.
John Kora...
పటౌడీ ట్రోఫీ పేరు మార్పు వివాదం… వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ 2025- 27 సైకిల్ ఇప్పటికే ప్రారంభమయ్యింది. బంగ్లాదేశ్- శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్తో కొత్త సైకిల్ మొదలయ్యింది.
ఇక భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనతో ఈ సైకిల్ను ప్రారంభిస్తుంది. శుక్రవారం (జూన్ 20) నుంచి లీడ్స్లోని హెడింగ్లే స్టేడియంలో మొదలయ్యే తొలి టెస్టుతో భారత్, ఇంగ్లాండ్ జట్లు డబ్ల్యూటీసీ పాయింట్ల వేటను ప్రారంభించనున్నాయి.
Ads
అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే వివాదాలు మొదలయ్యాయి. 2007 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ను పటౌడి ట్రోఫీగా పిలుస్తున్నారు. కానీ తాజాగా దీని పేరును పటౌడి ట్రోఫీ నుంచి అండర్సన్- టెండుల్కర్ ట్రోఫీగా మార్చారు. ఇక్కడే అసలు వివాదం మొదలయ్యింది.
భారత్లో క్రికెట్ అభివృద్ధిలో, టీమ్ ఇండియా ఎదుగుదలలో పటౌడి ఫ్యామిలీది కీలక పాత్రగా సీనియర్లు చెబుతుంటారు. ఇద్దరు పటౌడిలను స్మరించుకునేందుకే గతంలో ఈ సిరీస్కు పటౌడీ ట్రోఫీగా నామకరణం చేశారు.
కానీ హఠాత్తుగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) ఈ ట్రోఫీ పేరును అండర్సన్-టెండుల్కర్ ట్రోఫీగా మార్చడంపై సీనియర్ క్రికెటర్ల నుంచి అభిమానులు, ఎనలిస్టుల వరకు మండిపడుతున్నారు. ఈ వివాదంపై నిన్నటి వరకు పెదవి విప్పని టెండుల్కర్ కూడా.. ఈసీబీ, బీసీసీఐతో మాట్లాడినట్టు చెప్పారు.
పటౌడీ లెగసీని కంటిన్యూ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపాడు. కానీ ట్రోఫీ పేరు మార్చమని అడిగినట్లు మాత్రం చెప్పలేదు. అయితే, పటౌడీ ఫ్యామిలీ (సినీ నటుడు సైఫ్అలీ ఖాన్)తో మాట్లాడినట్లు చెప్పాడు. అయితే అంతిమంగా మాత్రం పేరు మార్పుపై టెండుల్కర్ మాత్రం విముఖత వ్యక్తం చేయలేదనే తెలుస్తోంది.
లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ మాత్రం.. భిన్నంగా స్పందించాడు. ‘ఇది కూడా జరిగిందా? క్రికెట్లో ఏదైనా సాధ్యమే’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. పేరు మార్చినంత మాత్రాన ఫీల్డ్లో క్రికెట్ మారదు. క్రికెట్ ఎప్పటికైనా క్రికెట్టే అని అన్నాడు.
సునిల్ గావస్కర్ మాత్రం కాస్త మండిపడ్డాడు. పేరు మార్పు నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించిందని అన్నాడు. పటౌడీ పేరును మార్చడం సబబు కాదని అన్నాడు. క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే కాస్త ఘాటుగా స్పందించాడు. మరో పదేళ్ల తర్వాత దీన్ని రూట్- కోహ్లీ ట్రోఫీగా మారుస్తారా అని ప్రశ్నించాడు.
అయితే ఈ పేరు మార్పుపై ఈసీబీకి అన్ని వైపుల నుంచి ఒత్తిడి, విమర్శలు రావడంతో కొంత సరిదిద్దే ప్రయత్నం చేసింది. అండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ గెలిచే టీమ్ కెప్టెన్ను పటౌడీ మెడల్ ఆఫ్ ఎక్సలెన్సీని అందిస్తామని ప్రకటించింది.
వాస్తవానికి పటౌడీ ట్రోఫీ అనేది ఇంగ్లాండ్ గడ్డపై ఇండియాతో ఆడే టెస్టు సిరీస్కు మాత్రమే వర్తిస్తుంది. దీనికి బీసీసీఐకి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ విషయంలో బీసీసీఐ కూడా ఈసీబీపై ఒత్తిడి తేవడంతో చివరకు మెడల్కు పటౌడీ పేరును పెడుతున్నట్లు ప్రకటించింది.
ఎవరీ పటౌడీ?
భారత క్రికెట్ జట్టు తరపున ఇద్దరు పటౌడీలు ఆడారు. నవాబ్ మహ్మద్ ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ 1910 మార్చ్ 16న జన్మించాడు. 1932 నుంచి 1946 మధ్యలో ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ టెస్టు క్రికెట్ ఆడాడు. 1932-1934 మధ్య ఇంగ్లాండ్ తరపున టెస్టు క్రికెట్ ఆడాడు.
అప్పుడు ఆడిన మూడు టెస్టుల్లోనూ ఇంగ్లాండ్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ తర్వాత టీమ్ ఇండియా తరపున మూడు టెస్టులు ఆడాడు. ఆ సమయంలో కూడా భారత జట్టుకు కెప్టెన్గానే ఉన్నాడు. అయితే 41 ఏళ్ల చిన్న వయసులోనే ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ చనిపోయాడు. ఇండియా, ఇంగ్లాండ్ జట్లకు టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రికెటర్ ఇఫ్తికర్ అలీ ఖాన్.
ఇక పటౌడీ ఏకైక కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తండ్రి వారసత్వాన్ని స్వీకరించాడు. ఇతడినే టైగర్ పటౌడీ అని ముద్దుగా పిలుచుకుంటారు. భారత జట్టు తరపున 1961 నుంచి 1975 వరకు క్రికెట్ ఆడాడు. ససెక్స్, ఢిల్లీ, హైదరాబాద్ జట్ల తరపున డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడాడు. 46 టెస్టులు, 310 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన పటౌడీ.. ఒక అద్భుతమైన బ్యాటర్గా పేరు పొందాడు.
టెస్టుల్లో 6 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు చేశాడు. 203 అతడి అత్యధిక టెస్టు పరుగులు. టెస్టుల్లో టైగర్ పటౌడీ బ్యాటింగ్ యావరేజ్ 88గా ఉందంటే.. ఏ రేంజ్లో ఆడేవాడో అర్థం చేసుకోవచ్చు. కేవలం 21 ఏళ్లకే భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన టైగర్ పటౌడీ.. ఆ కాలంలోనే బెస్ట్ ఫీల్డర్గా.. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్గా పిలవబడ్డాడు. ఈ టైగర్ పటౌడీ కొడుకే సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్… #భాయ్జాన్
Share this Article