.
Subramanyam Dogiparthi ....
వంశీ మార్క్ సస్పెన్స్ , క్రైం , ఇన్వెస్టిగేటివ్ , కళాత్మక సెన్సేషనల్ మూవీ . సాధారణంగా సస్పెన్స్ , క్రైం థ్రిల్లర్స్ ముతగ్గా , జుగుప్సాకరంగా , భయానకంగా ఉంటాయి . కానీ ఈ వంశీ అన్వేషణ విపరీతమైన సస్పెన్సుని మెయింటైన్ చేస్తూ అత్యంత సున్నితంగా , కళాత్మకంగా , అందంగా తీసారు .
చిత్రరంగంలో ఓ సరికొత్త ట్రెండుని సెట్ చేసింది ఈ సినిమా . అయితే ఈ ట్రెండుని ఇదే స్థాయిలో లేదా ఇంతకు మించి ఎవరూ కొనసాగించలేదు . వంశీ కూడా మరో ప్రయత్నం చేయలేదు .
Ads
హిందీలో గుమ్నాం వంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ చాలానే ఉన్నాయి . మన తెలుగులో అవే కళ్ళు వంటివి చాలా కొద్ది సినిమాలే ఉన్నాయి . అదీ సితార వంటి సుతిమెత్తని సినిమా తీసిన వంశీ నుండి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రావటం గొప్ప విషయమే .
కధ , స్క్రీన్ ప్లే , డైలాగులు కూడా దర్శకుడు వంశీవే . ఈ సినిమా కొరకు ముగ్గురు నలుగురు రచయితలను కలిసారట . వంశీ ఆలోచన చుట్టూ ఎవరూ కధను నేయలేక పోయారట . యండమూరి నేసిన కధ కూడా వంశీకి నచ్చలేదు .
టైటిల్సులో యండమూరికి ధన్యవాదాలు చెప్పారు ప్రత్యేకంగా . చివరకు వంశీనే కధను నేసుకుని సినిమా తీయటానికి ఉపక్రమించారట .
సినిమా అంతా తిరుపతి వద్ద శేషాచలం కొండల్లో తలకోన అడవిలోని బాకరాపేట , నెరబైలు గ్రామాలలో షూటింగ్ చేసారు . కధకు కరెక్టుగా సెట్ అయ్యేది అడవే . ఈ సినిమా ఘన విజయానికి యం వి రఘు కెమేరాతనం అద్భుతంగా పనిచేసింది . వంశీ నటీనటుల ఎంపిక కూడా చాలా బాగుంటుంది . ఆయన నిలయ విద్వాంసులు చాలామంది ఉన్నారు .
కధకొస్తే ఓ అడవిలో ఓ ఫారెస్ట్ కాంట్రాక్టర్ కళా హృదయుడు . పక్షుల కిలకిలారావాల నుండే సంగీతంలో రాగాలు ఉద్భవించాయని నమ్మి వాటి మీద ఒక పరిశోధన గ్రంధాన్ని వ్రాయాలనేది ఆయన అభిలాష . అందు కోసం పట్నం నుంచి తన స్నేహితుడి కుమార్తెని పిలిపించుకుంటాడు . అప్పటికే ఆ గ్రామంలో పులి బారిన పడి జనం చనిపోతూ ఉంటారు . ఆ పులిని బంధించేందుకు ఫారెస్ట్ ఆఫీసర్ జేమ్స్ పాత్రధారి శరత్ బాబు ప్రయత్నిస్తూ ఉంటాడు .
ప్రభుత్వం ఓ పోలీసు ఆఫీసరుని పంపుతుంది . అతనే హీరో మురళి/కార్తీక్ . కధానాయిక భానుప్రియ సహాయంతో పులి పేరుతో జనాన్ని చంపుతున్న అసలు విలన్ రాళ్ళపల్లిని పట్టుకుంటారు . అయితే విలన్ ఊబిలో పడి చనిపోతూ ఆ హత్యలను ఎందుకు చేసాడో చెపుతాడు .
భానుప్రియకు ముందు మరో అమ్మాయి వస్తుంది అడవికి . ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపిన వారిని చంపుతూ ఉంటాడు . ఇదీ కధ టూకీగా .
సినిమా ప్రారంభం నుండే అందరి మీదా ప్రేక్షకులకు అనుమానం వచ్చేలా వారి ప్రవర్తనలు ఉంటాయి . ప్రేక్షకుడు రాళ్ళపల్లిని మినహాయించి అందరినీ అనుమానిస్తారు ప్రేక్షకులు . సస్పెన్స్ అంటే అదే కదా ! వంశీ బాగా నడిపించాడు ఆ సస్పెన్సుని .
