Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కలం మరణిస్తే వార్త కాదు… ఓ గోల్డ్ మెడల్ జర్నలిస్టు అనాథ మరణం…

September 19, 2024 by M S R

ఆమె యూనివర్సిటీ లో గోల్డ్ మెడల్ సాధించారు . ప్రభుత్వాలను శాసించే నంబర్ వన్ సంస్థలో జీవితాన్ని ప్రారంభించి .. దాదాపు నాలుగు దశాబ్దాలు అదే జీవితం .

ఆమెది ఒంటరి జీవితం . హైదరాబాద్ మహానగరంలో ఒంటరిగా గదిలో ప్రాణాలు విడిచింది . తలుపు బద్దలు కొట్టి చూస్తే తప్ప ఆమె మరణం బయటి వారికి తెలియలేదు . అనాథ శవానికి పోలీసులు , మున్సిపాలిటీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు .

….
ఈ వార్త టీవీ వారి దృష్టిలో పడితే పండగే … మానవత్వం మంటగలిసింది … ఎక్కడికి వెళుతున్నాం … మనుషులమేనా అంటూ వీలైతే సినిమా పాటలతో అద్భుతంగా మానవత్వాన్ని తట్టిలేపే విధంగా చక్కిని స్టోరీ ప్రసారం చేసేవారు . పత్రికల్లో ఐతే చేయి తిరిగిన సబ్ ఎడిటర్ చేతిలో పడితే కన్నీళ్లు పెట్టించే కవిత్వంతో వార్త వెలుగు చూసేది ..

Ads

మరణం నిజమే … కానీ టివిలో కానీ, మీడియాలో కానీ హృదయ విదారక కథనాలేమి రాలేదు .. ఎందుకంటే అలా మరణించింది ఓ మహిళా జర్నలిస్ట్ … ఎవరైనా ఇలా మరణిస్తే జర్నలిస్ట్ లు హృదయ విదారకంగా కథనం రాస్తారు కానీ జర్నలిస్ట్ మరణిస్తే అలా రాయరు. ఎందుకలా అంటే అదంతే …

….
జంధ్యాల భారతి పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో జర్నలిజంలో గోల్డ్ మెడల్ సాధించారు … ఈనాడులో జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించి తరువాత ఫ్రీ లాన్సర్ గా ఉన్నారు .. మిత్రుడు నామాల విశ్వేశ్వర్ రావు ఫోన్ చేసి జంధ్యాల భారతి సంస్మరణ సభ నిర్వహించాలి అని  ఉంది .. ఆమె ఇలాంటివి తనకు నచ్చవు వద్దు అని గతంలో చెప్పారు అని కొందరు అంటున్నారు .. మీ అభిప్రాయం ఏమిటీ అని అడిగారు ..

మీరు సంస్మరణ సభ నిర్వహించినా , నిర్వహించక పోయినా పోయిన వారికి తెలియదు .. మనం ఎలా బతుకుతున్నాం అని మనకు మనం చెప్పుకోవడానికి .. మన జీవితాన్ని మనం సమీక్షించుకోవడానికి సభ నిర్వహించాలి అనేది నా అభిప్రాయం అని చెప్పాను … ఆమె కోసం కాదు మన కోసం అవసరం అని చెప్పాను …

….
నిన్నటి రోజంతా ఈ విషయం మీదే చర్చ … ఆలోచన … ఆమెతో పెద్దగా పరిచయం లేదు .. ఆంధ్రభూమిలో ఉండగా చాలా సార్లు చూశాను .. ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ గా అన్ని పత్రికలకు రాసేవారు … ముందు ప్రభ, తరువాత కరోనాలో భూమిలో పారితోషికం ఇవ్వడం మానేశాక రాయడం మానేశారు ..

మిత్రుడు విశ్వేశ్వర రావు చెప్పిన వివరాల ప్రకారం ఆమె ఈనాడులోనే జర్నలిజం జీవితాన్ని ప్రారంభించారు .. ఎంవిఆర్ శాస్త్రి , కెయల్ రెడ్డి వంటి వారితో కలిసి ఈనాడులో పని చేశారు . అక్కడి ఉద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు … అక్కడ ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లు కొత్తేమి కాదు … ఐతే ఇద్దరిలో ఒకరు రాజీనామా చేయాలి, ఇది నిబంధన .. ఆమె రాజీనామా చేసింది .. కాపురం మూన్నాళ్ళ ముచ్చట కాదు, ఒక రోజు ముచ్చటగానే మిగిలి పోయింది … మళ్ళీ ఒంటరి జీవితమే … ప్రైవేటు ఉద్యోగం అంటేనే బతుకు భయం భయం, ఇక జర్నలిస్ట్ ఉద్యోగం అంటే మరింత భయం … ఆమె అలానే జీవితమంతా భయంతో కలిసి బతికింది, చనిపోయింది …

