.
ఏమో, చాలామంది నెగెటివ్ మైండ్సెట్ అని వ్యతిరేకిస్తారేమో ఒక అభిప్రాయం చెబుతున్నందుకు..! కేంద్ర ప్రభుత్వం ఎంపీ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50 శాతం పెంచడం అనేది సమాజానికి ఏమాత్రం ప్రయోజనహితం కాదు, పైగా నష్టదాయకం కూడా..!
విషయం ఏమిటంటే… అమిత్ షా కేంద్ర ప్రభుత్వ ఆలోచనను, ప్రయత్నాల్ని ఇతర పార్టీల సభ్యులకు చెబుతున్నాడు, పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50 శాతం పెంచడమే కాదు, 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయబోతున్నాం అని…!
Ads
ఈలెక్కన లోకసభ స్థానాలు ఏకంగా 273 పెరిగి 816 మంది ఎంపీలు అవుతారు… రాజ్యసభ సభ్యత్వాలు సరేసరి… అందులో 270 లోకసభ సీట్లు మహిళలకు… అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేల సంఖ్య 4123 నుంచి ఏకంగా 6185కు పెరుగుతాయి… అందులో 2042 మహిళలకు… ఇదంతా ముందస్తు రఫ్ అంచనా…

తెలుగు రాష్ట్రాలకే వస్తే ఏపీ ఎంపీ సీట్లు 25 నుంచి 38కు, అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263 సీట్లకు పెరుగుతాయి, మహిళలకు తమ వాటా మేరకు పెరుగుతాయి… తెలంగాణ అసెంబీ సీట్లు 119 నుంచి 179… భారీ సంఖ్య… తెలంగాణ లోకసభ సీట్లు కూడా 17 నుంచి 26 వరకు పెరుగుతాయి…
జనాభాను బట్టి డీలిమిటేషన్, సీట్ల సంఖ్య పెంపు అని ఇన్నాళ్లూ చెప్పారు… రకరకాల కారణాల చేత జనాభా లెక్కల సేకరణ చాన్నాళ్లుగా వాయిదా పడుతోంది… ఇప్పుడు స్టార్టయింది… అది పూర్తి చేసేసి, డీలిమిటేషన్ కమిటీ వేసి (ఇది తప్పనిసరి) ఈ సీట్ల సంఖ్యను ఫైనల్ చేస్తారని వార్తలు చెబుతున్నాయి… జనాభాను నియంత్రించినందుకు సీట్ల సంఖ్యలో, అంటే ప్రాతినిధ్యంలో కోత పెట్టి శిక్షిస్తారా అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నందున… ఇక అందరికీ 50 శాతం అనే ఓ మధ్యేమార్గాన్ని కేంద్రం ఆలోచిస్తోంది…
(ఇప్పుడిక ప్రాతినిధ్యం పెంపు, కోత సమస్య లేదు కాబట్టి పిల్లల్ని ఎక్కువ కనండి, జనాభా పెంచండి అనే పిలుపుల్ని స్టాలిన్, చంద్రబాబు తదితరులు వదిలేస్తారేమో…) (మగమహారాజుల్ని డిస్టర్బ్ చేయలేక, 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే, ఇలా సీట్లు పెంచి, మహిళలకు ఆ వాటా ఇచ్చేస్తే ఏ పంచాయితీ ఉండదని భావించినట్టున్నారు అని మరో సరదా వాదన…) ఈ రెండు అంశాలూ నాన్ సీరియస్…
ఎస్, మహిళలకు 33 శాతం వాటా అనేది స్వాగతించాల్సిన నిర్ణయం… ఏళ్లుగా ప్రతి ప్రభుత్వం దీన్ని అటక మీద నుంచి తీస్తున్నది లేదు, అమలుకు ప్రయత్నించిందీ లేదు… మోడీ గనుక ఈ పని చేస్తే తనకు బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది, పార్టీకి కూడా… అదే సమయంలో రాజకీయ ప్రాతినిధ్యంలో మహిళలకు న్యాయం చేసినట్టు కూడా అవుతుంది… (ఎటొచ్చీ భర్తల చాటు భార్యలు, తండ్రుల చాటు బిడ్డలుగా గాకుండా సొంత చైతన్యంతో ఉపయోగించుకుంటే బెటర్)… సీట్లు పెరుగుతాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీ సీట్లు పెరిగి, ఆ ప్రాతినిధ్యమూ పెరిగి, సామాజిక న్యాయం మరో మెట్టు ఎక్కుతుంది, గుడ్, అదీ ఆహ్వానించదగిందే…
కానీ స్థూలంగా రాజకీయ నాయకుల వ్యవహార శైలి కోణంలో ఓ లుక్కేస్తే… ప్రజాప్రతినిధుల సేవ ఏపాటి..? వాళ్ల జీతభత్యాలు, ఖర్చులు, వాళ్లకు రక్షణ, వాళ్లకు సమకూర్చే పీఏలు, పీఎస్లు, డ్రైవర్లు, వాహనాలు, నివాసాలు… జనం సొమ్ముకు ఎసరు… పోనీ, ఈ ప్రాతినిధ్యం పెంపు వల్ల సొసైటీకి సమకూరే అదనపు ప్రయోజనం ఏమైనా ఉందా..? ఏమీ ఉండదు…
గెలిచాక ఎవరూ అందుబాటులో ఉండరు… అందరూ అని కాదు గానీ, చాలామంది కబ్జాలు, అక్రమాలు, అవినీతితో పాటు రకరకాల అసాంఘిక, అనైతిక కార్యక్రమాలు… ఎన్ని చూడటం లేదు..? సిట్టింగుల అరాచకాలతో జనంలో వ్యతిరేకత భగ్గుమని, పార్టీలు, నేతలు అందులో కొట్టుకుపోయిన ఉదాహరణలు తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నదే కదా…
ఏ రాష్ట్రం మినహాయింపు కాదు, ఏ ప్రాంతమూ మినహాయింపు కాదు… వైభోగాలు, డబ్బు, పెత్తనాలు… ఎవరి ఏరియాలకు వాళ్లే రాజులు… ఇక సివిల్ సర్వీస్, రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం వాళ్ల అడుగులకు మడుగులొత్తడానికే సరిపోతుంది… ఎంపీల కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు, కుటుంబాల అధికార పటాటోపం చూస్తూనే ఉన్నాం…
చట్టసభల్లో డిస్కషన్లే లేవు, ఎవరూ సరిగ్గా హాజరు కారు, చర్చించరు, సబ్జెక్ట్ నాలెడ్జి తెలిసిందే… పార్ఠీల వైఖరులను బట్టి వోట్లేయడం తప్ప చాలామంది చేసేదేమీ లేదు… మరిక ప్రాతినిధ్యం పెంపు వల్ల సొసైటీకి ప్రయోజనం ఏపాటి..? నాణేనికి మరోవైపు రియాలిటీ ఇదంతా… ఈ డిబేట్ కూడా అవసరమే అనిపిస్తుంది..!!
Share this Article