.
కాలేశ్వరం ఎస్ఈ శ్రీధర్ అట… 150 నుంచి 200 కోట్ల అక్రమ సంపాదన… ఏసీబీ దాడులు, కేసు… కాలేశ్వరం ప్రాజెక్టుకు పనిచేసిన ఎవడిని తాకినా కోట్లు రాలుతున్నయ్… దాడులు, కేసులు, ఆస్తుల వెల్లడి, నాలుగు మీడియా వార్తలు, రెండు రోజులు హడావుడి… తరువాత..?
ఏమీ జరగదు… చూస్తూ ఉండండి… బయటికి వచ్చేస్తాడు, ఏమైనా జైళ్లలో మగ్గేది ఉందా ఇలాంటోళ్లు..? అలా వందల కోట్లు పట్టుబడిన ఎందరు అక్రమార్కులు, అవినీతిపరులు జైళ్లలో ఉన్నారో చెప్పండి… ఏమో, చెప్పలేం, సీఈ ప్రమోషన్ కూడా పొందుతాడేమో కొన్నాళ్లకు…
Ads
కేసు తేలేదాకా ఓ పోస్టింగూ ఉండొద్దు… ఐటీ శాఖతో సమన్వయం చేసుకోవాలి… శాఖాపరమైన విచారణ అనే దొంగదారిలో తప్పించడాలు ఉండొద్దు… పునర్నియామకాలూ ఉండొద్దు… ఫాస్ట్ ట్రాక్లో విచారణ తెమిలితే, అక్రమ సంపాదనే అని తేలితే ఆ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వం…… అని ఆశిస్తాం కదా, అవేమీ జరగవు…
మొన్నామధ్య రేవంత్ రెడ్డి ప్రొబేషన్ టైమ్లో కేంద్ర సర్వీసు అధికారులు కొందరు అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించాడు… అయ్యో, అయ్యో, కేంద్ర సర్వీసు అధికారుల మీద మరీ అలాంటి వ్యాఖ్యలా..,? కించపరుస్తాడా..? ఎంత దారుణం..? ఎంత న్యాయం అని నోళ్లుపారేసుకున్నారు చాలామంది ఎప్పటిలాగే…
ఒక ముఖ్యమంత్రిగా తన దగ్గరకు వచ్చిన కొన్ని ఉదాహరణలు విని చేసిన వ్యాఖ్యే… ఆమధ్య మనం పూజా ఖేద్కర్ కేసు చదివాం కదా… తప్పుడు సర్టిఫికెట్లతో ఏకంగా యూపీఎస్సీ ఎంపికల డొల్లతనాన్ని బయటపెడుతూ ఐఏఎస్ సర్వీసులో చేరింది… చేరీచేరగానే, ట్రైనీగా ఉండగానే దాష్టికం, పెత్తనం, అడ్డగోలు సదుపాయాల కోరికలు గట్రా మొదలు పెట్టేసింది…
ఆమె హంతకురాలు కాదు, ఇదేమీ మాదకద్రవ్యాల కేసూ కాదు అని సుప్రీమే బెయిల్ ఇచ్చేసింది… తాజా కేసు ఏమిటంటే..? ధీమన్ చక్మా… త్రిపురలో గ్రామీణ నేపథ్యం… అసలు ఈశాన్యం నుంచి కేంద్ర సర్వీసుల్లోకి రావడమే అరుదు… ఎవరైనా కేంద్ర సర్వీసులో చేరితే వాళ్లను హీరోలుగా చూస్తుంది వాళ్లు ఎదిగి వచ్చిన సమాజం… కానీ..?
2019లో… యూపీఎస్సీలో 722 ర్యాంకు వచ్చింది, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో చేరాడు… ఒడిశా కేడర్… అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్గా కొలువు చేస్తూ మళ్లీ యూపీఎస్సీ రాశాడు… 2021లో, ఈసారి 482 ర్యాంకు… ఈసారి ఐఏఎస్… ధర్మగడ్ సబ్ కలెక్టర్ పోస్టింగు.,. 10 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయి, కటకటాల్లోకి వెళ్లాడు…
నిజం… కేంద్ర సర్వీసులు అయితేనేం… సబ్ కలెక్టర్ స్థాయి నుంచే ‘బ్యాటింగ్’ స్టార్ట్ చేస్తున్నారు… రాజకీయాల్లో అక్రమాలు చేసేవాడికి కనీసం అయిదేళ్లకోసారి ఖర్చు… కేడర్ను మేపాలి… చాలా తిప్పలుంటాయి… కానీ ఐఏఎస్, ఐపీఎస్లకు..? ప్రజాధనంతోనే సర్వసౌకర్యాలు, సంపాదన, ఎంచక్కా అరవై ఏళ్ల దాకా మేత… తరువాత పెన్షన్లు… ఈ వ్యవస్థకు అల్లుళ్లు…
తెలుగు రాష్ట్రాల్లో ‘‘ఘనత వహించిన’’ ఐఏఎస్, ఐపీఎస్లు ఎదుర్కుంటున్న కేసులు చూస్తున్నవే కదా… చాలావరకూ అక్రమాల కేసుల్లో ఇరుక్కున్న రాజకీయ నాయకుల పేర్లు బహుళ ప్రచారం పొందుతాయి గానీ అవే కేసుల్లో ఉన్న ఉన్నతాధికారుల పేర్లు పెద్దగా ప్రచారంలోకి రావు అదేమిటో మరి…
బేసిక్గా యూపీఎస్సీ పరీక్షా విధానంలోనే లోపాలు… జ్ఞాపకశక్తి బాగుంది, పుస్తకజ్ఞానం, భట్టీయం తెలిసినవాళ్లకే మార్కులు, ఎంపికలు, కొలువులు… వాళ్ల తత్వాలను సరిగ్గా అంచనా వేసే ఇంకేదో పద్ధతి అవసరమేమో… పోనీ, దొరికినవాళ్లను సరిగ్గా శిక్షించే వ్యవస్థలున్నాయా..? అవీ లేవు… అందుకే… ‘‘అనుభవించు రాజా’’…!!
Share this Article