.
Subramanyam Dogiparthi ….. మహిళలు మెచ్చిన , మహిళలకు నచ్చిన సినిమా . జయసుధ స్వంత సినిమా 1988 లో వచ్చిన ఈ అభినవ సీత సినిమా . 13 కేంద్రాలలో వంద రోజుల పోస్టర్ పడిన దాసరి మార్క్ సినిమా .
ఉత్తర రామాయణంలో మనకు కాంచన సీత పాత్ర వస్తుంది . రాజారాముని రాజ్యంలో ఒక పౌరుడు లంకలో ఉన్న సీతమ్మ శీలం గురించి ఏదో అన్నాడని గర్భవతిగా ఉన్న ఆమెను అడవి పాలు చేసాడు రాముడు .
ఇంతవరకే ఉత్తర రామాయణంలోని కధను ఉపయోగించుకున్నాడు దర్శకుడు దాసరి నారాయణరావు ,
Ads
కధను నేసిన సత్యమూర్తి . మంచి కధ . ఆదేందంటే : శరత్ బాబు , జయసుధ భార్యాభర్తలు . లాయరయిన శరత్ బాబు వద్దకు ఒక మోసగత్తె వచ్చి తన భర్త మీద తప్పుడు కేసు పెడుతుంది . ఆమె మోసగత్తె అని ప్రసాద్ బాబు చెప్పినా వినకుండా శరత్ బాబు ఆమె తరఫున కేసు వాదించి గెలుస్తాడు .
ప్రసాద్ బాబు కక్షను పెంచుకుని జయసుధను కిడ్నాప్ చేసి ఆమెను ఏమీ చేయకుండా వదిలి వేస్తాడు . సమాజమంతా ఆమెను చెడిపోయిన దానిగా గుసగుసలు చెప్పుకుంటారు . ఖిన్నుడయిన శరత్ బాబు తమ్ముడు రఘువరన్ ద్వారా ఆమెను పుట్టింట్లో వదిలివేసే విధంగా చేస్తాడు .
రఘువరన్ ప్రసాద్ బాబు చేత నిజం కక్కిస్తాడు . శరత్ బాబు ఇంటికి రమ్మన్నా జయసుధ రాధ. ప్రసవించి వితంతువుగా ఒక వితంతు శరణాలయంలో ఆశ్రయం పొందుతుంది . కొడుకు సుధాకర్ ప్రసాద్ బాబు కూతురు తులసిని ఒక రాత్రంతా తన రూంలో బంధించి వదులుతాడు . అవమానంతో తులసి ఆత్మహత్య చేసుకుంటుంది .

స్త్రీ లోలుడుగా మారిన కొడుకు మరో అమ్మాయిని మానభంగం చేయబోగా అతడిని చంపేస్తుంది . లాయర్ శరత్ బాబు జడ్జి అవుతాడు . ఈ హత్య కేసు అతని వద్దకే విచారణకు వస్తుంది . ఫ్లాష్ బేక్ లో కధంతా చెప్పబడుతుంది . జడ్జి గారు జయసుధను నిర్దోషిగా తీర్పు ఇస్తాడు . ఉత్తర రామాయణంలో సీతమ్మ భూప్రవేశం చేస్తుంది . ఈ సినిమాలో ఆమె భర్త చేతిలో ప్రాణాలను విడుస్తుంది .
నేసింది సత్యమూర్తే అయినా కధ దాసరి రాసినట్టు అనిపిస్తుంది . మంచి స్కీన్ ప్లేతో , దాసరి మార్క్ నాటకీయతతో సినిమాను బాగా నడిపించారు . డైలాగులను కూడా ఆయనే వ్రాస్తారు కదా ! బాగా వ్రాసారు . అయితే కాంచన సీతగా జయసుధను ఎస్టాబ్లిష్ చేయలేకపోయారేమో అని అనిపిస్తుంది .
సినిమాకు షీరో జయసుధే . గొప్పగా నటించింది . అలాగే శరత్ బాబు , రఘువరన్లు కూడా . ఇతర పాత్రల్లో రావి కొండలరావు , పుష్పలత , వరలక్ష్మి , తులసి , నిర్మలమ్మ , సుత్తి వేలు , శ్రీలక్ష్మి , సాగరిక , మిక్కిలినేని , గుమ్మడి , అల్లు రామలింగయ్య , ప్రసాద్ బాబు , భీమేశ్వరరావు , సుధాకర్ తదితరులు నటించారు .
సత్యం సంగీత దర్శకత్వంలో బేక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది . పాటలు కూడా శ్రావ్యంగా ఉంటాయి . ఏమని చెప్పేను నా అన్న గారి మాట , వినండహో లక్ష్మణుడునై తిరగబడి రామాయణం చెప్పనా , చందమామ రారా జాబిల్లి రారా , యవ్వనమన్నది రానే రాదు మళ్ళీ మళ్ళీ అంటూ సాగుతాయి పాటలు . సి నారాయణరెడ్డి , రాజశ్రీ , జాలాది , దాసరి పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , జేసుదాసు శ్రావ్యంగా పాడారు .
సినిమా యూట్యూబులో ఉంది . చూడతగ్గ సినిమాయే . జయసుధ అభిమానులకు చాలా బాగా నచ్చుతుంది .
నేను పరిచయం చేస్తున్న 1201 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article