Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అశ్విని వైష్ణవ్‌ను ఒక్కసారి సంఘమిత్ర జనరల్ బోగీలో తిప్పాలి..!!

March 26, 2025 by M S R

.

శంకర్‌రావు శెంకేసి (79898 76088)……….  మన దేశంలో ప్రయాణం వేళ తీవ్ర క్రమశిక్షణా రాహిత్యాన్ని, దుర్భర దారిద్ర్యాన్ని కళ్లారా తిలకించాలంటే ఉత్తర- దక్షిణ భారత దేశాల మధ్య రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను చూస్తే సరిపోతుంది.

బెంగుళూరు నుంచి దానాపూర్‌కు సంఘమిత్ర (12295) ఎక్స్‌ప్రెస్‌ అని ఓ రైలు నిత్యం తిరుగుతూ ఉంటుంది. ఏపీ, తెలంగాణలో అనేక స్టేషన్లలో ఈ రైలు ఆగుతూ వెళ్తుంది. వస్తే టైము కంటే ముందే రావడం, లేదంటే సగం రోజు లేటుగా రావడం దీని స్టైల్‌. మన దేశంలో రైలు టైమ్‌ రాకుంటే వార్త కాదు, ఎప్పుడో ఓ సారి టైమ్‌కు వస్తుంది చూడండి… అది చర్చనీయాంశమైన వార్తగా మారిపోతుంది.

Ads

ఇక్కడ సంఘమిత్ర ముచ్చట ఎందుకంటే… ఈ దేశ సగటు ప్రజల జీవన ప్రమాణాలను, జీవనశైలిని దాని జనరల్‌ బోగీల్లోనే చూడాలి. రెండు రోజుల పాటు ప్రయాణించి గమ్యం చేరే ఈ రైలు… ముందు రెండు, వెనుక రెండు జనరల్‌ బోగీలను తగిలించుకొని బయలుదేరుతుంది.

ఎక్కడ నిండిపోతుందో తెలియదు కానీ, ఖమ్మం, వరంగల్‌కు వచ్చే సరికి కాలుపెట్టే సందు లేకుండా ఈ రైలులోని నాలుగు బోగీలూ కిక్కిరిసిపోతాయి. కింద వున్న సీట్లు, పైన బెర్త్‌లు, సైడ్‌ లగేజి సెల్ఫ్‌లు మొత్తం జనంతో నిండిపోతాయి.

కొందరు లుంగీలు, చీరలను ఊయల్లా కట్టుకొని గాలిలో ఊగుతూ, తూగుతూ నిద్రిస్తుంటారు. మరికొందరు దారికి నిలువు, అడ్డంగా దర్జాగా పడుకొని గుర్రు కొడుతుంటారు. టాయిలెట్స్‌ దారులన్నీ ప్రయాణికులతో నిండి, కనీసం అవి ఎక్కడున్నాయో కూడా తెలియకుండా పోతాయి.

మధ్యలో ఏదైనా స్టేషన్‌లో కాస్త సందు చూసుకొని ఎవరైనా కంపార్ట్‌మెంట్‌ లోనికి వెళ్లడానికి ప్రయత్నిస్తే… డోర్స్‌ వద్ద నిల్చున్న వారు చైనా గోడల వలె అడ్డుగా కనిపిస్తారు. అంగీలు విప్పి కొందరు, దుమ్ముకొట్టుకుపోయిన దుస్తులతో మరికొందరు ఈ దేశంలోని దరిద్ర నారాయణులంతా ఇక్కడే వున్నారా.. అన్నట్టుగా దర్శనమిస్తారు.

కాలు పెట్టే ఇంత జాగా కోసం ఈ రైలులో బాహుబ‌లి యుద్ధాలు స‌హ‌జం. దుస్సాహసం చేసి లోనికి దూరితే.. ఇక అంతే సంగతులు. గమ్యం చేరడానికి పట్టే గంట, రెండు గంటల్లోనైనా ఆరోగ్యంగా ఇంటికి చేరగలమా.. అని భీతి కలుగుతుంది.

