Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అందరికీ జ్యోస్యాలు చెప్పే పంతులుకు… తన జాతకమే తెలియనట్టుగా…

June 21, 2023 by M S R

Murali Buddha….   దాన వీర కర్ణ ముహూర్తం సూపర్ హిట్… ఎన్టీఆర్ , బాబు ముహూర్తం అట్టర్ ప్లాప్ … ఫలించని జోస్యం… జర్నలిస్ట్ జ్ఞాపకాలు-

——————————————
‘‘ఎన్టీఆర్ గారూ, నేను చెబుతున్నాను, నా మాట వినండి . మీరు సినిమాను సంక్రాంతికి విడుదల చేయండి . సూపర్ హిట్ అవుతుంది అని అతను చెప్పగానే… భలే వారే, ఇంకా పదిహేను రోజులు కూడా లేదు . ఎలా సాధ్యం అని ఎన్టీఆర్ అనుమానం వ్యక్తం చేస్తే , నేను చెబుతున్నాను, ఏమీ కాదు, సంక్రాంతికి నేను ముహూర్తం ఖరారు చేశాను. తరువాత నన్ను అనొద్దు, మీ ఇష్టం’’ ….. ఆ మాటతో ఎన్టీఆర్ సినిమాను సంక్రాంతికి విడుదల చేశారు . ఆ సినిమా ఓ చరిత్ర సృష్టించింది . ఆ సినిమా దాన వీర శూర కర్ణ .
అదే సమయంలో సాంకేతిక విలువలతో కృష్ణ కురుక్షేత్రం సినిమా తీశారు . దాన వీర శూర కర్ణ సినిమా నిజానికి సాంకేతిక అంశాల్లో కురుక్షేత్రం ముందు పేలవంగానే ఉన్నా…, ఎన్టీఆర్ నటన , డైలాగులు , పాటలతో ఒక చరిత్ర సృష్టించింది . ఆ సినిమాకు ముహూర్తం పెట్టింది బివి మోహన్ రెడ్డి . అంతకు ముందే ఎన్టీఆర్ కు బివి మోహన్ రెడ్డి మాట మీద , ముహూర్తం మీద గురి . దాన వీర శూర కర్ణ విజయంతో మోహన్ రెడ్డి మాట మీద మరింత గురి కుదిరింది .
అడవి రాముడు షూటింగ్ నుంచి ఎన్టీఆర్ కర్నూల్ లో ఉన్న బివి మోహన్ రెడ్డికి ఫోన్… ముందు నేను భయపడ్డాను కానీ మీ మాట మీద నమ్మకంతో సంక్రాంతికి విడుదల చేశా , మన సినిమా చరిత్ర సృష్టిస్తోంది అని మెచ్చుకున్నారు . అదొక్కటే కాదు మిత్రులతో సరదాగా మాట్లాడుతూ నామినేట్ పోస్ట్ తీసుకోవలసిన కర్మ నాకెందుకు, పోటీ చేస్తాను, మంత్రిని అవుతాను అని ఐదేళ్ల ముందే మీడియా మిత్రుల ముందు తన గురించి తాను చెప్పుకున్న జోస్యం కూడా నిజమైనది .
జ్యోతిష్కంలో అతనికి తిరుగులేదు అని పేరుంది . . అతని మాటకు తిరుగులేకుండా పోయింది . ఎన్టీఆర్ పక్కన ఆయనకు చోటు పర్మనెంట్ అయిపోయింది . 95లో ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో దించేశాక , ఎన్టీఆర్ మళ్ళీ సీఎం అవుతారు అని జోస్యం చెప్పారు . మరి అయ్యారా ? లేదు, ఏకంగా పైకే పోయారు . ఎవరు ? ఎన్టీఆర్ ….
*****

బివి మోహన్ రెడ్డి కర్నూల్ లో ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నా ప్రముఖ రాజకీయ నాయకులకు సన్నిహితులు . జలగం వెంగళరావు , మర్రి చెన్నారెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు సన్నిహితులు . 1978 లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూల్ జిల్లా రాజకీయాల్లో శేషాద్రి అనే జర్నలిస్ట్  ప్రముఖులు . వారి ఇంట్లోనే రాజకీయ నాయకులు సమావేశం అయి చర్చించుకునేవారు . మర్రి చెన్నారెడ్డి శాసన మండలి సభ్యులను ఖరారు చేశారు . సంతోషమ్మ అనే మహిళను మండలి సభ్యురాలిగా నియమించారు .

అప్పుడు సమితి ప్రెసిడెంట్ గా, తరువాత కోట్ల హయాంలో మండలి సభ్యులుగా పనిచేసిన యస్ . రఘురామిరెడ్డి బివి మోహన్ రెడ్డితో సరదాగా మాట్లాడుతూ మీ మిత్రుడు మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నారు , సంతోషమ్మను కూడా మండలి సభ్యురాలిని చేశారు , మరి నువ్వెప్పుడూ mlc అవుతున్నావు అంటే , మండలి ద్వారా నాకేం కర్మ .. నేరుగా పోటీ చేస్తా , మంత్రిని అవుతాను అని 78లో చెప్పారు , 83లో నిజంగానే పోటీ చేశారు , మంత్రి అయ్యారు .

Ads

1978లో మోహన్ రెడ్డి ఆ మాట చెప్పినప్పుడు అందరూ తేలిగ్గా తీసుకున్నారు . ఐదేళ్ల తరువాత నిజం అయ్యాక అయన చెప్పే జ్యోతిష్యం మీద , ముహూర్తాల మీద గురి కుదిరింది . . . బివి మోహన్ రెడ్డి కర్నూల్ జిల్లాలో ఇంజనీర్ గా పని చేస్తున్నప్పుడు చెప్పిన జ్యోస్యం నీకు ఎలా తెలుసు అని సందేహం కదా ?

మోహన్ రెడ్డి ఇంజనీర్ గా కర్నూల్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు హిందూ రిపోర్టర్ గా అక్కడ దాసు కేశవరావు ఉండేవారు . తరువాత హైదరాబాద్ లో హిందూ బ్యూరో చీఫ్ గా టీడీపీ బీట్ కూడా చూసేవారు . తరువాత రెసిడెంట్ ఎడిటర్ అయ్యారు . మాటల సందర్భంలో మోహన్ రెడ్డి జోస్యం గురించి చెప్పారు . మోహన్ రెడ్డి కూడా నేను చెప్పిన జ్యోస్యం నిజమైంది కావాలంటే కేశవరావును అడగండి అనే వారు .

ఎన్టీఆర్ కు దైవం మీద నమ్మకం ఉండేది కాదు, కానీ మోహన్ రెడ్డి జ్యోతిష్యం మీద మాత్రం అపారమైన నమ్మకం ఉండేది . ఇద్దరి మధ్య బంధం ఎలా ఏర్పడిందో కానీ ఎన్టీఆర్ సినిమా హీరోగా ఉన్నప్పటి నుంచే మోహన్ రెడ్డి జ్యోస్యం మీద మంచి గురి . ఏ కార్యం అయినా మోహన్ రెడ్డి ముహూర్తం పెట్టాల్సిందే …

******

1995 ఆగస్టులో ఎన్టీఆర్ ను దించేసిన తరువాత కూడా దాదాపు 30 మంది శాసన సభ్యులు ఎన్టీఆర్ శిబిరంలోనే ఉండేవారు . వారిలో బివి మోహన్ రెడ్డి ఒకరు . మీడియా పెద్దగా ప్రచారం కల్పించేది కాదు కానీ ఈ 30 మంది రోజూ ఏదో ఒక నిరసన కార్యక్రమం చేపట్టేవారు . ఓ రోజు అసెంబ్లీ గేటు ముందు బైఠాయించి నిరసన కార్యక్రమం . మీడియా ముందు జ్యోస్యం చెబుతున్నాను అని మోహన్ రెడ్డి ప్రకటన . అంతా గుమిగూడిన తరువాత ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు . నేను చెబుతున్నాను , నిజం అయి తీరుతుంది అన్నారు . బాబు వద్ద ఉన్న శాసనసభ్యులు అందరూ వచ్చేస్తారు , మళ్ళీ ఎన్టీఆర్ సీఎం అవుతారు అని చెప్పారు .

