.
[ దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]…. భార్యాభర్తల మధ్య ఇగోలు , కీచులాటలు , పొరపొచ్చాలు , ఆత్మాభిమానాలు , విడిపోవటాలు , సినిమా ఆఖర్లో కలవటాలు వంటి కధాంశాలతో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కలేదు . ఎక్కువ సినిమాలు సక్సెస్ అయ్యాయి . మన ప్రేక్షకులు , ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఎంత ఓపిగ్గా చూస్తారో !
మరో చిత్రం ఏమిటంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో భార్యే భర్త కాళ్ళ మీద పడుతుంది . రివర్స్ జరగదు . అయిననూ మహిళా ప్రేక్షకులు ఆదరించెదరు . మంచివాళ్ళు .
Ads
ఈ సినిమా ‘భార్యాభర్తల బంధం ‘ కధాంశం కూడా అదే . ఓ డబ్బున్న అమ్మాయి సాధారణ యువకుడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది . చినుకు చినుకు గాలి వాన అయినట్లు చిన్న చిన్న పట్టింపుల కారణంగా విడిపోతారు . ట్విస్ట్ ఏమిటంటే భార్య తండ్రి గారు కంపెనీలో వాటాలను ఇద్దరి పేరున వ్రాసి సంవత్సరానికి ఒకసారయినా ఒకరిని ఒకరు కలిసే విధంగా విల్లు వ్రాసి చనిపోతాడు .
భర్త గారు ఆ ఊళ్ళోనే ఉంటూ భార్యను విసిగిస్తూ ఉంటాడు . ఈ సినిమాలో మరో అసలు ట్విస్ట్ ఏమిటంటే భర్త గారు తన కూతురిని ప్రేమలోకి దింపి పెళ్ళి చేసుకునేలా చేయటానికి మేనల్లుడుని దింపటం . ఇది కొత్తగా ఉంటుందీ సినిమాలో . మేనమామ మేనల్లుడులుగా అక్కినేని , బాలకృష్ణల అల్లరి , హాస్యం , ప్రేమపాఠాలు , డ్యూయెట్లు , ప్రేక్షకులకు సరదాగా , హుషారుగా ఉంటాయి .
యన్టీఆర్ కుమారుడు నాగేశ్వరరావుతో నటించడం తెలుగు ప్రేక్షకులకు , ఇద్దరి అభిమానులకు భలేగా నచ్చేసింది . హెహేహే , అహహాహా అంటూ వాడబడే బాలకృష్ణ ఊతపదాలు నందమూరి అభిమానులకు బాగా నచ్చాయి . “వియత్నాం వీడు” సుందరం వ్రాసిన కధకు స్క్రీన్ ప్లే , దర్శకత్వం వహించిన నిర్మాత వి బి రాజేంద్రప్రసాద్ తన అపార సినీ అనుభవంతో సినిమాను బాగానే నడిపించారు .
అక్కినేని , బాలకృష్ణల నటన సరదాగా సాగితే జయసుధ నటన క్రమశిక్షణ కల ధనవంతురాలిగా , శృతి మించిన ఆత్మాభిమానం కల మహిళగా హుందాగా సాగుతుంది . జయసుధ అన్నగా కాసేపు జగ్గయ్య దేవదాసు లాంటి పాత్రలో కనిపిస్తాడు . జగపతి వారి ఒకనాటి ఆస్థాన నటుడు కదా ! 1985 లోనే తెలుగు సినిమాలలో ప్రవేశించిన రజని బాలకృష్ణ పక్కన గ్లామర్ స్పేసుని ఫిల్ చేసింది .
ఇతర ప్రధాన పాత్రల్లో గొల్లపూడి మారుతీరావు , రమాప్రభ , రాజేంద్రప్రసాద్ అన్నపూర్ణ , కాంతారావు , మాడా , ప్రభృతులు నటించారు . ఆత్రేయ గారు పాటల్ని మాటల్ని వ్రాసారు . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు బాగానే ఉంటాయి . చిత్రీకరణ అందంగా ఉంటుంది . కోకంతా తడిసింది బాలచంద్రా ,మనసు మనసు కలిసిన వేళే లగ్నం డ్యూయెట్లు బాగుంటాయి .
అక్కినేని , బాలకృష్ణల ఓలమ్మీ ఓలమ్మీ పాటలో ఇద్దరూ బాగా గోల చేస్తారు . నాతండ్రి రామయ్య రాజ్యాన్ని ఏలావయ్యా అంటూ సాగే పాట బాలకృష్ణ బస్సులో పాడతాడు . అదీ హషారుగానే సాగుతుంది . 1985 మార్చిలో వచ్చిన ఈ సినిమా చూడబులే . రొటీన్ కధే అయినా అక్కినేని , బాలకృష్ణల వలన డిఫరెంట్ అయింది . తరచూ టివిలో వస్తూ ఉంటుంది . యూట్యూబులో కూడా ఉంది . బాలకృష్ణ , అక్కినేని , జయసుధ అభిమానులు ట్రై చేయవచ్చు .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article