పాపం వాళ్లనడానికి ఏముంది..? ఉత్తర భారతం నుంచి పొట్ట చేతపట్టుకొని వచ్చే పేదలు వాళ్లు. ఇక్కడ చేసినన్ని రోజులు పని చేసి, ఎంతో కొంత మిగుల్చుకొని కుటుంబాల చెంతకు పరుగు పరుగున వెళ్లే నిర్భాగ్యులు. పూట గడవడమే వారికి పోరాటమైనప్పుడు కట్టూబొట్టూ గురించి వారికి పట్టింపు ఎందుకుంటుంది…? శుచీశుభ్రతపై ఆలోచన ఎందుకుంటుంది…? క్ర‌మ‌శిక్ష‌ణ సోయి ఎందుకుంటుంది..?

ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి నిత్యం బతుకుదెరువు కోసం వేలాదిగా వచ్చే అభాగ్యులను చూస్తుంటే.. వృద్ధి రేట్లు, తలసరి ఆదాయాల్లో పెరుగుదల గురించి ప్రతీ బడ్జెట్‌లో పాలకులు వీనులవిందుగా వినిపించే అంకెలు ఒట్టి రంకెలేనా.. అనే డౌటనుమానం వస్తుంది. ఈ పాల‌కుల‌వి ఒఠ్ఠి ప్ర‌గ‌ల్బాలు క‌దా.. అని కోపం సుర్రుమంటుంది.

ముంబై సబర్బన్‌ రైళ్లలోని రద్దీని మించి ఉత్తర- దక్షిణ భారతం మధ్య రాకపోకలు సాగించే అనేక రైళ్లలోనూ ఇదే పరిస్థితి. జనరల్‌ బోగీల సంఖ్య పెంచాలని వరంగల్‌కు చెందిన డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ అనే సోషల్‌ వర్కర్‌ సుదీర్ఘకాలం పోరాటం చేశారు. ప్రజలతో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయించారు.

ఆయన పోరాటాన్ని మీడియా జాతీయస్థాయిలో ఫోకస్‌ చేసింది. ఆర్నెల్ల క్రితం స్పందించిన రైల్వే శాఖ పలు రైళ్లలో జనరల్‌ బోగీల సంఖ్యను పెంచుతున్నట్టు ప్రకటించింది. కానీ ఎలాంటి మార్పు, ప్రభావం ఉత్తర-దక్షిణ భారతం మధ్య తిరిగే రైళ్లలో కనిపించడం లేదు.

అమృత భారత్‌ కింద వేల కోట్ల వ్యయంతో దేశంలోని 1309 రైల్వే స్టేషన్లను సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తోంది మోదీ సర్కారు. మొన్నటిదాకా కంపుకొట్టే రైల్వే స్టేషన్లు- ఈ మధ్య కాలంలో నయాలుక్‌తో ఔరా.. అని అనిపిస్తున్నాయి.

జనరల్‌ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే వారి కోసం కూడా ఫ్రీ వెయిటింగ్‌ రూమ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఉచిత వైఫైతో ప్రపంచాన్ని ప్రయాణికుల చేతిలోకి చేర్చుతున్నారు. ప్యాసింజర్లను కస్టమర్లుగా మార్చే ప్రయత్నంలో రైల్వే స్టేషన్లలో షాపింగ్‌ స్టోర్స్‌ను సైతం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అధునాతన ఎస్కలేటర్లు, ఎలివేటర్లు, భారీ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు ప్రయాణికుల శారీరక శ్రమను తగ్గిస్తున్నాయి. వందేభార‌త్‌ రైళ్లు, అమృత్‌ భారత్‌ రైళ్లు దూరాన్ని రోజుల నుంచి గంటల్లోకి కుదించాయి.

కానీ సగటు పేదల ప్రయాణాన్ని సుఖవంతం చేయకుండా.. ‘ఇవన్నీ బాగానే వున్నాయి..’ అని ఎలా అనగలం…? రైల్వే ద్వారా రోజుకు రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న పాలకులారా… కృపయా ధ్యాన్‌సే!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…
  • కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!
  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions