.
Priyadarshini Krishna ……..తప్పెవరిది… విశాఖ Gas Leak దుర్ఘటనకి నిన్నటికి ఐదేళ్ళు…!! గమనిక: పోస్టు పాతదే…. అతి ముఖ్య గమనిక : ఈ పోస్ట్ నేను ఒక రాజకీయ పార్టీకి మద్దతు,గా ఇంకో పార్టీని వ్యతిరేఖిస్తూ, మరొక పార్టీకి న్యూట్రల్గా పెట్టింది కాదు.
ఏ ఒక్క న్యూస్ చానల్ గాని, యూట్యూబ్ వారియర్స్ కానీ పిట్టలు చచ్చాయి, మొక్కలు కాలిపోయాయి, బాధితులకు ఎక్స్గ్రేషియా ఇస్తారా, ఇవ్వరా లాంటి పైపైన వార్తలే తప్పితే గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వనందున (నాకు ఒళ్ళు మండి) రాసిన వ్యాసం….
Ads
కొత్త మిత్రులు కూడా చదువుతారనే ఒక ఆశ…..
నాకున్న సమాచారంతో ఒక బాధ్యత గల జర్నలిస్ట్ గా (పూర్వాశ్రమంలో) కొంత పరిశోధించి విశ్లేషించి రాసి, మీ అందరితో పంచుకున్నది మాత్రమే…
. . . . .
1961 లో హిందుస్తాన్ పోలీమర్స్ పేరుతో విశాఖకు 15 కిలోమీటర్ల దూరంలో నగర పొలిమేరల్లో జనబాహుళ్యానికి ఎంతో దూరంలో బంజారాభూముల్లో నెలకొల్పారు . కాలక్రమంలో ఆ కంపెనీ చేతులు మారుతూ వచ్చింది.
1978 లో యూబీ గ్రూప్ (విజయ మాల్యా సంస్థలు) కి చెందిన మాక్ డోయిల్ లో విలీనం చెంది 1997 వరకు పోలిస్టేరీన్ ని ఉత్పత్తి చేస్తూ వచ్చింది. 1997 లో ఇప్పటి LG పొలిమెర్స్ టేకోవర్ చేస్తూ ఉత్పాదన కొనసాగిస్తోంది.
విశాఖకు గ్యాస్ ఉత్పాదనలు స్టీలు పొలిమెర్స్ కేంద్రాలు కొత్త కాదు. లెక్కకు మించి వున్నాయి. అత్యంత పొల్యూట్ నగరాల్లో విశాఖ కూడా ఒక్కటన్న విషయం మనందరికీ తెలుసు.
అటు నేవల్ బేస్ ఐన ఈస్టర్న్ నావెల్ కమాండ్ కి, ఇంకోపక్క హిందూస్తాన్ షిప్ యార్డ్ కి, మరోపక్క డ్రెజ్జింగ్ కార్పొరేషన్ కంపెనీ, డాక్యార్డ్ కి కూత వేటు దూరంలో వున్న ‘హిందూస్తాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్’ HPCL లో గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా ఆక్సిడెంట్లు జరుగుతూనే వున్నాయి .
క్రోనోలాజిక్ ప్రకారం వెనక్కి వెళితే 2019 లో ఒకసారి గ్యాస్ లీకేజీ జరిగి కనీసం ముగ్గురు తీవ్ర స్థాయిలో ప్రమాదానికి గురిఅయ్యారు.
అలాగే 2017 లో కూడా ప్రమాదం సంభవించింది. కానీ ఆరోజు వారాంతం అవడము, పెద్దఎత్తున వర్షం పడటం వల్ల ప్రాణనష్టం సంభవించలేదు .
ఇక 2013 లో HPCL లోని ఒకానొక రిఫైనరీ పేలి కనీసం 35 మంది చనిపోయారు.
ఇక అన్నిటికంటే భయంకరమైన ప్రమాదం 1997 లోనిది. అదేసంవత్సరం సెప్టెంబర్ 13 న పెట్రోలియం వర్షం కురిసింది. ఈ దుర్ఘటనలో దాదాపు 70 మంది చనిపోయారు. ఆరోజు సంభవించిన గ్యాస్ లీక్ వల్ల అంటుకున్న మంటను ఆర్పడానికి 48 గంటలు పట్టాయి. దీనినే తొంభై దశాబ్దపు అత్యంత భయానక పారిశ్రామిక ప్రమాదంగా కూడా అభివర్ణించారు.
అదే సంవత్సరం నవంబర్లో HPCL పైపులైన్ లీక్ కి ముగ్గురు చనిపోయారు. ఇదిలా ఉంటే …
HPCL వంటి పరిశ్రమలే వున్నచోటనే 1966 లో స్థాపించిన కోరమాండల్ ఫెర్టిలైజర్స్ అనే ఫ్యాక్టరీ లో 1990 ఏప్రిల్ లో గ్యాస్ లీక్ ఐన ఘటన సంభవించింది. (అప్పటి క్యాజువాలిటీ నమోదు వివరాలు తెలియలేదు)
వేసవి అవడం మూలాన ఆరు బయట, మిద్దెల మీద నిద్రపోతోన్న ప్రజానీకం ఒక్కసారి విషవాయువులు పీల్చి పెద్ద ఎత్తున అస్వస్థతకు గురి అవ్వడం, కొందరిని చికిత్స మేరకు KGH కి తరలించడం రిపోర్ట్ అయింది.
అలాగే విశాఖ ఉక్కు కర్మాగారంలో లెక్కకు మించిన బాయిలర్ ప్రమాదాలున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రతినిత్యం ఆయా కర్మాగారాలకు అవసరమయ్యే ముడిసరుకు పొటాషియమ్ సల్ఫేట్ అలాగే సామాన్య మానవులకు ఏమాత్రం సంబంధంలేని ఎన్నో తదితర రసాయనాలు హార్బర్ నుండి అన్లోడ్ అయ్యి వెలుపల మైదానంలో కన్వేయర్ బెల్టుల వద్ద రాశులుగా పోసిఉంటాయి .
ఇవే ముడి రసాయనాలు గాలికి ఎగురుతూ అటుగా ప్రయాణిస్తున్న సామాన్యుల ఊపిరిలోకి వెళ్లడం శరీరం పైన పూతగా పేరుకోవడం కద్దు.
1960 లలోనే స్థాపించిన ఈ ఫ్యాక్టరీలలో 60 నుండి 85 వరకు ఎటువంటి ప్రమాదాలు సంభవించిన లేదా, ఆ ప్రమాదాల వల్ల సామాన్యులు చనిపోయిన దాఖలాలు రిపోర్ట్స్ ఐతే తెలియలేదు .
అంటే తొంబైలకు ముందు ఆయా ప్రదేశాలలో సామాన్య మానవులు నివాసాలకు గాను కాలనీలు నిర్మించుకోలేదు. అందువల్లనే ఒకవేళ ప్రమాదవశాత్తు గ్యాస్ లీకులు సంభవించినా ఐదు కిలోమీటర్ల రేడియస్ లో జనజీవనం లేదు కాబట్టి మరణాలు రిపోర్ట్ కాలేదు. మరి ఇప్పుడెందుకు ఇలా వందల్లో మరణాలుంటున్నాయి…
గ్రౌండ్ రిపోర్ట్ ఇలావుంటే … అసలు ప్రజల మధ్యలో ఈ కర్మాగారాలేంటి ? అక్కడినుండి తరలించండి అనే కొత్త వాదన కొందరు మేధావులు లేవనెత్తారు.
ప్రజల మధ్యన ఎక్కడున్నాయి ఈ కర్మాగారాలు ఫ్యాక్టరీలు .
విశాఖ గాని ఇతర నగరాలు గానీ ఇంత అభివృద్ధి చెందక ముందే పట్టణానికి అత్యంత దూరంలో ఇండస్ట్రియల్ వాడలకు అనుమతి ఇచ్చిన మాట ఎవరైనా గుర్తుంచుకున్నారా.
నగరీకరణ అర్బనైజేషన్ అభివృద్ధి అంటూ లేనిపోని విధానాలతో, ప్రమాణాలను ఆంక్షలను తుంగలో తొక్కి తాము అప్పనంగా కబ్జాకావించిన బంజరు భూములను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే తోలుబొమ్మ సంస్థలతో layouts వేయించుకొని కోట్లాది రూపాయలు కూడబెట్టి కుబేరులయింది ఎవరు. ఈ రాజకీయ నాయకులు కారా?!
అన్నేసి ఫ్యాక్టరీలున్న ఆ పట్టణాన్ని పెంచుకుంటూ పోయి అర్బనైస్ అంటూ కాలనీలుగా వృద్ధి చేసి ప్రజలని ప్రమాదపు కోరల్లోకి కూరింది ఎవరు…?
షిప్యార్డ్ పరిసరాల్లో కాలనీలు లేపింది ఎవరు.
ఆటోనగర్ చుట్టూ lay అవుట్లేసి లక్షల్లోకి రేట్లు పెంచిందెవరు. నిర్మానుష్యంగా తన పనేదో తను చేసుకునే BHPV ప్లాంట్ దగ్గర, స్టీల్ ప్లాంట్ దగ్గర Colony లేఅవుట్లకు అనుమతి ఇచ్చి పబ్బం గడుపుకున్నది ఎవరు. సెజ్ జోన్ లో సైతం గేటెడ్ కమ్యూనిటీలంటూ పర్మిషను ఇచ్చి సామాన్యులను ప్రమాదాల ఊబిలోకి తోసిందెవరు.
చివరికి నిన్నకాక మొన్న ఫార్మా జోన్ అంటూ అత్యంత జనసాంద్రత కలిగిన ఆరిలోవ సింహాచలం బెల్ట్ లో ఫార్మ్ సెజ్ పెట్టి పచ్చని పర్యావరణాన్ని, స్వచ్ఛమైన భూగర్భ జలాన్ని కలుషితం చెయ్యడానికి పునాది వేసింది ఎవరు. ఈ రాజకీయనాయకులు కారా.
ఇప్పుడు వీళ్ళా.. ప్రజలు వారి రక్షణ అంటూ శాంతి వచనాలు పలుకుతోంది.
ఇండస్ట్రీస్ అవసరమే !
ప్రజల అభివృద్ధికి ఆటంకాలుగా మారింది ఎవరు.
ప్రమాదకర ఫ్యాక్టరీస్ నడుమ ఇళ్లను నిర్మించుకునే అభివృద్ధి ఎవరి కోసం.
ఇప్పటికైనా ప్రజలు … అంటే .. మనం మేల్కో లేకపోతే నాయకులూ తమ బొక్కసాలు మన శవాలమీద నడుచుకుంటూ వెళ్లి నింపుకుంటారు….
Share this Article