Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ ఫేమస్ గుడి… ఓ హైకోర్టు జడ్జి… సగటు భక్తుడిగా వెళ్లి నిర్ఘాంతపోయి…

December 20, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి ….. సోమవారం, డిసెంబర్ 19, 2022, చెన్నై వడపళని దండాయుధపాణి గుడి ! చెన్నై హై కోర్టు న్యాయమూర్తికి అవమానం !చెన్నై హైకోర్ట్ న్యాయమూర్తి S.M. సుబ్రహ్మణియన్ [Justice S.M. Subramaniam of the Madras High Court] డిసెంబర్ 17, శనివారం రోజున చెన్నై లోని వడపళని మురుగన్ టెంపుల్ [సుబ్రహ్మణ్య స్వామి గుడి ] ని సందర్శించారు. సుబ్రహ్మణియన్ తన భార్య మరియు కూతురు తో కలిసి తన గుర్తింపు ఏమిటో తెలపకుండా సామాన్య భక్తుడిగా దండాయుధపాణి గుడికి వెళ్లారు దర్శనం కోసం.

గుళ్ళో ప్రత్యేక దర్శనం టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గరికి వెళ్ళి మూడు స్పెషల్ దర్శనం టికెట్లు కావాలని అడిగి డబ్బులు ఇచ్చారు. కానీ ఆ కౌంటర్ లో ఉన్న దేవాలయ ఉద్యోగి [మహిళ ] రెండు 50/- టికెట్లు మరియు మరో 5/- టికెట్ ఇచ్చింది కానీ 150/- తీసుకుంది. ఇదేమీటని జడ్జి గారు అడగగా 5 రూపాయాల టికెట్ ని వెనక్కి తీసుకొని 50 రూపాయాల టికెట్ ని ఇచ్చింది. అడగకపోతే 45 రూపాయలు సదరు ఉద్యోగి జేబులోకి వెళ్లిపోయేవి.

సుబ్రహ్మణియన్ ఇతర భక్తులకి జారీ చేసే టిక్కెట్లని పరిశీలించగా 50 టికెట్ కి బదులు 5 టికెట్లు ఇస్తున్నారు దేవాలయ సిబ్బంది. వెంటనే సుబ్రహ్మణియన్ దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ దగ్గరికి వెళ్లారు కంప్లయింట్ చేయడానికి కానీ ఆఫీసులో EO లేరు. దాంతో EO గారి మొబైల్ నంబర్ ఇవ్వమని అక్కడ ఉన్న ఉద్యోగులని అడగగా సదరు EO నంబర్ ఇవ్వకూడదని బదులు ఇచ్చారు. మీరు ఏదన్నా కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటే మాకు ఇస్తే మేము EO వచ్చిన తరువాత ఇస్తామని, అంతే కానీ EO నంబర్ ఇవ్వడం కుదరదు అంటూ దురుసుగా సమాధానం ఇచ్చారు దేవాలయ ఉద్యోగులు.

Ads

ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగలేదని, దేని కోసం EO కి ఫిర్యాదు చేస్తావు అంటూ చాలా రూడ్ గా ప్రవర్తించారు దేవాలయ సిబ్బంది. పరిస్థితి చూస్తే గుళ్ళో నుండి సుబ్రహ్మణియన్ బలవంతంగా బయటికి నెట్టివేసే అవకాశం కనిపించడంతో వెంటనే హై కోర్ట్ రిజిస్ట్రార్ కి ఫోన్ చేసి స్థానిక పోలీసుల సహాయం కావాలని అడిగారు సుబ్రహ్మణియన్.

స్థానిక పోలీసులు దేవాలయానికి చేరుకున్నాక వాళ్ళ ముందు సుబ్రహ్మణియన్ తన గుర్తింపు కార్డుని చూపిస్తూ తాను మద్రాస్ హై కోర్ట్ న్యాయమూర్తిని అని వెల్లడించారు కానీ పోలీసుల ముందే దేవాలయ సూపరిండెంట్ EO నంబర్ ఇవ్వడం కుదరదు అని, కంప్లైంట్ నాకు ఇస్తే నేను EO కి ఇస్తాను అని కరుకుగానే సమాధానం ఇచ్చాడు.

సుబ్రహ్మణియన్ సదరు దండాయుధపాణి ఆలయ EO సోమవారం ఉదయం హైకోర్టులో హాజరు కావాలని, ఈమేరకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలు ఇచ్చి వెళ్లిపోయారు.

