.
చిక్కీ..! దాన్నే తెలంగాణలో పల్లీపట్టి అంటాం… అత్యంత బలవర్ధకమైన క్యాండీ… ఇప్పుడు దీని గురించి కాస్త చెప్పుకోవాలి మనం… ఎందుకంటే..? ఇందిరమ్మ అమృతం పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభిస్తోంది… ఇంట్రస్టింగు…
దీని ఉద్దేశం ఏమిటంటే..? రాష్ట్రంలోని 14 -18 ఏళ్ల వయస్సున్న కౌమార బాలికలకు రోజుకు ఒక చిక్కీ చొప్పున అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తారు… అబ్బే, ఏముంది ఇందులో..? ఇదొక పథకమా..? రోజుకొక చిక్కీ బాలికలు కొనుక్కోలేరా అనేది కాదు ఇక్కడ ముఖ్యం…
Ads
బాలికల్లో రక్తహీనత సమస్యను సమాజంలో చర్చనీయాంశం చేయడం, దానిపై దృష్టి కేంద్రీకృతం చేయడం… పౌష్టికాహారం, బాలికా ఆరోగ్యం ప్రాధాన్యం చెప్పడం… పిల్లలు, అందులోనూ బాలికలు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుతారు… ఆరోగ్యం, చదువు రెండూ ఆత్మవిశ్వాసాన్నిస్తాయి…
ఈ చిక్కీలు ఒక్కొక్కటీ 500- 600 కిలోకేలరీల శక్తినిస్తాయి… 15 గ్రాముల ప్రొటీన్, 25 గ్రాముల ఫ్యాట్, 60 గ్రాముల కార్బోహెడ్రేట్లు, 40 గ్రాముల సుగర్, 2 గ్రాముల ఫైబర్… పర్ఫెక్ట్ హెల్తీ క్యాండీ ఇది… కాకపోతే ఇప్పుడు తృణధాన్యాలతో కూడిన చిక్కీ ప్లాన్ చేశారు… అదింకా బెటర్…
రోజుకు ఒకటి… ఒకేసారి 15 ఇస్తారు… ప్రస్తుతం కొత్తగూడెం, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు… నిజానికి ఇంకా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి రాష్ట్రమంతా ఒకేసారి ప్రారంభిస్తే బెటర్… తక్కువ ఖర్చుతో కౌమార బాలికలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే స్కీమ్ కాబట్టి…
బాలికలకే ఎందుకు అంటే..? జాతీయ కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ కౌమార బాలికల్లో (ఇదే కీలక దశ) ఏకంగా 64.7 శాతం రక్తహీనత ఉంది… ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరీ ఎక్కువ… మంత్రి సీతక్క చొరవతో ఈ స్కీమ్ రూపొందించినట్టు చెబుతున్నారు… గుడ్…
ఇక్కడ కొన్ని సందేహాలు… అవి వాళ్లకే అందుతాయా..? రోజుకు ఒకటే తింటారా..? ఇంట్లో పిల్లలందరూ ఒకేసారి తినేస్తారు కదా..? ఎవరు తింటేనేం..? మన పిల్లలకే కదా శక్తి, ఆరోగ్యం…
ప్రతి పథకానికీ ఇందిర, రాజీవ్ పేర్లు అవసరమా..? ఇదొక ప్రశ్న… అది కాంగ్రెస్ పార్టీకి తప్పదు… సోనియా కుటుంబం పట్ల అది ఒకరకం విధేయతా ప్రకటన… ఏదో ఓ పేరు… నేములోనేముంది..? మరొకటీ చెప్పుకోవాలి…
ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్నాటకలో కూడా ఇలాంటి స్కీమ్ ఉండేది… పల్లీ పట్టిలు… కానీ రీసెంటుగా (మొన్నటి ఫిబ్రవరి) దీన్ని ఎత్తేశారు… ఆ విద్యా శాఖ అన్శాచురేటెడ్ ఫ్యాట్స్, హై సుగర్, స్టోరేజీ సమస్య, ఎక్స్పైరీ గడువు వంటి ఏవో కుంటిసాకులు చెప్పింది… కౌమార బాలికలకు, బాలురకు ఎక్కువ సుగర్ క్యాండీ ఇస్తే వచ్చే నష్టమేమిటి..?
వీటి బదులు మధ్యాహ్న భోజనంలోనే గుడ్డు, వెజిటేరియన్లయితే ఆరటిపండు ఇవ్వాలని ఆదేశించింది… (మహారాష్ట్ర వంటి ఒకటీరెండు రాష్ట్రాల్లో పల్లీ పట్టి స్కీమ్ అమల్లో ఉంది)… ఇదుగో ఇందుకే ఈ స్కీమ్ మీద రాయాలనిపించింది…
ఆ ప్రభుత్వం రద్దు, ఈ ప్రభుత్వం స్టార్ట్… సో, ఇవి మిల్లెట్ చిక్కీలు కాబట్టి ఎంచక్కా రాష్ట్రమంతా ఏ సందేహాలు, సాకులు చెప్పుకుండా అమలు చేస్తే రాబోయే తరాలకు ఆరోగ్యమే కదా… నిష్ప్రయోజనకరమైన పలు పథకాలతో పోలిస్తే… పేదల, పిల్లల కడుపులు నింపే ఏ పథకమైనా మంచిదే…
ఎవరు తిన్నా సరే… రక్తహీనతకు చవక రెమెడీ ఇది… పైగా తక్కువ ఖర్చుతో అమలు చేయగలిగిన ఆరోగ్య పథకం… బాలల సమాజానికి హీమోగ్లోబిన్ ఎక్కించే స్కీమ్ ఇది… హైదరాబాదులో నిర్వహించే ఏదైనా ఓ పెద్ద అధికారిక కార్యక్రమానికయ్యే ఖర్చు సరిపోతుంది దీనికి… అట్టహాసాలు, ఆడంబరాల ప్రోగ్రాములకన్నా పిల్లల కడుపులు నింపే కార్యక్రమం ఎన్నోవిధాల మేలు కదా…
అన్నట్టు ప్రభుత్వానికి ఓ సూచన… ఇవే కాదు… ఈ దశలోనే ఆడపిల్లలకు రుతుక్రమం, వ్యక్తిగత పారిశుధ్యం, జాగ్రత్తల గురించీ అవగాహన అవసరం… శానిటరీ ప్యాడ్స్ గురించీ ఆలోచించాలి… పెద్ద ఖర్చు కాదు, కానీ దాని ఉపయోగం ఏమిటో ఆడవాళ్లకు బాగా తెలుసు… బాధితులు కాబట్టి..!!
Share this Article