.
కేటీయార్, కవిత, కేసీయార్, హరీష్రావు… ఈ నలుగురు ఏమంటున్నారు..? రేవంత్ రెడ్డి పాలన దుర్మార్గం, ప్రశ్నిస్తున్నామని కేసులు పెడుతున్నాడు, లొట్టపీసు కేసులు, తుప్పాస్ కేసులు… పెట్టుకో, వందలు, వేల కేసులు పెట్టుకో, కొట్లాడతాం అంటున్నారు కదా…
గుడ్, ప్రతిపక్షానికి ఈమాత్రం టెంపర్మెంట్ అవసరమే… కాకపోతే ఈ కేసులన్నీ ప్రజాసమస్యల మీద గాకుండా, ప్రజల్నే సమస్యలపాలు చేసిన అక్రమాల మీద పడుతుండటమే విశేషం… ఈ చిన్న లాజిక్ మిస్సవుతున్నారు ఆ నలుగురు…
Ads
అయ్యా, కేటీయార్, ఫార్ములా-ఈ కేసు విచారణకే కాదు, అరెస్టుకూ గౌరవనీయులైన గవర్నర్ గారు గో ఎహెడ్ అన్నారు… కుంగిన మేడిపండుగడ్డ పిల్లర్లు కేసీయార్ను విచారణ కమిషన్ ఎదుట నిలబెట్టాయి… అదే కేసులో శ్రీమాన్ హరీష్ రావూ నిలబడ్డాడు…
సరే, కవిత లిక్కర్ దందాలు వేరే… అవి వీటన్నింటికీ అతీతం… పదేళ్ల అక్రమాల్ని ఎవరూ ప్రశ్నించొద్దా..? విచారించొద్దా..? మీరేమైనా అతీతులా అనడుగుతోంది తెలంగాణ సమాజం… ఎందుకీ ఉలిక్కిపాట్లు..? ఆ కమిషన్ ఏదో తేల్చేదాకా జెర ఆగు స్వామీ…!!
అసెంబ్లీలో చర్చిద్దాం అంటాడు, అదేదో ఏసీబీకే చెప్పొచ్చు కదా… లైడిటెక్టర్ టెస్టు అంటాడు, అదీ ఏసీబీకే చెప్పొచ్చు కదా… అసలు ఫార్ములా రేసుతో సీఎంకు ఏం సంబంధం..? ఇదే లై డిటెక్టర్ టెస్టులకు ఫోన్ ట్యాపింగులు, పవర్ అక్రమాలు, కాళేశ్వరం అవినీతి, చివరకు గొర్రెల పంపిణీ పథకం దాకా… వై ఓన్లీ ఫర్ ఫార్ములా కేస్..? అన్నింటికీ అదే టెస్టులకు బీఆర్ఎస్ ముఖ్యులు సిద్ధమేనా..? ఏమేమో చెబుతాడు కేటీయార్…
కేసీయార్ సారు గారి పాలనలో ప్రజాస్వామ్యం ఎంత పరిఢవిల్లిందో ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం… అద్భుత ప్రజాస్వామిక విలువలకు తార్కాణం అని ఎలా చెప్పుకుంటారో కూడా చూద్దాం… నియంత లక్షణాలు ఏమిటో, నయా ఫ్యూడల్ రాచరికం ఏమిటో కూడా చెప్పడానికి అదే పెద్ద ఉదాహరణ… (వంద కథనాలు, వేయి విశ్లేషణలు అవసరమే లేదు…)
అది 2019 సెప్టెంబరు… కేసీయార్ శుక్రమహర్దశ నడుస్తున్న రోజులవి… కానీ ఏదో భయం… ఏదో డౌటు… ప్రగతి భవన్ ప్రహారీ ఎత్తు మూడు రెట్లు పెరిగింది… ఎవడికీ ఎంట్రీ లేని చక్రవర్తుల వారి దివాణం… ఐనా ఏదో గుబులు… 9 కుక్కల్ని పెంచసాగారు…
వాటిలో రెండు భవనం ప్రాంగణంలోనే తిరుగుతూ యాంటీ తెలంగాణ శక్తులు ప్రవేశించకుండా కాపలా కాస్తుంటాయన్నమాట… హస్కీ అనే 11 నెలల వయసున్న కుక్క హల్క్ జాతికి చెందినది, ఇది పిట్ బుల్ టెర్రియర్, బుల్డాగ్ల మధ్య సంకరజాతి…
ఫాఫం… సెప్టెంబర్ 11న పశువైద్యుడు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత హస్కీ మరణించినట్లు ఆరోపణ… అరోపణేం ఖర్మ..? ప్రగతి భవన్లో పెంపుడు కుక్కలకు ఓ నిర్వాహకుడు ఉండేవాడు… పేరు ఆసిఫ్ అలీ ఖాన్… తను ఫిర్యాదు ఇచ్చాడు… అంతే, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు…
ఈ కుక్క మరణం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందా..? నక్సలైట్లు ప్లాన్ ఏదైనా ఉందా..? తెలియదు గానీ… వైద్యుడు ప్లస్ వెటర్నరీ క్లినిక్ ఇన్ఛార్జ్ నిర్లక్ష్యం కారణంగా కుక్క చనిపోయిందని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు… థాంక్ గాడ్, ఎన్ఐఏ రంగంలోకి దిగలేదు… ఉగ్రవాదం సందేహాలు అప్పటికింకా అలుముకోలేదు…
ఫిర్యాదు ప్రకారం.., సెప్టెంబర్ 10న హస్కీ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయింది.. ఆరోజు ఫాఫం ఆ హస్కీ ఏమీ తినలేదు, పాలు కూడా తీసుకోలేదు.., ఆ తర్వాత పశువైద్యుడిని పిలిపించారు… ఆ వైద్యుడు లివర్ టానిక్ ఇచ్చిన తర్వాత కుక్క ఆరోగ్యం వేగంగా క్షీణించింది, ఆ తర్వాత హస్కీని క్లినిక్కు తరలించారు, అక్కడ కుక్క చనిపోయిందని ప్రకటించారు…
మరుసటి రోజే డాక్టర్, సదరు వెటర్నరీ క్లినిక్ యజమానిపై ఫిర్యాదు నమోదైంది… ఆ కుక్క, సారీ, ఆ హస్కీ మరణానికి కారణాన్ని తెలుసుకోవడానికి పోస్ట్మార్టం నిర్వహించబడింది… సోకాల్డ్ జానారెడ్డిలు, కిషన్రెడ్డిలు స్పందించినట్టు గుర్తులేదు కానీ…
ఆఫ్టరాల్ ఓ కుక్క చచ్చిపోతే వెటర్నరీ వైద్యుడిపై కేసు పెట్టారు, నీ నిర్లక్ష్యం కారణంగా వైరల్ జ్వరాలతో వందలాదిగా చనిపోయారు, ఎవరిపై కేసులు పెట్టాలి అని జగ్గారెడ్డి ప్రశ్నించాడు… ఇప్పటి సీఎం, అప్పటి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ‘‘ప్రగతిభవన్లో కుక్కల ప్రాణాలకు విలువ ఉంది గానీ, బంగారు తెలంగాణలో మనుషుల ప్రాణాలకే విలువ లేదు పాపం’’ అని వెక్కిరించాడు..!!
చేసిన పాపాలు, బాధితుల ఉసురు వెంటబడి తరుముతూ ఉంటాయి పెద్ద సార్లూ… లక్ష పుస్తకాలు చెప్పే నీతి కూడా అదే… అఫ్కోర్స్, మళ్లీ అధికారంలోకి రండి, బారా ఖూన్ మాఫ్ అనేద్దాం..!!
Share this Article