ఎన్టీఆర్ మళ్ళీ సీఎం అయ్యే మాట దేవుడెరుగు ఎన్టీయారే చనిపోయారు . శాసనసభ్యులు అందరూ ఎన్టీఆర్ వద్దకు వచ్చేస్తారు అని జ్యోస్యం చెప్పిన మోహన్ రెడ్డి ఎన్టీఆర్ మరణించాక మిగిలిన వారితో కలిసి తానే బాబు శిబిరంలో చేరిపోయారు . మరోసారి మీడియా బలవంతం వల్ల 2004 ఎన్నికల ఫలితాలపై ఎన్టీఆర్ భవన్ లో జోస్యం చెప్పారు . టీడీపీకి అప్పుడు రెండువందల పైగానే సీట్లు వస్తాయని ఏదో అంకె చెప్పారు . టీడీపీ గెలుస్తుంది అని … కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది, టీడీపీ చరిత్రలోనే తక్కువ సీట్లు సాధించింది . అంతకు ముందు ఓడిపోయిన చరిత్ర ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో 2004లోనే టీడీపీకి తక్కువ సీట్ల రికార్డ్ .

****

2004 ఎన్నికలకు రోజులు దగ్గర పడ్డాయి . అసెంబ్లీలో హడావుడి . లాబీలో వెళుతుంటే మోహన్ రెడ్డి ఛాంబర్ . చీఫ్ రిపోర్టర్ చారి నేనూ కలిసి వెళుతున్నాం . మోహన్ రెడ్డి కనిపించగానే… చారి బాబాయ్, ఈ సారి ఎన్నికలు ఎలా ఉంటాయి అని మోహన్ రెడ్డిని అడిగారు . బ్రహ్మాండంగా గెలుస్తాం అని మోహన్ రెడ్డి ధీమాగా చెప్పారు . చీఫ్ రిపోర్టర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నేను మాట్లాడటం ఎందుకులే అని వింటూ ఉండిపోయా .

కొద్దిసేపు మాట్లాడి ఇద్దరం వెళుతుంటే .. మోహన్ రెడ్డి చేయి పట్టి ఛాంబర్ లోకి లాగాడు . ఎన్నికలు ఎలా ఉంటాయని అనుకుంటున్నావు అని మోహన్ రెడ్డి నన్ను అడిగాడు… ఒకింత సంతోషం వేసింది . ఇంతకు ముందు అతనే జోస్యం చెప్పేవాడు, ఇప్పుడు తనే నన్ను అడుగుతున్నారు అనుకొని , బహుశా ఎవరు ఏమనుకున్నా పరవాలేదు అనుకుని… నేను నిర్మొహమాటంగా చెబుతాను అనే ఉద్దేశంతో అడుగుతున్నారేమోలే అనుకుని… 1999 లోనే తృటిలో గెలిచారు , ఈసారి ఓడిపోతారు అని చెప్పాను . మోహన్‌రెడ్డికే జ్యోస్యం చెప్పాను…

ఎన్టీఆర్ అంటే ఓ నమ్మకం ఉండేది .. నేను బాబు వర్గంలో చేరినప్పటి నుంచి మంత్రి పదవి ఇచ్చారు , ఇప్పటికీ మంత్రినే కానీ టికెట్ ఇస్తారా ? ఇవ్వరా ? అనే అనుమానం ఉంది అంటూ ఎన్టీఆర్ కు బాబుకు తేడా చెప్పుకొచ్చారు . 1978లోనే అంత ధీమాగా చెప్పిన మోహన్ రెడ్డి 2004 నాటికి తనకు టికెట్ వస్తుందో రాదో తనకే తెలియని స్థితికి వచ్చారు . అంతా కాల మహిమ అనిపించింది …- – బుద్దా మురళి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!
  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions