*
ఏపీలో కొన్ని టివి ఛానళ్ళు/ వార్తా పత్రికలపై అనధికార నిషేధం…!! టివి ఆపరేటర్లపై ఫ్రభుత్వ ఒత్తిడి..!!
“పత్రిక
వికృతంగా అరుస్తోంది
రాజకీయ కిరీటం ధరించి
ప్రతీకారేచ్ఛతో” (మధు గోలి)
Ads
ఏపిలో టివి (కేబుల్ )పెడితే నాలుగు న్యూస్ ఛానళ్ళు రావడం లేదు అనేకచోట్ల… కారణమేంటని అడిగితే ప్రభుత్వ ఒత్తిడి వల్ల వాటిని తొలిగించినట్లు కేబుల్ ఆపరేటర్ సమాధానం..!!
గత ప్రభుత్వంలో ఏబిఎన్, టివి5, ఈనాడు న్యూస్ ఛానళ్ళపై ఇలాంటి నిషేధమే వుండింది. అయితే గుడ్డిలోమెల్లలా వినియోగదారులెవరైనా అడిగితే మాత్రం ఆ ఛానళ్ళు ఇచ్చారు. ఈ కొత్త ప్రభుత్వంలో
ఈ ఆప్షన్లేదు…
అందువల్ల సర్కారు ఆదేశాల ప్రకారమే కేబుల్ఆపరేటర్లు టీవీ 9, సాక్షి, 10టివీ, ఎన్టీవీ పూర్తిగా తొలగించారు… ఇప్పుడు ఏపీలో కేబుల్ టివి ద్వారా తెలుగు వార్తలు చూడాలంటే ప్రభుత్వం స్పాన్సర్ చేసిన ఈటీవి, ఏబిఎన్, టివి 5.. లాంటి ఛానళ్ళే దిక్కు. శాటిలైట్ ఛానళ్ళలో మాత్రమే అన్ని టివిల న్యూస్ చూడగలం.
అయితే ఈ ఛానెళ్ళలో ప్రభుత్వ భజన వార్తలు మాత్రమే వస్తున్నాయి. ఇతర రాజకీయ వార్తలు నిల్. ఇలాంటి పరిస్థితి కేబుల్ టీవీ వీక్షకులకు శాపంగా మారింది…
అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న సామెతగా.. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ రకమైన విపరీత ధోరణి తలెత్తుతోంది. ఆయా రాజకీయ పార్టీలకు భజన చేస్తూ, స్త్రోత్రాలు వల్లించే ఛానెళ్ళకే పెద్దపీట వేస్తున్నారు. వ్యతిరేక వార్తలు ప్రసారం చేసే ఛానెళ్ళకు గొంతు మీద కత్తిపడుతోంది.. ఏతావాతా.. ఆయా రాజకీయ పార్టీలు కక్షలు తీర్చుకుంటూ ఆత్మ సంతృప్తి పొందుతున్నాయి, కానీ. వీక్షకులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు..
అసలు ఏ ఛానెల్ చూడాలన్నది పూర్తిగా వీక్షకుల ఛాయిసే ఇది… రాజ్యాంగం వారికిచ్చిన ప్రాథమిక హక్కు స్వేఛ్ఛ. మరి అలాంటప్పుడు వారి హక్కులకు భంగకరంగా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడల్లా
ఇలా అస్మదీయ ఛానెళ్ళను అనధికారికంగా నిషేధించడం ఎంతవరకు సబబు..
వైసిపి, తెలుగుదేశం పార్టీ ఏదైనా బుద్ధులు మాత్రం ఒకటే.. ’తమకు వ్యతిరేంగా వున్న ఛానెళ్ళపై కక్ష సాధించడం’…!
టీవీ ఛానెళ్ళ వ్యవహారాలను చూసే ట్రాయ్ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేక చేతులెత్తేస్తోంది.. ఆపరేటర్లు ఛానెళ్ళు ఇవ్వకపోతే తన బాధ్యతేముంటుందన్నది ప్రభుత్వ వాదన.. బ్యాక్ డోర్లో సూచించిన ఛానెళ్ళను ప్రసారం చెయ్యొద్దని ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తోంది. మాటవినకపోతే బెదిరిస్తోంది. ఆపరేటర్లను వేధిస్తోంది. ఇది ఆఫ్ ది రికార్డ్..!
ఇప్పుడు వీక్షకుల గోలను ఎవరు పట్టించుకుంటారు. తమ ఛాయిస్ చూడకుండా చేస్తున్న ప్రభుత్వం. దమన నీతిని ఏమనాలి. పౌరహక్కుల సంఘాలు కానీ లేక ప్రజా సంఘాలు, యాక్టివిస్టులు ఈ సమస్యపై దృష్టి సారిస్తాయా? ఏమో ! అనుమానమే…!…. ఎ.రజాహుస్సేన్
Share this Article