….
అందరి జీవితాలు ఇలానే ఉంటాయి అని కాదు… సినిమా రంగం , జర్నలిజం , రచయిత ఏ రంగం ఐనా కావచ్చు … ఎవరి బతుక్కు వారే కారణం … సమాజం , తోటి వారు , యూనియన్లు అని మాట్లాడితే పలాయన వాదమే అవుతుంది .. జర్నలిజం నుంచి సివిల్స్ కు ఎంపిక అయిన వారు ఉన్నారు … మందుకు బానిసలైన వారు ఉన్నారు …

ఆయేషా అని దక్కన్ క్రానికల్ లో క్రైం రిపోర్టర్ ఉండేవారు .. అమ్మాయి అయినా ఎప్పుడూ మార్చురీల చుట్టూ తిరిగేది … ఇప్పటిలా వాట్స్ ఆప్ జర్నలిజం కాదు కాబట్టి రోజూ మార్చురీకి వెళ్ళేది … ఐనా ఆఫీస్ లో వేధింపులు …ఉద్యోగం వదిలేసింది . కొంతకాలం తరువాత ఆమె ఏకంగా జిల్లా కలెక్టర్ అయ్యారు ..

చిన్న వయసు వారు కనిపిస్తే బోలెడు ప్రభుత్వ ఉద్యోగాలు , బ్యాంకు రైల్వే ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తుంటాయి వెళ్లొచ్చు కదా ? అనేవాడిని … అలా వెళ్లిన ఎంతో మందిని చూశా … శ్రీ శ్రీ , వేటూరి సుందర రామ మూర్తి వంటి గొప్ప వారు మొదట్లో జర్నలిస్టులే … ఇవి ఆ రోజులు కాదు ..
ఇతర రంగాల్లో రాణించిన వారిని చూశా, అనాధల్లా మరణించిన వారిని చూశా …

…
భూమిలో చిక్కడపల్లి చారీ అని ఒక పార్ట్ టైం విలేఖరి ఉండేవారు … ఓ రోజు ‘‘సార్ నేను ఎడిటర్ ఇంటికి వెళ్తా , ఎడిటర్ చెప్పిన పని చేస్తా, ఆఫీస్ కు వచ్చాక న్యూస్ ఎడిటర్ , బ్యూరో డెస్క్ సహా అందరి మీద అధికారం చెలాయిస్తా … నేను ఒక్కరికి తలవంచి, మీ అందరినీ భయపెడతా అని చెప్పుకుంటూ పోయాడు .. భ్రమల్లో బతుకుతున్నాడు పాపం అనిపించింది . అతని గురించి కొన్ని రోజుల తరువాత తెలిసింది .. చనిపోయాడు నాలుగు రోజులు మార్చురీలోనే శవం … ఎవరూ రాలేదు …

ఎన్టీఆర్ ను దించేసే సమయం … అప్పుడు సెల్ ఫోన్లు లేవు .. సచివాలయం ప్రెస్ రూమ్ లో ల్యాండ్ లైన్ … ఓ జర్నలిస్ట్ తన వంతు వచ్చే వరకు నిలబడి, మెల్లిగా ఫోన్ లో సచివాలయంలో బాబు ఛాంబర్ లో ఎంత మంది శాసన సభ్యులు చేరారో రామోజీ రావుకు చెబుతున్నాడు … ఆ సాయంత్రమే శిబిరం వైస్ రాయ్ కి మారింది ..

ప్రభుత్వాన్ని కూల్చడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న వారు కూడా అంత మెల్లిగా తన పని తాను చేసుకు పోతుంటే … మందు మత్తులో అమెరికా అధ్యక్షున్ని కూడా ప్రెస్ రూమ్ నుంచే మార్చేస్తున్నట్టు మాట్లాడే వారిని కూడా చూశా … ప్రపంచంలో ప్రతి పరిణామంపై సమీక్షించే మనం మన జీవితాన్ని కూడా సమీక్షించుకోవాలి లేదంటే ?

ఆరోగ్యం , మానవ సంబంధాలు , డబ్బు అన్నీ జీవితానికి ముఖ్యమే … బెంగళూరులో ఒక సీఏ ఆఫీస్ లో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారట … అంత్యక్రియలకు ఎవరూ రాలేదట … వాస్తవం ఇలానే ఉంటుంది … భ్రమలు వదిలి వాస్తవం లోకి రావాలి …

ఓ వీడియో వింటుంటే నూతన్ ప్రసాద్ గురించి యండమూరి వీరేంద్రనాథ్ ఓ మాట చెప్పారు … సినిమా షూటింగ్ ప్రమాదంలో నడుము వరకు చచ్చుపడడంతో నూతన్ ప్రసాద్ వీల్ చైర్ కే పరిమితం అయ్యారు .. జీవితంలో అనుకోకుండా వచ్చే ప్రమాదాలకు ముందే సిద్ధం అయి ఉంటే ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది అని చెప్పారట … ఏ ఉద్యోగంలో ఉన్న వచ్చే ప్రమాదాలను ముందే ఊహించుకుంటే జీవితం అగమ్య గోచరంగా ఉండదు … సీఎం తెలుసు, పీఎం తెలుసు అంటూ భ్రమల్లో బతికితే మాత్రం…??? – బుద్ధా మురళి, జర్నలిస్టు జ్ఞాపకాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions