.అన్నీ నిజాలే… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసినవన్నీ నిజాలే… కానీ అన్నీ రాస్తూ ఎక్కడో దారితప్పి, తనకు అలవాటైన జగన్ వ్యతిరేక మార్గంలోకి వెళ్లిపోతాడు తెలియకుండానే…ఇప్పటికిప్పుడు జగన్ అనే కేరక్టర్ లోకంలో లేకుండా పోతే ఎంత బాగుండు, జైలులో మళ్లీ కుక్కి, బయటికి రాకుండా శాస్తి జరిగితే బాగుండు అన్నంత కసికసిగా సాగిపోతుంటాయి రాతలు…ఎస్, కేసీయార్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పేరిట సాగిన ఓ అరాచకం బహుశా ఏ రాష్ట్రంలో మునుపెన్నడూ జరిగి ఉండదు… పైగా గూఢచార వ్యవస్థ ఉంటే తప్పేంది..? పోలీసులు ఏం చేసి సమాచారం రాబడతారో వాళ్ల ఇష్టం, నాకు సమాచారం కావాలి, అంతే అని కేసీయార్ ఎదురు దబాయిస్తాడు… వితండవాదం…నిజమే, గూఢచర్యం ఏ రాజ్యానికైనా అవసరమే… కానీ మనకు కొన్ని నిర్దిష్ట చట్టాలున్నాయి, దాన్ని దాటేసి వ్యక్తుల జీవితాల్లోకి, గోప్యతలోకి జొరబడటం చట్టరీత్యా నేరం… అన్నింటికీ మించి ఆ ఫోన్ల ట్యాపింగు ద్వారా ట్యాపింగ్ టీమ్ చేసిన దారుణాలు కోకొల్లలు…వ్యాపారులు, సెలబ్రిటీలు, ధనికుల ఫోన్లు విని, వినిపించి బ్లాక్ మెయిల్ చేసి… సమాజం మీద రాక్షసగణంలా విరుచుకుపడ్డ తీరు మీద ముఖ్యమంత్రిగా కేసీయార్కు ఏ బాధ్యతా లేదా..? పాలకుడికి సంబంధం లేదా..? సో, లీగల్లీ, మోరల్లీ, పొలిటికల్లీ… సొసైటీకే వ్యతిరేకం ఇదంతా…మీడియా, పార్టీలే కాదు, జడ్జిల ఫోన్లు కూడా… తెలంగాణవాళ్లవే కాదు, ఏపీలోకీ జొరబడి… 40 వేల ఫోన్లు అని రీసెంటుగా ఏదో పత్రికలో వార్త…!! ఐతే ఆధారాలు దొరుకుతాయా..? చాలావరకు ధ్వంసం చేశారు… నిందితులు సహకరిస్తారా..? నెవ్వర్, నొటోరియస్ పోలీస్ అధికారులు మన దర్యాప్తులు, విచారణల తీరులోని బొక్కలన్నీ తెలుసు, సహకరించరు… ఆధారాలు దొరికినా కేసీయార్ను శిక్షించే స్థాయిలో రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తాడా..?చంద్రబాబును అరెస్టు చేసి జగన్ తప్పు చేశాడనీ, నష్టపోయాడనీ ఓ అభిప్రాయం ఉంది కదా… ఆ దిశలోనే కేటీయార్ను అరెస్టు చేయకుండా రేవంత్ రెడ్డి వెనుకాడుతున్నాడట… ఇక కేసీయార్ను అరెస్టు చేస్తాడా..? తన అరెస్టుకు ప్రతీకారం తీర్చుకుంటాడా..,? వేచి చూడాల్సిందే… తప్పు జరిగింది నిజం, నేరం నిజం… కానీ పడాల్సిన శిక్ష నిజం అవుతుందా..?ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటంటే..? నిజమే, జగన్- కేసీయార్ బంధం షర్మిల చెప్పినట్టు రక్తబంధంకన్నా గాఢం, చిక్కదనం… జగన్ కోసం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపీ వ్యక్తులు, నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించాడు కేసీయార్… ఎందుకు..?మిత్రధర్మం… నేనెలాగూ దున్నేస్తున్నాను, నువ్వూ ఉపయోగించుకో ఈ అరాచక ట్యాపింగ్ వ్యవస్థను అన్నట్టుగా… జగన్కు కావల్సిన సమాచారాన్ని ట్యాప్ చేసి ఇచ్చాడు… కానీ రాధాకృష్ణ ఏమంటున్నాడు..? ఒకవేళ కేసీయార్ ఇరుక్కుంటే జగన్ ఇరుక్కుంటాడు అని… తన కోరిక అది… అంతే…
కేసీయార్ ముఖ్యమంత్రి హోదాలో ఓ ట్యాపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, అరాచకానికి దాన్ని ఓ టూల్లాగా వాడుకుంటే, ఆధారాలు దొరికితే తను నేరస్థుడు అవుతాడు… కానీ జగన్కు నేరుగా, ప్రత్యక్షంగా ఎలా సంబంధం ఉంటుంది..? తను ఆదేశిస్తే తెలంగాణ ట్యాపింగ్ టీమ్ పనిచేయదు కదా..? తనకు ఆ అధికారమూ లేదు కదా… మరి ఎలా ‘ట్రాప్’ వేసి ఇరికిస్తారు తనను..? లీగల్గా అదెలా సాధ్యం..? హేమిటో, రాధాకృష్ణకే తెలియాలి…
ఐతే వ్యాసంలో తను రాసినట్టు జగన్ వర్గీయుల రప్పా రఫ్పా నరుకుతాం అనే భాష, దానికి జగన్ సమర్థన, బెట్టింగుల్లో ప్రాణం పోయిన వ్యక్తి విగ్రహానికి ఆవిష్కరణ అన్నీ తప్పే… రాధాకృష్ణ రాసిన ప్రతి అక్షరమూ నిజమే… చివరకు అలాంటి వ్యక్తులకూ విగ్రహాలు అనేది తెలుగు సమాజం చేసుకున్న ఖర్మ, అంతే… అవునూ, అదే రప్పా రప్పా భాష హరీష్ రావు వర్గీయుల నుంచి కూడా ప్లకార్డులుగా వినిపించింది కదా, మరి అదెందుకు తమరి వ్యాసంలో కనిపించలేదు మహాశయా..? జగన్, కేసీయార్ రెండు క్యాంపులూ సేమ్ షేమ్ కదా..!!
Share this Article
Ads