.
పదవీ విరమణ బకాయిలు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఏప్రిల్ 9ని తుది గడువుగా హైకోర్టు నిర్ధారించింది … గత ఆరు నెలలుగా పలుమార్లు వాయిదాలు వేస్తూ సుదీర్ఘ విరామం ఇచ్చిన తర్వాత.., పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులందరి బకాయిలను చెల్లించడానికి తెలంగాణ హైకోర్టు చివరకు ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీని తుది గడువుగా నిర్ధారించింది…
సోమవారం సాయంత్రం ఈ ఉత్తర్వులను వెలువరిస్తూ, తుది గడువుపై ప్రభుత్వం ఇచ్చిన తాజా హామీని పాటించడంలో విఫలమైతే, ఈ విషయం కోర్టు ముందుకు వచ్చినప్పుడల్లా రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుందని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తెలిపారు.
Ads
అంతకుముందు సోమవారం ఉదయం, వేలాది మంది పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను చెల్లించాలన్న కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడంలో విఫలమైనందున, ఆర్థిక కార్యదర్శి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్లీడర్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ రావు తిరస్కరించారు.
తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం పోరాడుతున్న డజన్ల కొద్దీ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల తరఫు న్యాయ సలహాదారు సి.ఆర్. సుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం…, సోమవారం కోర్టు తన సెషన్ను ముగించేలోపు ఆర్థిక కార్యదర్శి తప్పనిసరిగా హాజరు కావాలని న్యాయమూర్తి పట్టుబట్టారు. ఆర్థిక కార్యదర్శి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్న ప్రభుత్వ ప్లీడర్, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఆర్థిక కార్యదర్శి తీరిక లేకుండా ఉన్నారని పేర్కొంటూ వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరారు.
విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు తమ కష్టార్జితాన్ని చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న విపరీతమైన జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, తమ డబ్బు అందక తీవ్ర మనోవేదనకు గురై 80 మందికి పైగా విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు ఉన్నాయని పేర్కొన్నారు.
గత రెండేళ్లుగా వేలాది మంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, జీపీఎఫ్, కమ్యుటేషన్, గ్రాట్యుటీ, ఆర్జిత సెలవు, సరెండర్ సెలవు, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి తమ పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై స్పందిస్తూ, బకాయిలను కొన్ని వారాల్లోగా, ప్రధానంగా ఆరు నుంచి పది వారాల్లోగా చెల్లించాలని తెలంగాణ హైకోర్టు గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే, హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించడంలో విఫలమవడంతో, ఆర్థిక కార్యదర్శితో సహా ప్రభుత్వ ప్రతినిధులను కోర్టు ధిక్కరణ చట్టంలోని నిబంధనల కింద శిక్షించాలని కోరుతూ వందలాది మంది పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారని న్యాయ సలహాదారు సి.ఆర్. సుకుమార్ తెలిపారు.
కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసి ఆరు నెలలకు పైగా గడిచినా, ప్రభుత్వ ప్రతినిధులకు ధిక్కరణ నోటీసులు జారీ చేసినప్పటికీ, ప్రభుత్వ ప్లీడరు గత ఆరు నెలలుగా కోర్టు ఆదేశాలను పాటించేందుకు సమయం కావాలంటూ వాయిదాలు కోరుతూనే వచ్చారు; కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
తన ఆదేశాలను పాటించకపోవడం పట్ల, అలాగే కోర్టు ధిక్కరణ నోటీసులకు స్పందించకపోవడం పట్ల ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, గత విచారణ సందర్భంగా “ఫారం-1” నోటీసులను జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించడంలో విఫలమవడానికి గల కారణాలపై వివరణ ఇచ్చేందుకు ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.
చివరగా, సోమవారం సాయంత్రం కోర్టు ఆనాటి విచారణను ముగించడానికి కొద్ది నిమిషాల ముందు, ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆన్లైన్ ద్వారా హైకోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు గనుక పట్టుబడితే, ప్రభుత్వం తన ఇతర ప్రాధాన్యతలను పక్కన పెట్టి, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలన్నింటినీ మార్చి 31 నాటికి పూర్తిగా చెల్లిస్తామని ఆయన కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే, ఈ బకాయిలను చెల్లించడానికి మరో 30 రోజుల సమయం ఇస్తే ప్రభుత్వానికి మరింత సౌకర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
న్యాయవాది సి.ఆర్. సుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం…, మొత్తం 3,656 మంది పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఉన్నాయని ఆర్థిక కార్యదర్శి సుల్తానియా కోర్టుకు నివేదించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇప్పటివరకు 1,056 మంది ఉద్యోగుల బకాయిలను చెల్లించిందని, ప్రస్తుతం మరో 2,600 మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయని ఆయన వివరించారు.
బకాయిల చెల్లింపు కోసం ఆర్థిక కార్యదర్శి కోరినట్లుగా 30 రోజుల సమయం ఇవ్వడానికి నిరాకరించిన న్యాయమూర్తి నామవరపు రాజేశ్వరరావు, తెలంగాణ ప్రభుత్వం పదవీ విరమణ బకాయిలను చెల్లించడానికి ఏప్రిల్ 9వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. “లేదంటే, ఈ కేసులు విచారణకు వచ్చిన ప్రతిసారీ ఆర్థిక కార్యదర్శి స్వయంగా కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంటుంది,” అని న్యాయమూర్తి రాజేశ్వరరావు స్పష్టం చేశారు;
దీనికి ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కట్టుబడి ఉంటానని అంగీకరించారు. “అది వారి సొంత డబ్బు. ఏప్రిల్ 9 నాటికి పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆ శుభవార్తను తెలియజేయండి,” అని న్యాయమూర్తి రాజేశ్వరరావు ఆదేశించారు.
Share this Article