సోమవారం రోజున EO మహిళా అధికారి మద్రాస్ హైకోర్టు లో హాజరయ్యారు. సుబ్రహ్మణియన్ సదరు మహిళా EO ని ప్రశ్నిస్తూ దేవాలయంలోని మీ ఆఫీస్ దగ్గర నోటీస్ బోర్డ్ మీద మీ ఫోన్ నంబర్ ఎందుకు లేదు ? అని ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదు EO… చివరకి ముఖ్యమంత్రి ఫోన్ నంబర్ కూడా ఇస్తున్నారు బహిరంగంగా ఏదన్నా ఫిర్యాదులు ఉంటే చెప్పడానికి… అలాంటిది ఒక దేవాలయ EO అయిన మీ ఫోన్ నంబర్ ఎందుకు నోటీస్ బోర్డ్ మీద వ్రాయలేదు ? అని మళ్ళీ ప్రశ్నించగా ఈసారి కూడా ఆమె నుండి ఎలాంటి జవాబు రాలేదు సరికదా మౌనంగా ఉండిపోయారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ P. ముత్తుకుమార్ తో న్యాయమూర్తి సుబ్రహ్మణియన్ మాట్లాడుతూ నేను స్వయంగా కంప్లైంట్ ఇస్తున్నాను, మీరు నా కంప్లైంట్ నేరుగా తమిళనాడు రాష్ట్ర దేవాదాయశాఖ కమీషనర్ కి ఇచ్చి తగిన విధంగా చర్యలు తీసుకోమని చెప్పండి. నిజానికి ఈ కేసుని నేను సుమోటోగా తీసుకొని విచారణకి ఆదేశాలు ఇవ్వగలను కానీ ఆ పని చేయట్లేదు. నేను వ్యక్తిగతంగానే ఫిర్యాదు చేస్తున్నాను, దేవాలయంలో జరుగుతున్న అవినీతి మీద. ఎండోమెంట్ కమీషనర్ తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ముగించారు సుబ్రహ్మణియన్.

ఇంతవరకు జరిగిన విషయం కేవలం తమిళనాడుకే పరిమితం కాదన్న విషయం మనకి తెలిసిందే ! అన్ని దక్షిణాది రాష్ట్రాలలో దేవాలయాలలో జరుగుతున్నది ఇదే ! కాకపోతే మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తి వ్యక్తిగతంగా దర్శనానికి వెళ్ళి ఈ చేదు అనుభవాన్ని రుచి చూశారు. అదే అధికారంగా తాను ఎవరో ముందే చెప్పి ఉంటే అసలు టికెట్లు కొనే అవసరం ఉండేది కాదు. పైగా EO కూడా అదే సమయానికి గుళ్ళో ఉండి అన్ని ఏర్పాట్లు చేసేది.

చెన్నై వడపళని దండాయుధపాణి ఆలయంకి సంబంధించి వందల ఎకరాల భూమి ఉండేది… గతంలో అంటే ద్రవిడ ఉద్యమానికి ముందు అన్నమాట. కానీ తమిళనాడులో ద్రవిడ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన కాలంలో, తరువాత ద్రవిడ పార్టీల ఏలుబడిలో క్రమంగా దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. ప్రస్తుతం వడపళని దండాయుధపాణి ఆలయానికి సంవత్సరానికి 14 కోట్ల రూపాయలు ఆదాయం మాత్రమే వస్తున్నది. ఈ డబ్బంతా రాష్ట్ర దేవాదాయ శాఖకి వెళ్ళిపోతుంది కానీ గుళ్ళో సిబ్బంది అవినీతికి అంతే ఉండదు.

ఇలాంటి విషయాలు దేవాదాయ శాఖ కమీషనర్ కి తెలియవా ? చక్కగా తెలుస్తుంది ఎవరు ఎక్కడ ఎంతంత సంపాదిస్తున్నారో కానీ చర్యలు తీసుకోరు… ఎందుకంటే కింద నుండి పై దాకా ఎవరి వాటాలు వాళ్ళకి వెళతాయి… ఇప్పుడు హై కోర్ట్ న్యాయమూర్తి ఫిర్యాదు చేశారు కాబట్టి కౌంటర్ టికెట్లు ఇచ్చే ఉద్యోగిని సస్పెండ్ చేస్తారు సింపుల్ గా. సదరు హైకోర్టు న్యాయమూర్తి ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే హైకోర్ట్ కి బదిలీ కాగానే సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ అదే ఉద్యోగిని అదే స్థానంలో మళ్ళీ నియమిస్తారు.

టిపికల్ తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన! సుబ్రహ్మణియన్ హై కోర్టు న్యాయమూర్తి అని పోలీసులు వచ్చిన తరువాత బయటపడ్డా సదరు ఆలయ సూపరిండెంట్ ఏ మాత్రం భయపడలేదు సరికదా కంప్లైంట్ నాకు ఇస్తే నేను EO కి ఇస్తాను అన్నాడు తప్పితే అవతల హైకోర్టు న్యాయమూర్తి అన్న భయం లేకుండా ప్రవర్తించాడు. మహా అయితే సస్పెండ్ చేస్తారు, మళ్ళీ కొన్నాళ్ళ తరువాత ద్రవిడ ప్రభుత్వం వాళ్ళని మళ్ళీ అదే స్థానంలో నియమిస్తుంది అనే భరోసా వల్లనే సూపరిండెంట్ అలా ఉండగలిగాడు!

దశాబ్దాలుగా దేవాలయాల మీద పడి తింటున్న వివిధ రాజకీయ పార్టీల నేతల విధానం మార్చగల శక్తి ఆ భగవంతుడికి కూడా లేదేమో ! కేవలం హిందువుల ఆలయాల మీదనే ఈ దాష్టీకం ఎందుకు ? కొద్ది సేపు ఇలాంటి విషయాలమీద మాట్లాడేసుకొని మళ్ళీ మామూలుగా అయిపోతూ ఉండే సగటు మనషులం మనం !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
  • పార్లె జీ బిస్కట్స్… ఈసారి విషాద వార్తల్లోకి… అంతర్జాతీయ ఖ్యాతితో…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions