.
Subramanyam Dogiparthi ……… యన్టీఆర్- ఏయన్నార్ , కృష్ణ- శోభన్ బాబు . తెలుగు సినిమా రంగంలో రెండు తరాల హీరోలు . ఒకరికి ఒకరు పోటీదారులు . ఆ పోటీ ఎంత తీవ్రం అంటే వాళ్ళు చనిపోయినా వాళ్ళ వీరాభిమానులు ఈరోజుకీ పాత కచ్చల్ని మరచిపోలేదు .
అలాంటి ఈ ద్వయాలు కలిసి ఓ చెరో డజను సినిమాల్లో నటించారు . వాటిల్లో సగం స్టార్లు , సూపర్ స్టార్లు , నటసామ్రాట్లు , నటరత్నలు అయ్యాక నటించినవే .
Ads
ఈ రెండు ద్వయాల తర్వాత వచ్చిన చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లలో ఏ ఇరువురూ కలిసి ప్రధాన పాత్రలలో నటించకపోవటం ఆశ్చర్యమే . హిందీలో కూడా చాలా కాంబినేషన్లు ఉన్నాయి . అగ్ర నటులు కూడా కలిసి నటించారు . అయినా మన నలుగురిని మాత్రం ఎవరు కలపలేకపోయారు .
వీళ్ళను మించిపోయారు వీరి తర్వాత వచ్చిన ప్రభాస్ , మహేష్ బాబు , జూనియర్ యన్టీఆర్ , రాంచరణ్ , అల్లు అర్జున్లు . ఎవరి సామ్రాజ్యాలు వారివే . ఇంక మన సినిమాలోకి వద్దాం .
జయకృష్ణ నిర్మాతగా దాసరి దర్శకత్వంలో వచ్చిన ఈ కృష్ణార్జునులు సినిమా బ్రహ్మాండాలను పగలకొట్టలేదు కానీ బాగానే ఆడింది . కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది . సినిమా చూస్తుంటే వీళ్ళిద్దరు కలిసి నటించిన మంచి మిత్రులు సినిమా గుర్తుకొస్తుంది . ఈ కృష్ణార్జునులు సినిమాలో కూడా కృష్ణ పాత్రలో శోభన్ బాబు మంచబ్బాయి . అర్జున్ పాత్రలో కృష్ణ దొంగబ్బాయి . ఇరువురూ గొప్ప స్నేహితులు .
ఇరువురూ జీవన సాగరంలో తరచూ విబేధిస్తుంటారు , మళ్ళీ మళ్ళీ కలుస్తుంటారు విడిపోలేక . శోభన్ బాబు చెల్లెల్ని కృష్ణ పెళ్ళి కూడా చేసుకుంటాడు . మధ్యలో వీళ్ళిద్దరి మధ్య విలనేశ్వరుడు తగాదాలు పెట్టి ఫైటింగులు కూడా చేపిస్తాడు .
విలన్ కుట్రలను తెలుసుకుని ఇద్దరూ కలిసి విలనేశ్వరుడిని , అతని పుత్రరత్నాన్ని వాయించేస్తారు . సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే విలన్ ఇద్దరి చేతా తన్నులు తినాలి . లేకపోతే ఆయా హీరోల అభిమానులు వెండితెరల్ని చీల్చి చింపేస్తారు .
ఈ సినిమాలో ఇంకో విశేషం ఉంది . శ్రీదేవి , జయప్రదలు వదినామరదళ్ళు . కలిసి మరదలా మరదలా అంటూ ఓ పాట కూడా డాన్సిస్తారు . 1982 మార్చిలో వచ్చిన ఈ సినిమా టైంకు ఇద్దరి మధ్యా ఎండు గడ్డి వేసినా భగ్గుమనేది కాదు . 1982 సెప్టెంబరులో దేవత సినిమా వచ్చేటప్పటికి బధ్ధ విరోధులు అయిపోయారు .
ఆ సినిమా షూటింగుకు వీళ్ళిద్దరి సీన్ల షూటింగుకు తాను ఎన్ని అష్టకష్టాలు పడ్డాడో రాఘవేంద్రుడు ఓ ఇంటర్వ్యూలో వివరించారు . అంత పెద్ద దర్శకేంద్రుడే అన్ని అష్టకష్టాలు పడ్డాడు . కానీ , ఈ సినిమాలో అందంలో , హుషారు నటనలో , డాన్సించటంలో ఆరోగ్యకరంగా పోటీ పడ్డారు .
వీరిరువురూ ఎంత ఆహ్లాదకరంగా నటించారో అంతే ఆహ్లాదకరంగా కృష్ణ- శోభన్ బాబులు కూడా నటించారు . దాసరి కూడా ఇద్దరినీ చక్కగా అందంగా చూపారు . ఎప్పటిలాగే కధ , స్క్రీన్ ప్లే , డైలాగులు అన్నీ ఆయనే . అంతే కాదు ; సినిమాలో ఓ సీన్లో ఎర్ర నారాయణమూర్తి కనిపిస్తాడు . ఓ అయిదారు డైలాగులు ఉంటాయి . ఆ డబ్బింగ్ కూడా ఎందుకనో మరి దాసరే చెప్పినట్లుగా ఉంది .
మొత్తం మీద ఓ చక్కటి ఎంటర్టైనర్ . సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . చిత్రీకరణ చాలా బాగుంటుంది . సి నారాయణరెడ్డి వ్రాసిన మరదలా మరదలా అనే పాట నాకు బాగా నచ్చింది . వరకట్నం సినిమాలో మరదలా మరదలా తమ్ముడి పెళ్ళామా అంటూ సాగే సావిత్రి , కృష్ణకుమారిల పాట గుర్తుకొస్తుంది . అందులో ఉన్నంత సరసం ఈ పాటలో ఉండదనుకోండి .
మంచుకొండల్లోన ఎండ కాచినట్లు , సుందర బృందావనిలో డ్యూయెట్లు రెండు జంటలవీ చాలా బాగుంటాయి . రెండూ వేటూరయ్యే వ్రాసారు . దాసరి వ్రాసిన మేమే కృష్ణార్జునులం అంటూ సాగే పాట కృష్ణ- శోభన్ బాబుల మీద ఇద్దరి హీరోల అభిమానులకు బాగా నచ్చుతుంది . ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు , బంగారు బాలపిచ్చుకా పాటలు కూడా బాగానే ఉంటాయి . (అఫ్ కోర్స్, ప్రాసల ప్రయాసలో వెచ్చగుంది పచ్చిక, ముద్దుముచ్చిక వంటి పిచ్చి పదాలు కూడా బోలెడు బాలపిచ్చుకా పాటలో…)
శ్రీదేవి ముక్కు ఆపరేషన్ (రైనోప్లాస్టీ) చేయించుకున్నాక వచ్చిన ఈ సినిమాలో ఆమె ముక్కు మీద విలపించిన వారు ఉన్నారు , సంబరం చేసుకున్న వాళ్ళూ ఉన్నారు . సినిమా వాళ్ళవన్నీ మనవే కదా !!
ఇతర ప్రధాన పాత్రల్లో పుష్పలత , రావు గోపాలరావు , ప్రసాదబాబు , అల్లు రామలింగయ్య , సత్యనారాయణ , కె విజయ ప్రభృతులు నటించారు . ఏ మోహన్ బాబో , గిరిబాబో నటించి తన్నులు తినవలసిన విలన్ కొడుకు పాత్రను ప్రసాద్ బాబుకు రావటం కూడా విశేషమే .
ఇద్దరు లీడింగ్ హీరోలు , ఇద్దరు లీడింగ్ హీరోయిన్లు కలిసి నటించిన మల్టీ స్టారర్ మంచి ఎంటర్టైనరే . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . తరచూ ఏదో ఒక చానల్లో కూడా వస్తూనే ఉంటుంది . A watchable , entertaining , feel good movie without any obscene scenes .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article