అన్ని పాత్రలనూ బాగా మలిచాడు . కాంట్రాక్టరుగా సత్యనారాయణ , ఫారెస్ట్ ఆఫీసరుగా శరత్ బాబు , డ్రైవర్ కం ఆల్ ఇన్ వన్ గా రాళ్ళపల్లి , అతని భార్యగా లక్ష్మీచిత్ర , ప్రెసిడెంట్ పులి రాజుగా మల్లికార్జునరావు , అతని భార్యగా వయ్యాలను ఒలికిపోసే వై విజయ , కొడుగ్గా శుభలేఖ సుధాకర్ , బావమరిదిగా బాలాజి నటించారు .
ఈ సినిమా పేరు వినగానే మన కళ్ళ ముందు సాక్షాత్కరించేది భానుప్రియ , ఆమె కళ్ళు . సితార సినిమాతో అరంగేట్రం చేసిన ఆమెకు వెంటనే ఈ సెన్సేషనల్ మూవీ పడటం ఆమె అదృష్టం . వచ్చిన సదవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నది ఆమె . పట్నం అమ్మాయిగా , ధైర్యవంతురాలిగా , సంగీత ప్రియురాలిగా , చలాకీగా , చాలా బాగా నటించింది . హీరో మురళి . హుషారుగా నటించాడు .
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇళయరాజా సంగీతం , background score మరో ఎత్తు . సినిమా అంతా సరిగమలే . చిన్న చిన్న పదాలే . వాటిని వ్రాసిన వేటూరికి హేట్సాఫ్ . పాడిన జానకమ్మకు , బాలసుబ్రమణ్యంకు మరో హేట్సాఫ్ . ఇళయరాజా సంగీతమంటేనే భిన్నంగా , ప్రత్యేకంగా ఉంటుంది . ఈ సినిమాలో పాటల్లోని బిట్స్ , బీట్స్ పక్షుల కిలకిలారావాల్లాగే ఉంటాయి . ఇళయరాజాకే సాధ్యం ఏమో !
ముందుగా ఎవరికయినా గుర్తుకొచ్చేది కీరవాణి పాటే . ఎంత గొప్పగా వ్రాసారు వేటూరి !! మరో పాట ఏకాంత వేళ సందింట్లొ ఏకాంత సేవ . ఈ పాటలో భానుప్రియ నృత్యం , నటన , చిత్రీకరణ అద్భుతం . నృత్యాన్ని కంపోజ్ చేసిన రవిని మెచ్చుకోవలసిందే . మరో పాట ఎదలో లయ ఎదుటే లయ . ఇంకొకటి ఇలలో నడిచే ఈ అన్వేషణ . It’s all a musical and visual wonder .
మనందరికీ ornithology గురించి తెలుసు . కానీ పక్షుల కిలకిలారావాల నుండి రాగాలు ఉద్భవిస్తాయని , వాటినీ సంగీత శాస్త్ర పరంగా పరిశోధించవచ్చని తెలియదు . మరి ఆ కాన్సెప్టుని , లైనుని ఎక్కడ నుండి పట్టుకొచ్చాడో వంశీ !! Wonderful invention . Hats off to him .
ఈ సినిమాలో భానుప్రియతో పాటు మరో ముగ్గురిని అందంగా చూపుతాడు వంశీ . వై విజయ , రాళ్ళపల్లి భార్యగా నటించిన లక్ష్మీచిత్ర , సుమతిగా నటించిన ప్రముఖ డాన్సర్ పొన్ని . వంశీ మార్క్ హాస్యం పులి రాజు మల్లికార్జునరావు దగ్గర నుండి , కొంత సత్యనారాయణ నుండి రాబట్టుకున్నాడు .
1985 మేలో వచ్చిన ఈ సినిమా అంతా ప్రేక్షకులను సస్పెన్సుతో , అందమైన సీన్లతో కట్టిపడేస్తాడు వంశీ . 14 సెంటర్లలో వంద రోజులు అడింది . మా గుంటూరులో అప్పట్లో ఏకైక AC థియేటర్ నాజ్ అప్సరలో ఆడింది .
ఈ చక్కటి సినిమా యూట్యూబులో ఉంది . An unmissable movie . ఎన్ని సార్లయినా చూడ బుధ్ధేసే సినిమా .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article