది. అంతకు ముందు ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నిర్మించాలనుకున్నాడు కానీ చేయలేదు. కృష్ణ ఆ చిత్రం చేస్తాను అన్నపుడు చేయవద్దని వారించాడు. మీరు చేస్తే మేము చేయం అన్నాడు కృష్ణ. మీరు చేయవద్దు మేము చేయము అన్నాడు ఎన్టీఆర్.

ఠాట్, అదెలా కుదురుతుంది మేము చేస్తాము అని కృష్ణ తమ్ముడు హనుమంతరావు తెగేసి చెప్పేశాడు. ఈ హనుమంతరావు కృష్ణ కంటే డైనమిక్ అని చెబుతారు. ఆ విధంగా అక్కినేని తప్ప ఎవరూ ఎదిరించని ఎన్టీఆర్ ను కృష్ణ ధిక్కరించి సినీరంగంలోని అతిరథ మహారథులు అనతగ్గ వారందరిని చిత్రంలో నటింపచేశారు.

అగ్గిదొర పాత్రకు మొదట యస్వీఆర్ అనుకున్నా అయన ఆకస్మిక మరణంతో ఆ పాత్రకు బాలయ్యను తీసుకున్నారు. సినిమా స్కోప్ ఈస్ట్‌మన్ కలర్ లో చిత్రం తయారయ్యింది. మొదటి స్కోప్ చిత్రంగా ఈ చిత్రాన్ని పేర్కొన్నా అంతకుముందు బ్లాక్ అండ్ వైట్ లో వచ్చిన ఒక నారి వందతుపాకులు అనే చిత్రం కొంత భాగం సినిమా స్కోప్ లో తీశారు.

ఇక ఈ సినిమాతో అల్లూరి సీతారామరాజు కృష్ణగా ఆవిష్కృతమయ్యాడు. సినిమా కూడా అఖండ విజయం సాధించింది. బారెడు పొడుగున్న డైలాగులు కృష్ణ గొంతు బొంగురుపోయేలా చెప్పాడు. తన జీవితకాలంలో ఇదే అత్యుత్తమ నటనగా అభిమానులతో కీర్తించబడ్డాడు.

కృష్ణ ఎదురీత….
ఈ చిత్రం తర్వాత కృష్ణను వరస ప్లాఫులు పలకరించాయి. దేవదాసు తీయటం అతి పెద్ద తప్పిదంగా సినీ జనాలు భావిస్తారు. కారణం దేవదాసు పాత్రకు ఐకాన్ గా అక్కినేని గుర్తింపు పొందాడు. అలాంటి చిత్రాన్ని కృష్ణ అదే పేరుతో భారీ ఖర్చుతో మళ్ళీ నిర్మించాడు.

దానికితోడు అక్కినేని కూడా తన దేవదాసు చిత్రాన్ని కొత్తగా ప్రింట్లు వేయించి రిలీజ్ చేశాడు. అప్పటి ప్రేక్షకులు రెండు చిత్రాలు పోల్చి చూసుకుని కృష్ణ దేవదాసును దారుణంగా తిప్పి కొట్టారు. అయిన సరే కృష్ణ ధైర్యంగా నిలబడటానికి కారణం తనవారయిన నిర్మాతలు.., నటన, సినిమా ఎలా ఉన్నా కృష్ణను తెరమీద చూస్తే చాలనుకునే అభిమానులు ఉన్నారు.

నిర్మొహమాటంగా చెప్పాల్సి వస్తే కృష్ణ సినిమాలు చైనా ప్రాడక్ట్ లాంటివి. రాశి ఎక్కువ వాసి తక్కువ అన్నట్టుగా ఉండేది. కానీ శోభన్, హరినాధ్ లాంటివాళ్ళతో పోలిస్తే కృష్ణ ఇమేజ్ మంచి సేలబుల్ ప్రాడక్టే. నిర్మాణ ఖర్చు తక్కువే ప్రాఫిట్స్ తక్కువే, ఒక ప్లాఫ్ అయినా లాస్ రేషియో తక్కువే.

అదృష్టం బాగుంటే ప్రాఫిట్స్ రెండు మూడు రెట్లు కూడా రావచ్చు. అల్లూరి సీతారామరాజు తర్వాత వరస ప్లాఫులు వచ్చాయి అన్నది నిజం కాదు. అల్లూరి రేంజులో హిట్టు సినిమాలు లేకపోవచ్చు. చాలా సినిమాలకు పెట్టుబడి తిరిగి వచ్చాయి, కొన్ని సినిమాలకు తక్కువ స్థాయిలో అయినా ప్రాఫిట్స్ వచ్చాయి.

కొన్ని సినిమాల్లో పాసివ్ క్యారెక్టర్లు చేయటం వల్ల కృష్ణ ఫైట్స్ కోసం హీరోయిజం కోసం వచ్చే మాస్ జనాలకు అలాంటి సినిమాలు నచ్చలేదు. కానీ ఫ్యాన్ బ్యాంక్ చెక్కుచెదరలేదు అన్నదానికి నిదర్శనం సొంత బ్యానర్ పద్మాలయాలో వచ్చిన పాడిపంటలు ఘనవిజయం సాధించింది. ఇక అక్కడినుండి కుటుంబకథా చిత్రాలు, హిందీ చిత్రాల రీమేకులు చేశారు.

రూటు మార్చి మాస్ కు మరింత దగ్గరగా….
కృష్ణ హిందీ చిత్రాలు క్రైం, సెంటిమెంట్ కలగలిపి ఉంటాయి… అంటే ఒక విలన్ గ్యాంగ్ చిన్నప్పుడే హీరో తల్లి తండ్రులను చంపేస్తే, హీరోను ఎవరో పెంచితే, దొంగగానో, పోలీస్ ఆఫీసర్ గానో మారి విలన్ల అంతు చూడటం, తప్పి పోయిన అన్నదమ్ములు ఒక పాట ద్వారా కలుసుకోవటం ఇలా ఉంటాయి.

ఒక దశలో ఎన్టీఆర్ కు వరస ప్లాపులు వస్తే హిందీ సినిమా రీమేక్ లైన నిప్పులాంటి మనిషి, నేరం నాది కాదు ఆకలిది, అన్నదమ్ముల అనుబంధం, యుగంధర్ లాంటి చిత్రాలు చేసి హిట్టు కొట్టాడు. కృష్ణ కూడా అదే దోవలో వెళ్లాడని చెప్పవచ్చు. దొంగలకు దొంగ, భలే దొంగలు, దొంగలవేట, మనుషులు చేసిన దొంగలు, ఏజెంట్ గోపి, అన్నదమ్ముల సవాల్, రామ్ రాబర్ట్ రహీం, ముగ్గురూ ముగ్గురే ఇవన్నీ రీమేక్ చిత్రాలే. కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు సాధించాయి.

హీరో చుట్టూ తిరిగిన తెలుగు సినిమా….
77 ల దాకా ఇలాంటి సినిమాల హవా నడిచినా రాఘవేంద్రరావులాంటి ఎంట్రీతో తెలుగు సినిమా స్టాండర్డ్స్ తగ్గిపోయి, వింత పోకడలతో కథలు రావటం మొదలు పెట్టాయి. ఒక విధంగా చెప్పాలంటే జానపద సినిమా కథలను సాంఘిక చిత్రాలుగా మలుచుకున్నారు.

పేదవాళ్ళ కోసం పోరాడే హీరో, అపజయం ఎరుగని దీరోధాత్తుడిగా… ఒక విధంగా చెప్పాలంటే వన్ మ్యాన్ షో చిత్రాలుగా టర్న్ తీసుకున్నాయి. పరమ కిరాతంగా కనపడే విలన్లు చివరిలో హీరో చేతిలో జోకర్లుగా మారటం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు ప్రాధాన్యత తగ్గటం, పొగరుబోతు హీరోయిన్ హీరోతో ప్రేమలో పడటం, ఫ్లాష్ బ్యాక్ లోనో, మొదట్లోనో విలన్లు హీరో కుటుంబానికి చేసిన ద్రోహం తెలిసి హీరో భీషణ ప్రతిజ్ఞ చేసి, విలన్లను చావగొట్టి పోలీసుల ముందు నిజం చెప్పించి జైలుకు పంపటం. ఎన్టీఆర్ అడవిరాముడుతో మొదలై నాగార్జున శివ వచ్చేదాకా ఇలాంటి కథలే వచ్చాయి.

