.
కొమ్మినేనిలో బాబును చూసుకున్న కాంగ్రెస్ నేతలు… సిఎల్పి కార్యాలయంలోకి కొమ్మినేని శ్రీనివాస్ రాగానే కాంగ్రెస్ నాయకులు అతనిలో చంద్రబాబును చూసుకునే వారు .
ఇప్పటి వారికి నిజమా అని ఆశ్చర్యం కలుగవచ్చు కానీ ఉమ్మడి రాష్ట్రంలో రెండు దశాబ్దాల క్రితం ఇది రోజూ కనిపించిన దృశ్యమే …
బాబు ప్రభుత్వం కొమ్మినేనిపై చివరకు sc st కేసు పెట్టి అరెస్ట్ చేయడం చూస్తే … కొమ్మినేనిలో ఒకప్పుడు అందరూ బాబును చూసుకోవడం నిజమా అనిపిస్తుంది …
Ads
అసెంబ్లీ ఆవరణలో అన్ని పార్టీలకు శాసనసభా కార్యాలయాలు ఉంటాయి … ఇప్పటిలా వాట్సాప్ జర్నలిజం కాకుండా రెండు దశాబ్దాల క్రితం జర్నలిస్ట్ లు తెగ తిరిగే అవకాశం ఉండేది .. కాంగ్రెస్ బీట్ రిపోర్టర్లు tdp కార్యాలయానికి రావడం తక్కువ కానీ టీడీపీతో పాటు అన్ని పార్టీల రిపోర్టర్లు కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లే వారు ..
కొమ్మినేని కాంగ్రెస్ కార్యాలయానికి రాగానే కాంగ్రెస్ నాయకులు బాబును అన్నట్టుగా కొమ్మినేనిపై జోకులు వేసేవారు . కొమ్మినేనిలో వారు బాబును చూసేవారు …
ఆ విషయం కొమ్మినేనికీ తెలుసు.. నవ్వుతూనే అందరినీ పలకరించి, నాయకుల నుంచి సమాచారం సేకరించే వారు … ఎవరు ఏమంటే నాకేంటి, సమాచారం ముఖ్యం అన్నట్టుగా కొమ్మినేని తీరు ఉండేది …
సాధారణంగా ఒక జర్నలిస్ట్ మరో జర్నలిస్ట్ ను మెచ్చుకోడు .. కానీ టీడీపీ ఆవిర్బావం నుంచి ఈనాడులో కొమ్మినేనితో పాటు టీడీపీ బీట్ చూసిన chvm కృష్ణారావు ఓసారి నాతో ‘‘కొమ్మినేనిని బాబు మనిషి అని జోకులు వేస్తారు అని ఆయనకూ తెలుసు, అయినా పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకులను పలకరిస్తుంటాడు… రిపోర్టర్ అంటే ఇలా ఉండాలి’’ అన్నాడు ..
ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్రి కూడా ఓసారి కొమ్మినేని గురించి ఇలానే అన్నారు … కొమ్మినేని మనసా వాచా కర్మణా టీడీపీ – బాబు అభిమాని …సమైక్యాంధ్ర కోసం ఉద్యమ కాలంలో తపించారు …
ఓసారి అసెంబ్లీ జరుగుతుండగా లాబీలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు కనిపిస్తే – (అప్పుడు దగ్గుబాటి కాంగ్రెస్ లో ఉన్నారు) … సాక్షి పత్రిక రాబోతుంది … (దీనిని కొమ్మినేని వ్యతిరేకించారు) … ఒక రాజకీయ పార్టీ పత్రిక పెట్టడం ఏమిటీ అని దగ్గుబాటిని ప్రశ్నించారు …
దగ్గుబాటి నవ్వి ఏమీ చెప్పక ముందే ఒకే పార్టీకి మీడియా ఉండడంకన్నా అన్ని పార్టీలకు మీడియా ఉండడం మంచిదే అని నేను సమర్ధిస్తే… దగ్గుబాటి నా వాదనను సమర్ధించారు …
కాల గమనంలో – సాక్షి ఏర్పాటును విమర్శించిన కొమ్మినేని సాక్షిలో చేరడం … కాంగ్రెస్ వాళ్ళు తనలో బాబును చూస్తే అదే బాబు ప్రభుత్వం sc st కేసు పెట్టి అరెస్ట్ చేయడం కాల మహిమ .. Sc st కేసు ఎలా వర్తిస్తుంది అని న్యాయమూర్తి ప్రశ్నించారు కానీ జర్నలిస్ట్ ల సంఘాలు ప్రశ్నించకపోవడం కాల మహిమ …
రాష్ట్ర విభజన తరువాత బాబు ఆంధ్ర సీఎం అయ్యాక జర్నలిస్ట్ ల బృందం వెళ్లి ‘‘సార్ జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి , మేం 50 వేల మందిమి ఉన్నాం, మా మద్దతు మీ పార్టీకే అని చెబితే … బాబు కూల్ గా ‘‘మీరేం చేస్తారు … మీరు ఉద్యోగులు, మీ యాజమాన్యాలు చెప్పినట్టు రాయాలి, మీదేముంటుంది’’ అని చెప్పారు …
బాబు చెప్పింది అక్షర సత్యం … యజమానుల ఇష్టం మేరకే మీడియా పని చేయాలి … పార్టీల ఆదేశాల మేరకే యూనియన్ లు పని చేస్తాయి .. రాజకీయ పక్షాలు అయినా మీడియా అయినా తమ ప్రయోజనాలు కాపాడేంత వరకే జర్నలిస్ట్ లకు విలువ ఇస్తాయి .. లాభం లేదు అనుకుంటే గంజిలో ఈగలా తీసేస్తాయి . నష్టం అనుకుంటే sc st కేసులు పెట్టి బొక్కలో వేయిస్తాయి … – బుద్దా మురళి
Share this Article