.
షోయబ్ అక్తర్ … తెలుసు కదా, పాకిస్థాన్ పాపులర్ క్రికెటర్ … తన సోదరుడి అంత్యక్రియల్లో పహెల్గామ్ హత్యాకాండకు బాధ్యుడైన ఓ సూత్రధారి పాల్గొన్నాడనే వార్తలు కలకలం రేపుతున్నాయి… నిజానికి ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు…
అక్షరసత్యం ఏమిటంటే… పాకిస్థాన్ ఓ ధూర్తదేశం… పొలిటిషియన్స్, ఆర్మీ, బ్యూరోక్రాట్స్, టెర్రరిస్టులు, క్రికెటర్లు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే అత్యంత అవాంఛనీయ దేశం అది… సరే, ఇదే క్రికెట్- టెర్రరిజం సంబంధాలకు వద్దాం…
Ads
క్రికెట్ను “జెంటిల్మెన్స్ గేమ్” అంటారు. కానీ పాకిస్తాన్ విషయానికి వస్తే, ఈ ఆట చుట్టూ ఎన్నోసార్లు కనిపించింది మాత్రం జెంటిల్మెన్ల ప్రపంచం కాదు… అండర్వరల్డ్, జిహాదీ సంస్థలు, వివాదాస్పద మత ఛాందసవాదులు.
ఇది ఒక్కో ఆటగాడి వ్యక్తిగత తప్పిదం మాత్రమే కాదు. పాకిస్తాన్ అనే దేశంలో క్రికెట్, రాజకీయాలు, సైన్యం, మత సంస్థలు, తీవ్రవాద నెట్వర్క్లు ఒకే సామాజిక వాతావరణంలో ఎలా కలిసిపోయాయో చెప్పే చిత్రం.
ప్రపంచ క్రికెట్కు ఇమ్రాన్ ఖాన్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, యూనిస్ ఖాన్, బాబర్ ఆజమ్ వంటి అద్భుతమైన ఆటగాళ్లను ఇచ్చిన దేశమే… ప్రపంచంలో అత్యధికంగా ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించిందనే ఆరోపణలతో కూడా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఈ రెండు వాస్తవాలు పక్కపక్కనే నడవడం పాకిస్తాన్ విషాదం.
దావూద్తో వియ్యం… ప్రపంచం విస్తుపోయింది
పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఎన్నటికీ చెరిగిపోని వివాదం జావేద్ మియాందాద్ కుటుంబ వివాహం. మియాందాద్ కుమారుడు జునైద్… 2005లో భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, డి-కంపెనీ డాన్ దావూద్ ఇబ్రహీం కుమార్తె మహ్రుఖ్ను వివాహం చేసుకున్నాడు.
ఇది కేవలం కుటుంబ నిర్ణయం మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదానికి ప్రతీకగా మారిన వ్యక్తి కుటుంబంతో ఒక క్రికెట్ దిగ్గజం బంధుత్వం కలుపుకోవడం అనేక ప్రశ్నలకు దారితీసింది. పాకిస్తాన్లో ఇది పెద్ద సంచలనం కాకపోవచ్చు. కానీ ప్రపంచం మాత్రం ఆశ్చర్యంతో చూసింది.
అంత్యక్రియల్లోనూ అదే నీడ
తాజాగా షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు సంబంధించిన చిత్రాలు మరోసారి పాకిస్తాన్ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. భారత భద్రతా వర్గాలు తీవ్రవాద సంస్థలతో అనుబంధం ఉన్నట్లు పేర్కొనే వ్యక్తులు, ప్రత్యేకించి పహెల్గామ్ దురాగతానికి సూత్రధారులు ఆ కార్యక్రమంలో కనిపించడం చర్చకు దారితీసింది.
ఒక ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉగ్రవాద అనుమానితులు సెలబ్రిటీల కుటుంబ కార్యక్రమాల్లో ఇలా బహిరంగంగా పాల్గొనగలరా? పాకిస్తాన్లో మాత్రం అలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తుంటాయి.
అఫ్రిది వివాదాలు – ఎందుకు ఆగవు?
షాహిద్ అఫ్రిది పేరు వినగానే భారత అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చేది అతని సిక్సర్లు కాదు. కశ్మీర్పై చేసిన వ్యాఖ్యలు… హఫీజ్ సయీద్ వంటి వ్యక్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు… పాకిస్తాన్ అధికార వ్యవస్థకు దగ్గరగా కనిపించిన సందర్భాలు… ఇవన్నీ కలిసి అతడిని కేవలం మాజీ క్రికెటర్గా కాకుండా రాజకీయ వివాదాల కేంద్రంగా మార్చాయి.
స్పాట్ ఫిక్సింగ్… మరో మచ్చ
ఉగ్రవాదం కాకపోయినా, అవినీతి కూడా పాకిస్తాన్ క్రికెట్ను తీవ్రంగా దెబ్బతీసింది. 2010 లార్డ్స్ టెస్టులో స్పాట్ ఫిక్సింగ్ కేసులో కెప్టెన్ సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ ఆమిర్ శిక్షలు అనుభవించడం ప్రపంచ క్రికెట్కు భారీ షాక్.
ఒకవైపు మ్యాచ్ ఫిక్సింగ్… మరోవైపు వివాదాస్పద వ్యక్తులతో సంబంధాల ఆరోపణలు… ఇవన్నీ కలిసి పాకిస్తాన్ క్రికెట్ విశ్వసనీయతను దెబ్బతీశాయి. సమస్య ఆటగాళ్లలో కాదు… వ్యవస్థలో ఉంది. పాకిస్తాన్లో అసలు సమస్య ఒక్కో క్రికెటర్ కాదు.
ఆ దేశంలో సైన్యం, రాజకీయాలు, మత ఛాందసవాదం, జిహాదీ సంస్థలు, సెలబ్రిటీ సంస్కృతి మధ్య ఉన్న అస్పష్టమైన గీత. ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో సంవత్సరాల పాటు దాక్కుని ఉండగలిగాడు. ఐక్యరాజ్యసమితి తీవ్రవాదుల జాబితాలో ఉన్న వ్యక్తులు బహిరంగ సభల్లో ప్రసంగించిన సందర్భాలు ఉన్నాయి.
అలాంటి దేశంలో క్రికెటర్ల చుట్టూ కూడా వివాదాస్పద వ్యక్తులు కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. అసలు ఆ దేశమే అది.
పీసీబీ ఎప్పుడైనా ఆత్మపరిశీలన చేసుకుందా?
ప్రపంచ క్రికెట్లో గౌరవం సంపాదించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. విలువలు కూడా ఉండాలి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎన్నోసార్లు ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి గురించి మాట్లాడింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ చుట్టూ పదేపదే ఉగ్రవాదం, అండర్వరల్డ్, ఫిక్సింగ్, వివాదాస్పద వ్యక్తుల పేర్లు వినిపిస్తుండటం ఆ బోర్డు ప్రతిష్ఠపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది.
గతంలో వర్ణవివక్ష ఇష్యూలో దక్షిణాఫ్రికాను ప్రపంచ క్రికెట్ సమాజం చాలా ఏళ్లు బహిష్కరించింది… ఎస్, పాకిస్థాన్ క్రికెట్ను కూడా ప్రపంచ క్రికెట్ సమాజం బహిష్కరించాలి. అంతర్జాతీయంగా ఆ రౌడ్ కంట్రీని ఎండగట్టాలి!
Share this Article