కృష్ణ మహర్థశ… పీక్స్….
ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వెళ్ళాక కృష్ణ నెం 1 మాస్ హీరో అనిపించుకున్నాడు. హీరో కృష్ణ నుండి సూపర్ స్టార్ కృష్ణగా మారాడు. ఆ టైంలో పద్మాలయ సంస్థకు మహర్ధశ నడిచిందని చెప్పవచ్చు. ఊరికి మొనగాడు, చుట్టాలున్నారు జాగ్రత్త, పాతాళభైరవి, దేవుడు చేసిన మనుషులు ఇవన్నీ హిందీలో రీమేక్ చేస్తే అన్నీ సూపర్ హిట్లయ్యాయి.

అన్నింటిలోనూ హీరో జితేంద్రయే. వీరిద్దరికీ ఒక సారూప్యం ఉంది. గూడచారి 116 ను హిందీలో ఫర్జ్ పేరుతో తీస్తే అక్కడా హిట్టయ్యింది. జితేంద్రకు అది మొదటి హిట్ మూవీ. హిట్ సినిమా ఫార్ములా ఏదీ అంటే పద్మాలయ వైపు వేలు చూపించేవారని చెప్పుకునేవారు.

ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందీ తెలుగు భాషల్లో 70 mm లో నిర్మించాడు, తనే దర్శత్వం వహించాడు. తెలుగులో తొలి 70 mm చిత్రం ఇదే. ఈ చిత్రకథ అంతకుముందు నలభై ఏళ్ల క్రితం ఎంజీఆర్ నటించిన నాడోడి మన్నన్ సినిమా… 70 శాతం దించేశారు.

అంతకుముందు 20 ఏళ్ల క్రితం ఇదే సినిమాను ఎన్టీఆర్ గండికోట రహస్యం పేరుతో నిర్మించగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ సింహాసనం కథ పెద్దగా జనాలకు ఎక్కలేదు, మంచి పాటలు, కృష్ణకున్న హవా, పద్మాలయ విజయపరంపరలో హిట్ చిత్రాల లిస్టులో చేరిపోయింది.

ఆ తర్వాత కృష్ణ దర్శకత్వం వహించిన కొడుకు దిద్దిన కాపురం తప్ప మిగతా చిత్రాలేవి తన దర్శకత్వంలో విజయవంతం కాలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలుగు వీరలేవరా కూడా డిజాస్టర్ గా మిగిలింది.

తగ్గుతూ వచ్చిన కృష్ణ ప్రభంజనం ……

చిరంజీవి రూపంలో కృష్ణకు సరికొత్త పోటీ ఎదురయ్యింది. ఖైదీ సినిమా సూపర్ హిట్ తో, కలెక్షన్ల మోతతో తనే కృష్ణకు ప్రధాన పోటీదారు అని చెప్పకనే చెప్పాడు. టెన్త్, ఇంటర్ చదివే కుర్రాళ్ళు కృష్ణ, చిరంజీవులను పోల్చి చూడటం మొదలు పెట్టారు. ఆ జనరేషన్ 90 శాతం చిరంజీవి ఫ్యాన్స్ గా మారిపోయారు.

80 ల నాటికి కృష్ణ, శోభన్, కృష్ణంరాజులకు నలభై ఐదేళ్లు దాటాయి. వయసులో ఉన్నప్పటి చురుకుదనం లేదు, క్రాపు చెదరకుండా, షర్ట్ నలగకుండా చేయి విదిలిస్తే పదడుగుల దూరం ఎగిరిపడే రౌడీలు.., డ్రిల్లు లాంటి డ్యాన్సులు, నవ్వు పుట్టించే రొటీన్ నటనను అభిమానులు ఆదరించినా.., కొత్తతరం ప్రేక్షకులు బ్రూస్ లీ, జాకీచాన్ సినిమాల్లో మెరుపువేగంతో చేసే ఫైట్స్ చూసి అలాంటి అనుకరణతో ఫైట్స్, మెరుపు వేగంతో చేసే డ్యాన్సులు చేసే చిరంజీవికి తమ ఓట్ వేశారు.

నెం1 స్థానాన్ని అందుకోవటానికి చిరంజీవి ఎక్కువ కష్టపడలేదు. ఎక్కువ రోజులు పట్టలేదు. ఎంతటి వీరాభిమానులయినా 40 ఏళ్ళు దాటిన తమ హీరోల హీరోయిజాన్ని, రొమాన్స్ ను పెద్దగా సినిమాలు చూడటానికి ఇష్టపడరు. అప్పుడు ఎన్టీఆర్, ఏయన్నారులకు నడిచింది కానీ అప్పుడు కృష్ణకైనా ఇప్పుడు చిరంజీవికైనా ఇదే పరిస్థితి.

కృష్ణను ఇప్పటికీ ఆరాధించేవారు ఉన్నారంటే వాళ్ళు అభిమానులు కారు ఫాలోయర్స్ మాత్రమే… అభిమానులు అభిమానాన్ని మార్చుకోవచ్చు కానీ ఫాలోయర్స్ జీవితాంతం వారిని అనుసరిస్తారు. ఇక కృష్ణ వితరణ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎవరికి ఎవరు కారణం లేకుండా సాయం చేయరు.

ఎంతోమంది నష్టపోయిన నిర్మాతలకు తను సాయం చేశారు అని చెబుతారు కానీ ఏ నిర్మాత కూడా కృష్ణ నాకు సాయం చేశాడు అని చెప్పగా వినలేదు. నిజానికి నిర్మాతలకు సాయం చేసేది డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే.

ఎందుకంటే చిత్ర నిర్మాణంలో వారు కాస్త పెట్టుబడి పెడతారు. సినిమాకు నష్టం వస్తే అదే నిర్మాతకు మరి కొంత పెట్టుబడి పెట్టి ఆ నిర్మాతను ఆదుకుంటారు. నిర్మాత రామానాయుడు ఇలాగే డిస్ట్రిబ్యూటర్ల సాయంతో ప్రేమ్ నగర్ తో హిట్టు కొట్టి ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు.

ముగింపు: ఇద్దరు నట దిగ్గజాల మధ్య తనకంటూ ఒక సినీ కోటరీనీ, నిర్మాణ సంస్థను నెలకొల్పి దానిద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించి నిజమైన సినిమా కార్మికుడిగా సినీ చరిత్రలో నిలిచిపోయారు.
(నేడు కృష్ణ జయంతి )…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…
  • డార్క్ వెబ్ అంటే… అది ఇల్లీగల్ కాదు, క్షుద్రమూ కాదు నానీ…
  • లోకేష్‌కు రాధాకృష్ణ సర్టిఫికెట్… తమరిక తప్పుకోవాలి బాబు గారూ…
  • అదెలా..? కేసీయార్‌కు నోటీసులిస్తే తెలంగాణకు ఇచ్చినట్టేమిటి..?!
  • ఫాఫం సాక్షి… నానాటికీ ప్రమాణాల ఖుర్బానీ… ఇదీ ఓ ఉదాహరణ…
  • హమ్మో… ఆ పాత నాగదుర్గ కాదు… ‘దారిపొంటచ్చి’ దడపుట్టించింది…
  • తేడా లేని పాటలు… నటిగా అదే జయప్రద… బాపు ఫెయిల్… దాసరి హిట్…
  • ఆ పదం వినగానే యూనిట్ మొత్తం కకావికలై పరుగులు తీసింది…
  • ఆయన ఆ జడ్జిని చూపిస్తే… ఈయన పోటీగా మరో జడ్జిని ప్రవేశపెట్టాడు…
  • మరో జలియన్‌ వాలాబాగ్… పాకిస్థాన్ ఆర్మీ ఘాతుకం… ఢాకా గుడి కథ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions