.
నేడు అందుబాటులోకొచ్చిన సాంకేతికతకు రూట్ మ్యాప్ చూసుకోవడానికి పేపర్ అక్కర్లేదేమోగానీ… జీపీఎస్ అందుబాటులోకి రాని ఆ రోజుల్లో.. ఓ పేపరే దారిదీపమైన పరిస్థితుల్లో ఓ విమానంలో నుంచి ఆ రూట్ మ్యాప్ పేపర్ జారి కిందపడితే..?
ఆ విమానంలో మన మొట్టమొదటి రాష్ట్రపతి, రాజ్యాంగసభ అధ్యక్షుడైన డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ వంటి హేమాహేమీలుంటే ఇంకేంటి పరిస్థితి..? అవునూ, అలాంటి ఒక చరిత్రలో మనం చూడని ఉత్కంఠ రేపే ఓ చాప్టర్ లోకి వెళ్లొద్దాం.
Ads
ఇవాళ మనం సైకిలో, సైకిల్ మోటరో పాడైపోతే.. డకోటా బండి అని ఆట పట్టిస్తుంటాం. కానీ, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఉపయోగించిన సైనిక రవాణా విమానం పేరు డకోటానే. ఆ డకోటా విమానంలోనే 1947లో బాబు రాజేంద్రప్రసాద్ తో పాటు, పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్నారు.
మిస్టర్ వి. సుందరం, మిసెస్ ఉషా సుందరం ఈ దంపతులిద్దరూ పైలెట్సే. భర్త వి. సుందరానికి భార్య ఉషా సుందరం కో పైలెట్ గా డకోటా విమానం నడుస్తోంది. తిరుచ్చి నుంచి త్రివేండ్రకు వెళ్లుతున్న సమయంలో ఉషా సుందరం చేతుల్లో ఉన్న రూట్ మ్యాప్ కిటికీకున్న చిన్న పగుళ్లలోంచి జారి కింద పడిపోయింది.
ఓవైపు వాతావరణమంత అనుకూలంగా లేదు. ఇంకోవైపు, త్రివేండ్రంలో ఎలాంటి సిగ్నల్స్ గురించి చెప్పే రేడియో స్టేషన్ సౌకర్యాలూ లేవు. కానీ, అదృష్టవశాత్తూ వారు తమ డకోటా విమానాన్ని కేప్ కొమోరిన్ అనే తీరప్రాంతంలో ఓవైపు భీకరంగా వీస్తున్న గాలులు, ఉరుములు, మెరుపుల మధ్య మెల్లిగా ల్యాండ్ చేయగల్గారు. ఈ విషయాన్ని మిస్టర్ సుందరం తన ఆటోబయోగ్రఫీ యాన్ ఎయిర్ మ్యాన్స్ సాగాలో పేర్కొన్నారు.
పిస్టన్ ఇంజన్స్, మ్యానువల్ నియంత్రణల కాలంలో, అదీ భారతదేశం తన అధికారికంగా ప్రయాణించే విమానాల కోసం ఇంకా విదేశాలపైనే ఆధారపడ్డ రోజుల్లో సుందరం దంపతులు యూకే నుంచి చెన్నై వరకూ 27 గంటల పాట దేశాల సరిహద్దులు దాటుతూ ప్రయాణించి రికార్డ్ నెలకొల్పారు.
బ్లూక్రాస్ ఇండియా సహ వ్యవస్థాపకుడైన చిన్నికృష్ణకు తల్లిదండ్రులే ఈ సుందరం దంపతులు. స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా సుందరం దంపతుల జంట ఎన్నో సాహసోపేతమైన ప్రయాణాలను చేసింది.
జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తో కలిసి భారత ఉపఖండమంతా ప్రయాణించింది ఈ జంట. అప్పుడే ఏర్పడిన పాక్ లోనూ పర్యటించిన ఈ సుందరం దంపతుల జంట తాము పైలట్లుగా.. భారతదేశ కీలక జాతీయ నాయకులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల వంటివారిని తమ విమాన డ్రైవింగ్ లో పైలట్లుగా తిప్పడం సుందరం దంపతులకు మాత్రమే ఇప్పటివరకూ దక్కిన అరుదైన ఘనత.
భారత్ యూనియన్ లో తమ రాజ్యాలను కలపాలంటూ ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 300 సంస్థానాలకు వెళ్లి ఆనాటి రాజులను కలిసే క్రమంలోనూ సుందరం దంపతులు పైలట్లుగా వ్యవహరించారు. ఆ సమయంలోనే భారతీయత గాల్లో రెపరెపలాడాలని పటేల్ సదరు పైలట్లలో దేశభక్తి నూరిపోసేవాడట.
ఈ విషయాల్ని వారి కుమారుడు 80 ఏళ్ల సురేష్ సుందరం వెల్లడించారు. తన తల్లిదండ్రులు అసలు కనీసం మ్యాపింగ్ చేయని ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యారని.. వాతావరణ పరిస్థితులను అంచనా వేసి కొత్త కొత్త మార్గాలను అన్వేషించేవారని.. ఎవరూ ప్రయాణించని తీరులో పైలట్లుగా వారి ప్రస్థానం సాగిందంటారాయన.
అలాగే, యూకే నుంచి తీసుకొచ్చే డి హావిలాండ్ డోవ్ ఎయిర్ క్రాఫ్ట్ ను అప్పటి మద్రాస్ ప్రభుత్వానకందించే క్రమంలో కూడా అదొక ఐకానిక్ జర్నీగా పేర్కొన్నారు సుందరం తన బుక్ లో. యూకే హెర్ట్ ఫోర్డ్ షైర్ లోని హాట్ ఫీల్డ్ విమానాశ్రయంలో ఆప్రాన్ పై పార్కింగ్ చేసి ఉన్న డోవ్ ను చూసిన ఆ క్షణం.. విమానంలోని మధ్యభాగం ఫ్యూజ్ లాజ్ పై మద్రాస్ ప్రభుత్వం అని రాసి, రెక్కలపై భారత త్రివర్ణ పతాకాన్ని చిత్రించి మురిసిపోయాం.
ఆ ఎయిర్ క్రాఫ్ట్ కు హనుమాన్ అని పేరు పెట్టి దాని ముందున్న ముక్కులాంటి భాగంలో రెడ్ కలర్ వేసి ముస్తాబు చేశామంటూ సుందరం పేర్కొన్నారు. ఆ సమయంలో బ్రిటీష్ పైలట్ సుందరంకు కొన్ని సలహాలిచ్చేందుకు టెస్ట్ రైడ్ నిర్వహించాక.. ఇంక నేను మీకు ఏ సలహాలు ఇవ్వనక్కర్లేదన్నాడని ఆయన కొడుకు సురేష్ సుందరం చెప్పిన మాట.
1948లో జూన్ 7వ తేదీన సుందరం పైలట్ దంపతుల జంట ఇంగ్లీష్ ఛానల్ నుంచి ఆరు వేల మైళ్ల ప్రయాణాన్ని ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రారంభించింది. టౌలౌస్, జెనీవా, ఏథెన్స్, నికోసియా మీదుగా వారి ప్రయాణం సాఫీగా సాగినా.. బాగ్ధాద్ కు వెళ్లేసరికి వారు దట్టమైన పొగమంచును ఎదుర్కోవాల్సి వచ్చింది.
వందగజాల ముందు వరకూ కనీసం ఏమీ కనిపించనంత దట్టమైన పొగ వారికి ఎయిర్ క్రాఫ్ట్ రైడింగ్ లో సవాలుగా మారింది. ఆ సమయంలో ముందుకెళ్తే ప్రమాదం సంభవించొచ్చన్న అంచనా వేసిన ఆ జంట.. తిరిగి హబానియాకు వెళ్లింది. సాధారణంగా అక్కడ పౌరవిమానాల ల్యాండింగ్ కు అనుమతించరు.
కానీ, అది అత్యవసర పరిస్థితని చెప్పి అక్కడ ల్యాండ్ చేసుకోవాలని యోచించినట్టు భార్యాభర్తలుగా పైలట్స్ ఉద్యోగాల్లో తమ అనుభవాలను సుందరం రాసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడి రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు వారి ఎయిర్ క్రాఫ్ట్ సులభంగా దిగేందుకు ఆయిల్ బ్యారెల్స్ తో మార్క్ చేశారు. అలా ఇరాక్ లోని ఎయిర్ ఫీల్డ్ లో దిగిన సుందరం దంపతుల జంట..
ఆ తర్వాత షార్జాకు పయనమైంది. కానీ, షార్జాకు వెళ్లేటప్పుడు కూడా తీవ్రమైన దుమ్ము తుఫాన్ ను ఎదుర్కోవడంతో.. వారు ఐదొందల అడుగుల ఎత్తులో తమ ఎయిర్ క్రాఫ్ట్ ను ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అలాంటి సవాళ్ల మధ్య ఆ జంట బతికి బట్ట కడుతుందా, లేదా అన్న అనుమానాలు, ఆందోళన నెలకొన్న సమయమది. కానీ, మిస్టర్ అండ్ మిసెస్ సుందరం ఇద్దరూ కూడా వారం రోజుల తర్వాత మద్రాస్ చేరుకున్నారు. విజయవంతంగా తిరిగివచ్చిన ఆ జంటకు హీరోల్లాంటి స్వాగతమందింది.
తన తల్లి పైలట్ గా ఎయిర్ క్రాఫ్ట్ ను సమర్థవంతంగా నడపగలదనీ.. అలాగే కో పైలెట్ గా కూడా మారి సహకరించగలదనీ.. అవసరమైనప్పుడు ఫ్లైట్ అటెండెంట్ పాత్రను కూడా పోషించిందంటారు మిసెస్ ఉషా సుందరం కూతురు అమెరికాలో జర్నలిస్టైన విజి.
ఉష తన భర్త సుందరం ప్రోత్సాహంతో 22 ఏళ్లకే విమానయాన శిక్షణలో తర్ఫీదు పొంది లైసెన్స్ కూడా సాధించేసింది. కొంతకాలం కో పైలెట్ గా భర్తతో పాటు పనిచేసిన ఉష.. కొద్దికాలానికే సోలో పైలెట్ గా విమానాలను నడపడం మొదలుపెట్టారు.
ఉష సోలోగా పైలెట్ గా ప్రయాణించడాన్ని ఆమె తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలనుకున్న అల్లుడు సుందరం ఓ టెలిగ్రామ్ పంపించాడు. అందులో usha did solo అని రాద్దామనుకున్న సుందరం పొరపాటున usha died solo అని టెలిగ్రామ్ చేయడంతో అది కొద్దికాలం ఆ కుటుంబంలో గందరగోళానికీ దారితీసింది.
సుందరం, ఉషా సుందరంకు పెళ్లి తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టారు. దాంతో ఉష ఇక భర్తతో కలిసి సాహసయాత్రలన్నింటిలోనూ భాగస్వామి కాలేకపోయింది. ఆ సమయంలో సుందరం ఒంటరిగానే కలకత్తా నుంచి గౌహతికి సర్దార్ పటేల్ తో కలిసి ఒంటరి ప్రయాణానికి సిద్ధమయ్యాడు.
అలా అప్పటి తూర్పు పాకిస్థాన్.. ఇప్పటి బంగ్లాదేశ్ మీదుగా ప్రయాణించాల్సి వచ్చింది. కానీ, అది శత్రుభూభాగం కావడంతో సుందరం కాస్తా ఆందోళనకు గురయ్యారు. ఏ ఏమవుతుంది పాకిస్థాన్ పైనుంచి వెళ్లితే.. వారి దేశాన్నీ చూసినట్టుంటుంది పోనీయ్ అన్న సర్దార్ పటేల్ మాటతో నాటి తూర్పు పాక్ మీదుగా ప్రయాణించాల్సి వచ్చింది. సుందరం ఆందోళనకు భిన్నంగా అప్పడు ఢాకా నుంచి ఓ వైర్ లెస్ సమాచారమందింది. సర్దార్ పటేల్ కు పాక్ ప్రభుత్వం, ప్రజల తరపున స్వాగతమన్నది ఆ సందేశం.
పైలట్ గా సుందరం ఎదుర్కొన్న సవాళ్లెన్నో ఇలా మనకు ఆయన పుస్తకంలో కనిపిస్తాయి. 1947, ఆగస్ట్ లో అది దేశ విభజన సమయం. శరణార్ధులను కాపాడే క్రమంలో డకోటా విమానాలున్నా.. అవి నడిపే సుశిక్షితులైన పైలట్స్ లేరు.
ఆ సమయంలో శరణార్థులు కొందరు తమను భద్రంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తే వజ్రాలు, బంగారం వంటివీ ఇవ్వడానికీ ముందుకొచ్చినట్టు ఆయన ఆటోబయోగ్రఫీ చెబుతోంది. ఆ సమయంలో సుందరం బాంబేకు చెందిన మిస్త్రీ ఎయిర్ వేస్ కు తన సేవలనందిస్తున్నాడు.
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ముల్తాన్ వరకూ ముంబై నుంచి వెళ్లి అక్కడి నుంచి శరణార్థులను తరలించడం సుందరం టాస్క్. అలా VT-AYZ అనే డకోటా ఫ్లైట్ పట్టుకుని బయల్దేరాడు. ఒక ఫ్లైట్ లో 30 మంది కంటే ఎక్కువమందిని తీసుకురారాదు. కానీ, సుందరం అప్పటికే ఫ్లైటెక్కిన 28 మందికి తోడు.. రిస్క్ తీసుకుని మరో 40 మంది ప్రయాణీకులను తీసుకొచ్చాడు.
ఆ సమయంలో ఆ ఫ్లైట్ ఏకంగా ఓ రైల్లోని జనరల్ బోగీల తరహాలో.. నేలపై, సీట్లపై, టాయిలెట్స్ లో కూడా ఇరుక్కుపోయి జనం వలస వచ్చారు. అలా పదివేల పౌండ్ల అధికబరువున్నప్పటికీ సురక్షితంగా ఆ శరణార్థులందరినీ జోథ్ పూర్ కు తీసుకొచ్చారు సుందరం.
అలా సుందరం తీసుకొచ్చిన శరణార్థుల్లో ఓ వృద్ధుడుండగా.. అతడి భార్య, ఆరుగురు పిల్లలు తీసుకొచ్చిన లగేజ్ ఇవ్వడానికి విమానయాన నిబంధనలు ఒప్పుకోలేదు. కానీ, ఆ లగేజ్ లో ఉన్న బట్టల్ని, ఇతర సామాన్లను పడేసి.. కేవలం కట్టుబట్టలతో వచ్చినందుకు అందులో ఉన్న లక్ష రూపాయల కట్టను, ఇతర ఆభరణాలను మాత్రమే తీసుకోవాల్సి వచ్చింది.
ఆ శరణార్థి పేరు కిషన్ చంద్ చెల్లారామ్ కాగా.. ఆ తర్వాత ఆ శరణార్థి చెన్నైలో వస్త్ర సామ్రజ్యాన్నే నిర్మించాడు. పదవీ విరమణ తర్వాత సుందరం దంపతులిద్దరూ జంతు సంరక్షణ వైపు మొగ్గుచూపారు. ఆ క్రమంలో సహ వ్యవస్థాపకులుగా బ్లూక్రాస్ సంస్థ స్థాపనలో భాగస్వాములయ్యారు.
మొత్తంగా 1996 వరకూ కూడా హుషారుగా విమానాలు నడిపి.. పైలెట్లుగా సుందరం దంపతులు సాధించిన ఫీట్స్ తో పాటు… దేశంలోని ప్రముఖులతో వారు చేసిన జర్నీ.. బాబు రాజేంద్రప్రసాద్ వంటివారు ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ లో జరిగిన ఉదంతాలు, ఎదుర్కొన్న సవాళ్లన్నీ ఆ పైలట్స్ కు దేశంలో ఓ ప్రత్యేక గుర్తింపునిచ్చాయి…. ( రమణ కొంటికర్ల )…
Share this Article