.
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయాల్లో రుసరుసలు, వేడి పెరిగాయి… అది తెలంగాణకు నష్టం చేకూర్చే ప్రాజెక్టుగా తెలంగాణ సమాజం ఆందోళన వెలిబుచ్చుతుంటే… ఏపీకి కూడా ఆ ప్రాజెక్టు ఏమాత్రం మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి…
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి చూస్తున్నాం కదా… కేవలం కమీషన్ల కోసం కట్టే భారీ ప్రాజెక్టులు రాష్ట్రాలకు గుదిబండలు కావడం తప్ప ఖర్చుకు తగిన ప్రయోజనం సున్నా అనే ఓ అభిప్రాయం ఏపీలోనూ వ్యాపిస్తోంది…
Ads
ఈ నేపథ్యంలో ఒక ప్రకటన పూర్తి పాఠం ఇది… ఆలోచనాత్మకంగా ఉంది… దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పకపోవచ్చు, దాని లక్ష్యాలు వేరే కావచ్చుగాక… కానీ సమాజంలో ఓ ఆలోచన, ఓ మథనం మాత్రం అవసరమే…
గుంటూరు
19 – 06 – 2025
బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు గుదిబండ
– జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం – బనకచర్ల భారీ ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారుతుందని మరో కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపొందుతుందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ఈనెల 19వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో ప్రసంగిస్తూ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంచన వ్యయం 81 వేల 900 కోట్లు అని, భవిష్యత్తులో రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరిగినా గత అనుభవాల రీత్యా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు.
ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు కు 50 శాతం విదేశాల నుండి, 20 శాతం కేంద్ర ప్రభుత్వం నుండి, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం నుండి, మరో 20 శాతం కాంట్రాక్టర్ల నుండి పెట్టుబడులు సమకూర్చుకుంటామని రాష్ట్రప్రభుత్వం తెలిపిందన్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 48 వేల ఎకరాల భూ సేకరణ అవసరమని అందులో 16 వేల ఎకరాల అటవీ భూమిని సేకరించాలని, 38 కిలోమీటర్ల మేర టన్నల్స్ తవ్వాలని, 400 మెగావాట్ల విద్యుత్ అవసరమని, 417 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్స్ త్రవ్వాలని బొల్లాపల్లి , బనకచర్ల వద్ద రిజర్వాయర్లు నిర్మించాలని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న పోలవరం, వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా అన్నమయ్య, జరికోన, పించ, ఉత్తరాంధ్ర సుజనా స్రవంతి లాంటి ప్రాజెక్టులు గత 30 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయని వాటిని పూర్తి చేయకుండా మరో భారీ ప్రాజెక్టు 82 వేల కోట్లతో ప్రతిపాదించడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు.
కేవలం కమిషన్ల కోసం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి , వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్ లో బనకచర్ల ప్రాజెక్టును నిర్మించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపులు లేకుండా , సిడబ్ల్యుసి అనుమతులు లేకుండా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ అనుమతి లేకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా అక్రమంగా 90 టీఎంసీలతో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు 30 టిఎంసిలతో దిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాలను ఆపే విధంగా కృషి చేయాలన్నారు.
ఇట్లు
వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు
జనచైతన్య వేదిక
9949930670
Share this Article