.
Nàgaràju Munnuru…… ఐపిఎల్ అని పిలువబడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది బీసీసీఐ నిర్వహించే ఒక ప్రైవేటు క్రికెట్ టోర్నమెంట్. ఇంతకు ముందు కూడా చెప్పాను ఇది డబ్బులు సంపాదించడం కోసం నిర్వహిస్తున్న పక్కా కమర్షియల్ లీగ్ మాత్రమే.
టోర్నమెంట్ నిర్వహించడానికి జట్లు కావాలి కాబట్టి వాటికి ఏవో పేర్లు పెట్టారు. ఫ్రాంచైజీ పేరులో రాష్ట్రాల పేర్లు, రాష్ట్ర రాజధానుల పేర్లు ఉన్నంత మాత్రాన అవేమీ ఆయా రాష్ట్రాలకు అధికార ప్రాతినిధ్యం వహించవు.
Ads
వందల కోట్లు ఉన్నవాళ్ళు ఈ ఫ్రాంచైజీలను సొంతం చేసుకుని ప్రతీ సంవత్సరం క్రికెటర్లను సంతలో సరుకులాగా వేలంలో కొనుక్కుని తమ ఫ్రాంచైజీల తరపున ఆడిస్తారు. ఆ ఆటగాడు అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాకపోవచ్చు, విదేశీయుడు కూడా కావచ్చు. జస్ట్, కిరాయి ఆటగాళ్లు…
ఈ మొత్తం లీగ్ నిర్వహణలో డబ్బు సంపాదన తప్ప మరొకటి లేదు. ఒకవైపు ప్రభుత్వాల బెట్టింగ్ ఆడవద్దు అని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటే డ్రీమ్ 11 అనే బెట్టింగ్ కంపెనీ కొన్ని ఫ్రాంచైజీలకు మెయిన్ స్పాన్సర్, మై ఎలెవన్ సర్కిల్ అనే బెట్టింగ్ యాప్ క్రికెటర్లు యాడ్స్ ఇస్తున్నారు.
ఇంకా పాన్ మసాలా, గుట్కా, జర్దా కంపెనీలకు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అజయ్ దేవ్ గన్ లాంటి బాలీవుడ్ సినీ నటుల సరోగేట్ ప్రకటనలు. వీటికి తోడు దేశంలో ఎక్కడికి అక్కడ జరిగే లోకల్ బెట్టింగ్ లకు లెక్కలేదు.
ప్రతి సంవత్సరం ఎంతమంది యువకులు ఈ బెట్టింగ్ లకు బలవుతున్నారు? ఎవరికి పట్టింది ఇదంతా?
బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ సమాజానికి, ముఖ్యంగా యువతకు చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు.
గుడ్డిలో మెల్ల ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు ఐపీఎల్ ఆడటం ద్వారా కొంత డబ్బు సంపాదించుకునే అవకాశం దొరకడం. కింది ఫోటో భారత్ టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ముంబైలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ…
(కోడిపందేలు, పేకాట, జల్లికట్టు ఎట్సెట్రా మహాప్రమాదకరం అంటూ నిషేధాలు, కేసులు… మట్కాలు, లాటరీలకన్నా ఐపీఎల్ మాత్రమే అధిక ప్రమాదకరం… దీన్ని మాత్రం ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తాయి, అదే ఐరనీ… ఈ ఆటలో గెలిస్తే ప్రభుత్వ సత్కారాలు అట… ఎటు పోతున్నట్టు మనం..?)
Share this Article